
వెన్నుపోటు పొడిచారు
పథకాలకు పేరు మార్చి ప్రజలకు
రాయచోటి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ పరిశీలకులు, కడప మేయర్ సురేష్బాబు విమర్శించారు. శనివారం రాయచోటిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వెన్నుపోటు దినోత్సవం పోస్టర్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప మేయర్ సురేష్బాబు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, మదనపల్లె ఇన్చార్జి నిస్సార్అహ్మద్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడప మేయర్ సురేష్బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోసపూరిత పాలనపై మండిపడ్డారు. రాష్ట్రం సంక్షోభంలో ఉన్న విషయం 15 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా అని నిలదీశారు. సంపద సృష్టిస్తాను.. సూపర్ సిక్స్ అమలు చేస్తానని ప్రజలను మోసం చేశారన్నారు. కేవలం పెన్షన్ మాత్రం రూ.4 వేలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 65 లక్షల పెన్షన్లు ఇస్తే నేడు కూటమి ప్రభుత్వంలో 57 లక్షల మందికి అందుతున్నాయన్నారు. ఇందులో 7 లక్షల పింఛన్లు తగ్గించడం వాస్తవం కాదా అని అన్నారు. ఏపీ అంటే ఏ అంటే అమరావతి పీ పోలవరాన్ని దోచుకోవడంగా పాలన సాగుతోందన్నారు. సంవత్సరం పాలనలో వైఎస్సార్సీపీని టార్గెట్ చేసుకుని రాష్ట్రంలో 99 శాతం ఉన్న వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను బెదిరించడమే పాలనగా కొనసాగిస్తోందన్నారు. నేడు గత ప్రభుత్వం కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని గద్దెనెక్కి కడపలో మహానాడు నిర్వహించి వైఎస్సార్సీపీ టార్గెట్గా ప్రసంగాలు చేశారన్నారు. హంద్రీనీవాను పూర్తి చేయకుండా బనకచర్లతో సస్యశ్యామలం చేస్తామని కొత్త రాగం అందుకున్నట్లు ఆరోపించారు.
బాబుకు వెన్నుపోట్లు కొత్త కాదు:
ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి
చంద్రబాబుకు అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం కొత్త కాదని తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి విమర్శించారు. నాడు ఎన్టీఆర్, నేడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. గండికోట నుంచి నాలుగు టీఎంసీల నీరు అన్నమయ్య, చిత్తూరు జిల్లాల నియోజకవర్గాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్తే దాన్ని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. ఫ్లోరైడ్ వాటర్తో ప్రజలు ఇబ్బంది పడుతుంటే రూ.2450 కోట్లతో పైప్లైన్ మంజూరు చేస్తే కూటమి ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. వైఎస్ జగన్ 5 సార్లు కరెంటు చార్జీలు పెంచారు అన్నారు.. ఆయన ఐదు సార్లు పెంచితే చంద్రబాబు ఒకేసారి ఐదు సార్లకు మించి పెంచారన్నారు.
కూటమి పాలన చేసింది శూన్యం: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని మదనపల్లి పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్ నిస్సార్అహమ్మద్ ఆరోపించారు. నారా లోకేష్ మదనపల్లె పర్యటనలో టమాటా రైతుల కోసం కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని, కమిషన్లు తగ్గిస్తామని చెప్పిన మాటలు నేటికీ అమలు కాలేదన్నారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గాలివీటి వీరనాగిరెడ్డి కూడా పాల్గొన్నారు.
సూపర్ సిక్స్ పేరుతో అన్ని వర్గాలను మోసం చేశారు: ఎమ్మెల్యే ఆకేపాటి
సూపర్ సిక్స్ పేరిట 140 హామీలు ఇచ్చి అందరికీ మంచి చేస్తామని అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసగించారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి విమర్శలు గుప్పించారు. వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తాం స్వీటు బాక్సులు తీసుకురండి అని వారిని కనిపించకుండా చేశారన్నారు. విద్యార్థులకు నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 18 అని ఇవ్వకుండానే మోసం చేశారన్నారు.
జూన్ 4 వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
జల్లా పరిశీలకులు, కడప మేయర్ సురేష్బాబు