
ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వడం వల్లే మరణాలు
జమ్మలమడుగు : అధికారుల నిర్లక్ష్యంతో పెన్నానదిలో ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. దీంతో పెన్నాలో ఎక్కడ ఎంత లోతు ఉందో తెలియక నీటిలోనికి దిగిన వారు ప్రాణాలు కోల్పోతున్నారు.. అని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. పెన్నా నదిలో ఈతకు దిగి మృతి చెందిన వారి కుటుంబీకులను శనివారం రాత్రి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ పెన్నానదిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిగాయన్నారు. ఇరవై అడుగుల లోతు వరకు కూడా ఇసుకను తవ్వేశారన్నారు. ప్రస్తుతం పెన్నానదిలో నీరు వచ్చి చేరిందని, ఎక్కడ ఎంత లోతు ఉందో ఎవరికి తెలియని పరిస్థితి ఉందన్నారు. పెన్నానది బ్రిడ్జి సమీపంలోనే గతంలో చాలా మంది మరణించారని గుర్తు చేశారు. మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అక్కడ ప్రమాదానికి సంబంధించిన సూచిక బోర్డులు కూడా పెట్టకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికై నా అధికారులు పెన్నానది ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎంత లోతు గుంతలు ఉన్నాయో గుర్తించి అక్కడ ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి