
లారీ ఢీకొని వ్యక్తి మృతి
కలకడ : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై కలకడ సమీపంలో మంంగళవారం లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. కలకడ ఎస్ఐ రామాంజనేయులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని గౌడసానివారిపల్లె గ్రామానికి చెందిన నారాయణప్ప (60) తన గ్రామ సమీపంలో పార్వతి పరమేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేపట్టాడు. చందాల కోసం సోమవారం రాత్రి కలకడకు చేరుకున్నాడు. మంగళవారం ఉదయం తిరిగి వెళుతుండగా రాయచోటి నుంచి పీలేరు వైపు వెళుతున్న లారీ ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన నారాయణప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ రామాంజనేయులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని తమ్ముని కుమారుడు రెడ్డెప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
అదుపు తప్పి ఆటో బోల్తా
పుల్లంపేట : కడప–చైన్నె జాతీయ రహదారి అప్పారాజుపేట వద్ద మంగళవారం సాయంత్రం ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. జమ్మలమడుగు పట్టణానికి చెందిన రామయ్య కుటుంబ సభ్యులు దైవదర్శనం కోసం శ్రీకాళహస్తికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అప్పారాజుపేట వద్దకు రాగానే ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. అటువైపు వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి, సీహెచ్ రమేష్, గల్లా శ్రీనివాసులు గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రేషన్ షాపు సీజ్
కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప నగరంలోని అల్మాస్పేటలో ఉన్న 29వ రేషన్ షాపును సీజ్ చేసినట్లు ఆర్డీఓ జాన్ ఇర్విన్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు మంగళవారం ఆర్డీఓ జాన్ ఇర్విన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ దక్షిణామూర్తి ఎన్ఫోర్స్మెంట్ డీటీ మనోజ్లు రేషన్ షాపును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ దక్షిణామూర్తి మాట్లాడుతూ రేషన్ షాపులో 6,220 కిలోల బియ్యం ఉండాల్సి ఉండగా, కేవలం 1720 కిలోల బియ్యంతో పాటు చక్కెర ప్యాకెట్లు 417 ప్యాకెట్లు ఉండాల్సి ఉండగా, 430 ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనిపై సరైన సమాధానం చెప్పకపోవడంతో కేసు నమోదు చేసి రేషన్ షాపు సీజ్ చేశామన్నారు. రేషన్ షాపులో ఉన్న బియ్యంతోపాటు చక్కెరను వీఆర్ఓకు అప్పగించామన్నారు. ఆర్డీఓ ఆదేశాల మేరకు వీఆర్ఓ ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేస్తామని తెలిపారు.
కూలిన ఇంటి పైకప్పు
కొండాపురం : మండల పరిధిలోని కె.రామిరెడ్డిపల్లె గ్రామంలో చప్పిడి వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన ఇంటి పై కప్పు ఉన్నట్లుండి కూలిపోయింది. మంగళవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి రైతు వివరాల మేరకు ఇటీవల కురిసిన వర్షానికి ఇంటిపై కప్పులో ఉన్న చౌడు బాగా నానడంతో బరువుకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా కూలింది. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో ఉన్న లేగ దూడలపై మట్టి పడటంతో వెంటనే స్థానికుల సాయంతో బయటకు తీయడంతో వాటికి కూడా ప్రమాదం తప్పింది.

లారీ ఢీకొని వ్యక్తి మృతి

లారీ ఢీకొని వ్యక్తి మృతి