
వ్యాన్ బోల్తా.... ఒకరు మృతి
రాజంపేట : మండలంలోని రోళ్లమడుగు సమీపంలో గొర్రెలను తరలిస్తున్న మినీ లారీ శుక్రవారం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రెడ్డిచర్ల చిన్నప్ప (50) మృతి చెందారు. చిన్నప్ప శుక్రవారం నెల్లూరు జిల్లా గూడూరు నుంచి గొర్రెలను కొనుగోలు చేసి సానిపాయిలోని గృహానికి తీసుకువస్తున్నారు. రోళ్ల మడుగు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో చిన్నప్ప మృతిచెందారు. ఈ మేరకు మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడు మృతి
కలికిరి : అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు తమను ఆరాధిస్తాడని భావించిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఒక్కగానొక్క కుమారుడు శుక్రవారం ప్రాణాలు విడిచారు. పోలీసుల వివరాల మేరకు.. ఈ నెల 14న మదనపల్లి నుంచి కలికిరి పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకర్ల /్ఞానేంద్ర(26) వస్తున్నారు. మదనపల్లి–తిరుపతి జాతీయ రహదారిపై చింతలవారిపల్లి బస్టాపు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంలో తల్లిదండ్రులు విలపించడం స్థానికులను కలచివేసింది. మృతుడికి సుమారు ఏదాడి కిందట వివాహమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆరుగురికి గాయాలు
బి.కొత్తకోట : ఎదురుగా వస్తున్న కారును ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు గాయపడిన సంఘటన శుక్రవారం మండలంలోని అమరనారాయణపురం వద్ద జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కురబలకోట మండలం అంగళ్లు నుంచి దొమ్మనబావికి చెందిన ఆటో డ్రైవర్ నరసింహులు 26) కాండ్లమడుగుకు వస్తున్నాడు. ఆటోలో పెద్దమండ్యం మండలం సిద్దవరానికి చెందిన మంజునాఽథ్ (30), జార్ఖండ్కు చెందిన అబ్దుల్(19), సాజిద్(19), షాహీద్(19), జెస్సీన్(20) ఆటోలో వస్తున్నారు. అమరనారాయణపురం వద్దకు రాగానే ములకలచెరువు నుంచి మదనపల్లె వెళ్తన్న కారు...ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో అందరికీ తీవ్ర గాయాలవగా అబ్దుల్, జెస్సీన్లకు కాలు విరిగింది. బాధితులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాద ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప అగ్రికల్చర్ : ఏపీ పశుసంవర్థ శాఖ ఆధ్వర్యంలో ఊటకూరు కోళ్ల ఫారంలో మూడు ప్రధాన యూనిట్ల అభివృద్ధికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శారదమ్మ తెలిపారు. పబ్లిక్, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ యూనిట్లకు ప్రభుత్వ మౌలిక వసతులను వాడుకునే అవకాశాన్ని ఇస్తామన్నారు.