
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన స్నేహితులు ఫారూక్(20), చైతన్య(19) ద్విచక్ర వాహనంలో బి.కొత్తకోట మండలం హార్సిలీ హిల్స్ కు వెళ్లేందుకు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రెండు ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు. మార్గమధ్యంలోని ములకలచెరువు మండలం బురకాయలకోట వద్దకు రాగా, ద్విచక్ర వాహనం నడుపుతున్న ఫారూక్కు, ఫిట్స్ రావడంతో వాహనం అదుపుతప్పి ఇద్దరు కింద పడ్డారు. చైతన్య గాయపడగా ఫారుక్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి వెళ్లాడు. స్థానికులు బాధితులు ఇద్దరిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఫారుక్ను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అదేవిధంగా ములకలచెరువు పట్టణంలోని షాపులో పనిచేస్తున్న హైదరాబాద్కు చెందిన లక్ష్మీనారాయణ (50) వ్యక్తిగత పనులపై కదిరి పట్టణానికి వెళ్లి తిరిగి ఆర్టీసీ బస్సులో ములకలచెరువుకు వస్తుండగా, మార్గమధ్యంలోని చీకటిమాను పల్లె వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపు పది మందికి పైగా గాయపడగా, లక్ష్మినారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వారు వేర్వేరు ఆసుపత్రులకు వెళ్లగా, లక్ష్మీనారాయణను స్థానికులు మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతి రుయాకు పంపారు. మదనపల్లె మండలం మాలేపాడుకు చెందిన చలపతి(60), మంగళవారం ద్విచక్ర వాహనంలో చౌడేపల్లి మండలం బోయకొండ పుణ్యక్షేత్రానికి వెళ్లాడు. తమ గ్రామానికి చెందిన సురేష్(30)తో కలిసి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలోని కృష్ణాపురం వద్ద కర్ణాటకకు చెందిన కారు వెనుకనుంచి ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆయా ఘటనలపై సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి తీవ్ర గాయాలు

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి తీవ్ర గాయాలు