అద్దంకి: దళిత యువకులపై పోలీసులు చేసిన దమనకాండపై హోం మంత్రి అనిత వ్యాఖ్యలు చట్టవిరుద్దమని దళిత సంఘ నాయకుడు నీలం నాగేంద్రరావు మండిపడ్డారు. మంగళవారం తెనాలిలో దళిత యువకులపై జరిపిన తాలిబన్ తరహా కూటమి ప్రభుత్వ ఖాకీ దమనకాండపై అద్దంకిలోని అంబేడ్కర్ భవన్ నుంచి బంగ్లా రోడ్లోని అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నాగేంద్ర మాట్లాడుతూ దళిత యువకులపై దమనకాండకు కారకులైన తెనాలి 2 టౌన్ సీఐ రాములు నాయక్, 3 టౌన్ సీఐ రమేష్ బాబులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ను మంత్రివర్గం నుంచి చంద్రబాబు నాయుడు తొలగించాలని డిమాండ్ చేశారు. తెనాలి దళిత యువకులపై పోలీసు అధికారులు చేసిన రాజ్య హింసపై కూటమి ప్రభుత్వం చేసిన కుట్ర పూరిత వ్యాఖ్యలు చట్ట విరుద్ధమని, రాజ్యాంగ వ్యతిరేకమని మండిపడ్డారు. తెనాలి దళిత యువకులపై స్థానిక మంత్రి నాదెండ్ల మనోహర్ కుట్ర పూర్వకంగా పోలీసుల చేత అనాగరిక దాడి జరిపించారని ఆరోపించారు. మూడు నెలల క్రితం తెనాలి అయితానగర్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని పోలీసులు మున్సిపల్ అధికారులచే అధికార బలంతో తొలగించాలని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రయత్నించారన్నారు. కానీ స్థానిక దళితుల ఆందోళనలతో ఆ ప్రయత్నం నీరుగారి పోయిందన్నారు. ఆ ఘటనలో పోలీస్ అధికారులకు స్థానిక దళితులకు మధ్య వివాదం నెలకొందన్నారు. చిరంజీవి అనే విశ్వాసమైన పోలీస్ కానిస్టేబుల్తో ఫిర్యాదు తీసుకొని పోలీస్ మామూళ్ల కోసం వేధించి, తెనాలిలో దళిత, ముస్లిం యువకులపై తెనాలి 2 టౌన్ సీఐ రాములు నాయక్, 3 టౌన్ సీఐ రమేష్ బాబులు తాలిబన్ తరహా పోలీస్ శిక్ష వేశారన్నారు. ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరిని కిరాతకంగా హత్య చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పోలీస్ అధికారులు ఎలా చూశారో, దళిత యువకుల పట్ల ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసన్నారు. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ని నడిరోడ్డుపై పోలీసులు దాడి చేసి కొట్టినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న అనిత డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్లి పరామర్శించలేదా అని ప్రశ్నించారు. హోం మంత్రి అనిత గతంలో ఉపాధ్యారాలేనని, రాజ్యాంగ నిపుణురాలు కాదని, న్యాయశాస్త్రం చదవలేదని తెలుసుకోవాలన్నారు. చట్ట ప్రకారం పోలీసులు కేసు నమోదు చేస్తే కోర్టులు శిక్షలు విధించాలి కానీ, శిక్షలు విధించే అధికారం ఏ ప్రభుత్వంలోనైనా పోలీసులకు లేదన్నారు. కేవలం తాలిబన్లు మాత్రమే బహిరంగ శిక్షలు వేస్తారని గుర్తు చేశారు. నేరానికి, పోలీస్ శిక్షలకు కులం ఉంటుందని తెలుగుదేశం న్యాయదేవత, రాజ్యాంగ నిపుణురాలు హోం మంత్రి అనిత తెలుసుకోవాలన్నారు. నిందితులైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రకారం అరెస్టు చేయాలన్నారు. మాల మహానాడు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దారా అంజయ్య, అద్దంకి నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షుడు అంకం కిరణ్కుమార్, కాకుమాను రవి ఈ నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. యానాది సేవా సమితి నాయకులు పోలా జీవరత్నం, ఆదినారాయణ ఎమ్మార్పీఎస్ నాయకులు యోహాన్, అంబేడ్కర్ పోరాట వేదిక కన్వీనర్ ఎర్రమల శ్రీనివాసరావు, గొడ్డటి రవి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
దళిత సంఘాల ఆధ్వర్యంలో అద్దంకిలో ఆత్మరక్షణ ర్యాలీ