
కారు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు
పీలేరు రూరల్ : కారు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని వేపులబైలు పంచాయతీ జంగంపల్లె వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సంబేపల్లె మండలం దుద్యాల పంచాయతీ పెద్ద జంగంపల్లెకు చెందిన పి. విజయలక్ష్మి(55) మంగళవారం సాయంత్రం వేపులబైలు పంచాయతీ జంగంపల్లెలో ఉన్న తమ కుమార్తె అంజనమ్మ ఇంటికి వెళ్లేందుకు పీలేరులో ఆటో ఎక్కింది. జంగంపల్లె వద్ద ఆటో దిగి రోడ్డు దాటుతుండగా మనదపల్లె వైపు నుంచి వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. అదే కారులో ఆమెను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు.