
లారీ ఢీకొని వీఆర్ఓ దుర్మరణం
కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో రామచంద్రాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాపురం మండలానికి చెందిన వీఆర్ఓ ఈశ్వరయ్య (59) మృతి చెందారు. టి.చదిపిరాళ్లకు ఇన్చార్జి వీఆర్ఓగా పని చేస్తున్న ఈశ్వరయ్య గురువారం జంగంపల్లెలో రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు డీలర్ సతీష్ అలియాస్ నానిని తన బైక్లో ఎక్కించుకుని చదిపిరాళ్ల నుంచి బయలుదేరారు. మార్గ మధ్యంలో రామచంద్రాపురం వద్దకు రాగానే కడప నుంచి ఎర్రగుంట్ల వైపు వెళ్తున్న లారీ ఈశ్వరయ్య బైక్ను ఢీ కొంది. ఈ ఘటనలో ఈశ్వరయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెనుక ఉన్న నాని ఎగిరి పడటంతో కాలు విరిగింది. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం కమలాపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే ఈశ్వరయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా మృతునికి భార్య, వివాహిత కుమార్తె ఉన్నారు. ఈశ్వరయ్య అందరితో కలివిడిగా ఉండటంతో ప్రజలు ఆసుపత్రికి తండోపతండాలుగా చేరుకున్నారు. ఈశ్వరయ్య మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వ ఒత్తిడి, టార్గెట్ల కారణంగానే ఈశ్వరయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు.
ఇది ప్రభుత్వ హత్యే..
వీఆర్ఓ ఈశ్వరయ్యది ప్రభుత్వ హత్యే అని ప్రభుత్వ మాజీ ఉద్యాన సలహాదారు సంబటూరు ప్రసాద్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ప్రచార ఆర్భాటాల కోసమే క్షేత్ర స్థాయి సిబ్బందిపై పని ఒత్తిడి పెంచారన్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్న భోజనం కూడా తినకుండానే రేషన్ సరుకుల పంపిణీ కోసం ఫింగర్ వేయడానికి వెళ్లిన ఈశ్వరయ్య ఇలా మృత్యువాత పడటం విచారకరమన్నారు. వీఆర్ఓ ఈశ్వరయ్య కుటుంబ సభ్యులకు అన్ని రకాల బెనిఫిట్స్ అందించి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

లారీ ఢీకొని వీఆర్ఓ దుర్మరణం