
ఈదురు గాలులకు.. నేలవాలిన పంటలు
రాయచోటి: జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఈదురుగాలుల కారణంగా మామిడి రాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అరటి పంటకు కూడా అక్కడక్కడ నష్టం వాటిల్లింది. రాయచోటి, లక్కిరెడ్డిపల్లి వ్యవసాయ డివిజన్ల పరిధిలో మామిడి పంటకు అధికంగా నష్టం చేకూరినట్లు ఉద్యానవనాధికారుల సమాచారం. జిల్లా వ్యాప్తంగా 3500 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతినడంతో సుమారు రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఏడాది మొదట్లో చీడపీడలు వెంటాడాయి. ద్వితీయార్థంలో ప్రకృతి వైపరీత్యాలు మామిడిని పండించే రైతులను నష్టాల పాలు చేశాయి. అష్ట కష్టాలు పడి పండించిన పంట దెబ్బతినడంతో ఏమిచేయాలో దిక్కతోచని స్థితిలో అన్నదాతలు ఉన్నారు. చెట్లు విరిగిపడడం, కరెంట్ స్తంభాలు కూలడంతో విద్యుత్ శాఖకు నష్టం జరిగింది.
● రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రాజంపేట, కోడూరు వ్యవసాయ డివిజన్ల పరిధిలో ఇప్పటికే రెండు పర్యాయాలు వీచిన ఈదురుగాలులకు మామిడి, అరటి, బొప్పాయి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. శుక్రవారం రాత్రి వీచిన గాలులకు లక్కిరెడ్డిపల్లి, రామాపురం, వీరబల్లి, సంబేపల్లి, చిన్నమండెం, రాజంపేట, పెనగలూరు, గుర్రంకొండ, ఓబులవారిపల్లె ప్రాంతాల్లో మామిడికి నష్టం వాటిల్లింది. రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో అరటి తోటలను గాలులు దెబ్బతీశాయి. అసలే మామిడి దిగుబడి ఆలస్యంగా రావడం, ఆ పైన ప్రకృతి కన్నెర్ర చేయడంతో చెట్లకున్న కాయల్లో 50 శాతం మేర రాలిపోయాయి. తంబళ్లపల్లెలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పడిపోయింది.
దిగజారిన ధరలు
రారాజుగా పిలుచుకొనే వీరవల్లి బేనీషా, హిమాం పసంద్ వంటి రకాల దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. మార్కెట్లో వీటికి టన్ను లక్ష రూపాయల వరకు పలికింది. ఖాదర్, లాల్ బహర్ ఇతర మేలైన రకాలకు టన్ను రూ.50 నుంచి 70 వేల వరకు పలికింది. ప్రసుతం దిగుబడులు ప్రారంభం కాగా గాలుల కారణంగా ఒక్కసారిగా మార్కెట్ కుప్పకూలి పోయింది. రాలిన మామిడికాయలకు మార్కెట్లో టన్ను రూ.5 వేల నుంచి పదివేల లోపు ధర పలుకుతుండగా, కోసిన కాయలకు రూ.20 నుంచి 50 వేల లోపు మాత్రమే ధరలు పలుకుతుండడం మామిడి రైతులను కుంగిపోయేలా చేస్తోంది.
3500 ఎకరాల్లో దెబ్బతిన్న మామిడి
రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం

ఈదురు గాలులకు.. నేలవాలిన పంటలు

ఈదురు గాలులకు.. నేలవాలిన పంటలు