
ఏదీ కారుణ్యం?
● జెన్కోలో కారుణ్య నియామకాల్లో తీవ్ర జాప్యం ● మూడేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూపులు ● కేటీపీఎస్లో సుమారు 76 మంది బాధితులు
పాల్వంచ: రాష్ట్రానికి వెలుగులు పంచే విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. కర్మాగారాల్లో నిత్యం కాలుష్యం అధికంగా ఉండే రెడ్జోన్ పరిధిలో కార్మికులు విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ క్రమంలో అనేక ప్రాణాంతక వ్యాధులకు గురై అనారోగ్యంతో బాధపడుతుంటారు. వ్యాధులు, ప్రమాదాలతోపాటు అకాల మరణాలు చెందిన అనేక మంది ఉద్యోగుల కుటుంబాలకు దక్కాల్సిన కారుణ్య నియామకాలపై జెన్కో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉద్యోగ, కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నా తాత్సారం చేస్తోంది. జెన్కో వ్యాప్తంగా సుమారు 110 మంది కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తుండగా, కేవలం కేటీపీఎస్ కాంప్లెక్స్ పరిధిలోనే సుమారు 76 మంది వరకు ఉన్నట్లు కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
బాధితుల ఎదురుచూపులు
ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థల్లో జాప్యం లేకుండా కారుణ్య నియామకాలు చేపడుతున్నారు. జెన్కోలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సీఎండీలు మారడం, డైరెక్టర్స్థాయి పోస్టులు ఖాళీగా ఉండటం, ప్రభుత్వం మారడం వంటి పరిణామాలతో మూడేళ్లుగా ఈ ప్రక్రియ మందగించింది. దీంతో విధుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్న బాధిత కుటుంబీకులు మనోవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగాలు ఇప్పించేందుకు ఫైరవీల పేరుతో బాధితుల నుంచి కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగాలు వెంటనే ఇస్తే ఎక్కువ కాలం విధులు నిర్వర్తించే చేసే అవకాశం, సీనియారిటీ పెరిగి అధిక వేతనం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల నష్టపోతున్నట్లు పలువురు వాపోతున్నారు.
వర్తించని జీపీఎఫ్
1999 నుంచి 2004 మధ్యలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులకు జీపీఎఫ్ వర్తించడం లేదు. ఈపీఎఫ్ను జీపీఎఫ్గా మార్చి పెన్షన్ ఇవ్వాలని ఉద్యోగాలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్యపై కూడా ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు చేపట్టాయి. అయినా సమస్య పరిష్కారం కావడంలేదు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి, కారుణ్య నియామకాల కోసం, జీపీఎఫ్ కోసం తగిన చర్యలు చేపట్టాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాడ్ చేస్తున్నాయి.