
అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి
రాయచోటి: ప్రజలు సంతృప్తి చెందేలా పీజీఆర్ఎస్ అర్జీలను చట్ట పరిధిలో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించరు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు.పెండింగ్లో ఉన్న బియాండ్ ఎస్ఎల్ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
వినతులు: రాయచోటి పట్టణానికి చెందిన ఫల్లా వనజ కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న తమకు ఇంటిస్థలం, ప్రభుత్వం తరపున ఇంటిని మంజూరు చేయాలని కలెక్టర్కు విన్నవించుకున్నారు. సుండుపల్లి మండలం, కొండల తూర్పు గ్రామానికి చెందిన పి లక్ష్మీదేవి ఒంటరి మహిళగా జీవనం సాగిస్తున్న తనకు బియ్యం కార్డు, రేషన్ మంజూరు చేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. రైల్వేకోడూరు మండలం ఎస్. కొత్తపల్లి గ్రామానికి చెందిన కె వెంకట నరసమ్మ పక్షవాతంతో బాధపడుతున్న తనకు సదరం సర్టిఫికెట్ మంజూరు చేయాలని కలెక్టర్కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డిఆర్ఓ మధుసూదన్ రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ , ఎస్డీసి రాఘవేంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రూ.4.29 లక్షల విలువైన
జీవనోపాధి సాధనాలు పంపిణీ
ప్రభుత్వం ద్వారా అందిస్తున్న జీవనోపాధి సాధనాలను సద్వినియోగం చేసుకొని తమ జీవితాన్ని మెరుగుపరచుకోవాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారంకలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆరుగురు విభిన్న ప్రతిభావంతులకు రూ.4.29 లక్షల విలువైన జీవనోపాధి సహాయక ఉపకరణాలను లబ్దిదారులకు కలెక్టర్ పంపిణీ చేశారు. ముగ్గురు లబ్ధిదారులకు ఒక్కొక్కటి రూ.90 వేలు విలువ చేసే 3 ఎలక్ట్రికల్ రెట్రో ఫిట్టెడ్ మూడు చక్రాల స్కూటర్లు, ఇద్దరికి ఒక్కొక్కటి రూ.42 వేలు విలువ గల 2 బ్యాటరీ ఆధారిత ట్రై సైకిళ్లు, ఒకరికి రూ.75 వేలు విలువ చేసే హైటెక్ హైడ్రాలిక్ కృత్రిమ కాలు తదితర ఉపకరణాలను పంపిణీ చేశారు.జేసీ ఆదర్శరాజేంద్రన్ మాట్లాడుతూ ఈ వాహనాలు, కృత్రిమ కాలు వారి స్వయం ఉపాధికి తోడ్పాటును అందిస్తాయని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్
సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించాలి
రాయచోటి: ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంపై ప్రజలలో అవగాహన కల్పించి సోలార్ ప్యానల్స్ ఇన్స్టలేషన్ ఖర్చు, సబ్సిడీల గురించి ప్రజలకు వివరించి రిజిస్ట్రేషన్లు పెంచాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విద్యుత్ శాఖ ఎస్ఈ, ఈఈలు, నెడ్క్యాప్ సిబ్బంది జిల్లాలో సోలార్ ఇన్స్టాల్ చేసే వెండర్లు తదితరులతో జిల్లాలో సీఎం సూర్యఘర్ పథకం అమలుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు ప్రత్యేకంగా నూతన విధానాన్ని తీసుకురానున్నందున బీసీ, ఓసీల మీద దృష్టి సారించాలన్నారు.