
నేడు ఒంటిమిట్టలో ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన
ఒంటిమిట్ట : మండల పరిధిలోని చింతరాజుపల్లిలోని పట్రపల్లిలో గురువారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలు పర్యటించనున్నారు. ఈ విషయాన్ని మండల వైఎస్సార్ సిపి శ్రేములు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో గురువారం పట్రపల్లి నందు జరగబోవు గంగమ్మ జాతరకు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.
ప్రశాంతంగా పాలిసెట్
రాయచోటి టౌన్ : జిల్లా వ్యాప్తంగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) ప్రశాంతంగా జరిగిందని జల్లా కో ఆర్డినేటర్ శివశంకర్, డీఆర్వో మధుసూధన్రావు తెలిపారు. బుధవారం రాయచోటి, రాజంపేట, మదనపల్లె, కలికిరిలలో 11 సెంటర్లలో పరీక్షలు జరిగాయన్నారు. బాలురు 2376 మంది, 1605 మంది బాలికలు మొత్తం 3981 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశామన్నారు. ఆయా మండల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ఏర్పాట్లు పర్యవేక్షించారని వివరించారు.
నర్సరీ పరిశీలన
సిద్దవటం : సిద్దవటం లోని అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నర్సరీలోని మొక్కలను బుధవారం సాయంత్రం కడప డీఎఫ్ఓ వినీత్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలో ఇంకొన్ని మొక్కలను పెంచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. ప్లాంటేషన్ను మరింతగా అభివృద్ధి చేసి అటవీ ప్రాంతంలో మొక్కలు నాటడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు డీఎఫ్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో రేంజర్ కళావతి, డిప్యూటీ రేంజర్ కె. ఓబులేస్, టెక్నికల్ అసిస్టెంటు రమణ, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లా పరిధిలో గల గిరిజన గురుకుల బాలుర పాఠశాలల్లో 3వ తరగతి, మిగతా తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలను నింపడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి. సురేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని టి.సుండుపల్లె, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లెలలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. ఎస్సీ –4, ఎస్టీ–32, బీసీ–2, ఓసీ–1, ఏఈక్యూ–1 సీట్లు 3వ తరగతిలో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. బ్యాక్ లాగ్ ఖాళీలను ఎస్టీ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
బోగినేని మణిపై కేసు నమోదు
ఓబులవారిపల్లె : జనసేన పార్టీ నాయకుడు, రాయలసీమ జోనల్ కన్వీనర్ బోగినేని చిన్న మణిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మండలంలోని చెన్నరాజుపోడు గ్రామంలో ఏప్రిల్ 10న శ్రీరామనవమి గ్రామోత్సవం సందర్భంగా అర్థరాత్రి పాత కక్షల కారణంగా ఎన్ఆర్ఐ పత్తి సుబ్బరాయుడు, అతని భార్య పత్తి రాజేశ్వరీపై జోగినేని దాడి చేశారు. ఈ విషయంపై పత్తి రాజేశ్వరీ దంపతులు రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు వద్ద ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు మంగళవారం రాత్రి మణిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
భద్రకాళీసమేతుడికి
చందన అలంకారం
రాయచోటి టౌన్ : అక్షయ తృతీయ సందర్భంగా రాయచోటిలోని వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారు చందన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అ ధికసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. స్వా మి, అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయంలో వెలసిన శ్రీ బసవ దేవుడికి బసవ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నేడు ఒంటిమిట్టలో ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన