
కురిచేడు ఎంపీడీఓ సస్పెన్షన్
కురిచేడు: కురిచేడు ఎంపీడీఓ, ఈఓఆర్డీగా విధులు నిర్వహిస్తున్న బి.సతీష్ బాబుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. గతంలో బాపట్ల జిల్లా భట్టిప్రోలు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో నిధులు దుర్వినియోగం చేసినట్లు నిరూపణ కావడంతో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ మంగళవారం సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు రాగా గురువారం ఎంపీడీఓ విధుల నుంచి వైదొలిగారు. కురిచేడు ఇన్చార్జి ఎండీపీఓగా దొనకొండ ఎంపీడీఓ ఎం.శ్రీదేవిని నియమించారు.
ఏపీఐఐసీ భూముల పరిశీలన
మాచర్ల రూరల్: మండలంలోని రాయవరం గ్రామ సమీపంలోని ఏపీఐఐసీకి చెందిన భూములను తైవాన్ దేశానికి చెందిన ఏషియా కంపెనీ పారిశ్రామికవేత్తలు పరిశీలించారు. లెదర్ పార్కు ఏర్పాటు కోసం గురువారం వారు ఆయా భూముల గురించి తెలుసుకున్నారు. భవన నిర్మాణాలకు అనుకూలత, నీటి వసతి, విద్యుత్, భూగర్భ జలాలు, నేషనల్ హైవే, ఇతర రహదారి మార్గాలను వారు పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ బి. కిరణ్ కుమార్తో పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో రెవెన్యూ, ఇండస్ట్రియల్ అధికారులు పాల్గొన్నారు.
నేడు సత్తెనపల్లిలో సీఐటీయూ మహాసభ
సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సీఐటీయూ) 4వ రాష్ట్ర మహాసభ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో గల పుతుంబాక వెంకటపతి భవన్ నందు శుక్రవారం నిర్వహించనున్నట్లు వీఆర్ఏల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ బందగీ సాహెబ్ గురువారం తెలిపారు. మహాసభకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు హాజరవుతారని తెలిపారు. ముఖ్యంగా మహాసభలలో వీఆర్ఏల సమస్యలపై చర్చ, భవిష్యత్తు కార్యాచరణ, నూతన కార్యవర్గం తదితర అంశాల మీద చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకత్వం, డివిజన్ నాయ కులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు.
త్వరలో పిడుగురాళ్ల వైద్య కళాశాల ప్రారంభిస్తాం
రెంటచింతల: పిడుగురాళ్ల వైద్య కళాశాలను రానున్న విద్యాసంవత్సరంలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి సత్యకుమార్ వెల్లడించారు. గురువారం రాత్రి రెంటచింతలలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 3100 ఆరోగ్య ఉప కేంద్రాలను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులు మళ్లించి అసంపూర్తిగా నిర్మించిందని తెలిపారు. కేంద్రం నిధులతో కూటమి ప్రభుత్వం మరో 1700 ఆరోగ్య ఉప కేంద్రాలను గ్రామాలలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు బిఎస్సీ నర్సింగ్ చదివిన విద్యార్థులను వినియోగించుకుంటామని ఆయన తెలిపారు.