
కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్య
ములకలచెరువు/మదనపల్లె : కుటుంబ సమస్యలతో వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ములకలచెరువు మండలంలో జరిగింది. చిన్నమొరవపల్లెకు చెందిన అమరనాథ్రెడ్డికి, శిరీష(26)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. శిరీష మదనపల్లెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేది. ఇటీవల కొంతకాలంగా తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతుండటంతో ఉద్యోగం మానేసింది. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి కుటుంబ సమస్యలతో భర్తతో గొడవపడింది. మనస్తాపం చెంది ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. ఔట్పోస్ట్ పోలీసులు వివాహిత మృతి సమాచారాన్ని ములకలచెరువు పోలీసులకు తెలియజేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.