AP: మానవత్వం లేదా ఏమిటీ కక్ష? | Protests On Govt by disabled people at Collectorates across Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: మానవత్వం లేదా ఏమిటీ కక్ష?

Aug 26 2025 4:55 AM | Updated on Aug 26 2025 7:47 AM

Protests On Govt by disabled people at Collectorates across Andhra Pradesh

విజయనగరం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న దివ్యాంగులు

  • రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద దివ్యాంగుల నిరసనలు, బైఠాయింపు, అర్జీలు 

  • కొత్తవి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లూ ఊడగొట్టి మా ఉసురు పోసుకుంటారా..?

  • రీ వెరిఫికేషన్‌ పేరుతో అడ్డగోలుగా కోతలు, ఏరివేతలు 

  • గతంలో ఇదే వైద్యులిచ్చిన సర్టిఫికెట్లు ఇప్పుడెందుకూ పనికిరావా? 

  • వీల్‌చైర్లలో, కాళ్లపై దేక్కుంటూ ఆస్పత్రులు, కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరగగలం..? 

  • మానవత్వం చూపాల్సింది పోయి ఇలా వేధించడం ఏమిటి..?  

  • సంపద సృష్టి అంటే దివ్యాంగుల పొట్టగొట్టడమా? 

  • పల్నాడు జిల్లాలో చెట్టుకు ఉరిపోసుకుని దివ్యాంగుడి ఆత్మహత్య

కాళ్లూ చేతులు లేవు.. అయినా పింఛన్‌ ఆపేశారు  
దేక్కుంటూ వస్తున్న 60 ఏళ్ల వృద్ధుడు షేక్‌ మౌలాలి నెల్లూరు 25వ డివిజన్‌లో ఉంటున్నాడు. రెండు చేతులు లేవు. రెండు కాళ్లు సక్రమంగా లేకపోవడంతో నడవలేడు. ఎక్కడికైనా దోగాడుకుంటూనే వెళ్లాలి. ఆయనకు ఆసరాగా ఉన్న భార్య కూడా ఇటీవల మృతి చెందింది. గత ప్రభుత్వంలో ఆయనకు రూ.6 వేల పింఛన్‌ వచ్చింది. ఇప్పుడు రీ వెరిఫికేషన్‌లో ఆధార్‌ అప్‌డేట్‌ కాలేదని పింఛన్‌ తొలగించారు. దీంతో తానెలా బతకాలంటూ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో  కలెక్టర్‌కు అర్జీ అందజేశాడు. ఆయన కష్టాలు చూసిన వారంతా కళ్లు చెమర్చారు.

సాక్షి నెట్‌వర్క్‌: కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవే తొలగించి మా ఉసురు పోసుకుంటున్నారు..! నడవలేక నేల మీద పాక్కుంటూ వచ్చేవారిని చూస్తుంటే మీ మనసు కరగడం లేదా..? హెలికాప్టర్లలో తిరుగుతున్న ప్రభుత్వ పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వటానికి చేతులు రావటం లేదా..? రూ.లక్షల కోట్లు అప్పులు చేస్తూ మాకు పింఛన్లు మాత్రం ఇవ్వలేరా? మా వైకల్యాన్ని ధ్రువీకరిస్తూ గతంలో ఇదే వైద్యులిచ్చిన సర్టిఫికెట్లు ఇప్పుడెందుకూ పనికిరావా? వాటిని కాదనటం అంటే డాక్టర్లను అవమానించటం కాదా? పింఛన్‌నే నమ్ము­కుని బతు­కీడుస్తుంటే అది కూడా ఈ ప్రభుత్వం ఓర్చుకోలేకపోతోంది...! మాపై ఎందుకింత కక్ష..? మానవత్వం చూపాల్సింది పోయి ఇలా వేధించడం ఏమిటి..? వీల్‌చైర్లలో, కాళ్లపై దేక్కుంటూ ఆస్ప­త్రులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరగగలం..? రీ వెరిఫికేషన్‌ పేరుతో పెన్షన్లలో కోత విధించి మా పొట్టకొట్టొద్దు. 

వైకల్యం శాతాన్ని ఇష్టానుసారంగా తగ్గించడంతో ఒక్క పింఛన్లే కాదు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనూ తీవ్రంగా నష్టపోతున్నాం..! ఇదీ రాష్ట్రంలో దివ్యాంగుల దురవస్థ!! తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద దివ్యాంగులు పోటెత్తారు. ఎక్కడికక్కడ నిరసనలకు దిగి బైఠాయించారు. వారి ఆందోళనకు సంఘీభావంగా వైఎస్సార్‌ సీపీ నేతలు తరలివచ్చి ప్రదర్శనల్లో పాల్గొన్నారు. రెండేళ్లుగా తనను ప్రతి నెలా ఆదుకున్న పింఛన్‌ ఇకపై ఆగిపోతోందని తీవ్ర మనస్తాపానికి గురైన దివ్యాంగుడు మారూరి రామలింగారెడ్డి సోమవారం పల్నాడు జిల్లాలో చెట్టుకు ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

                                    విశాఖపట్నంలో కలెక్టరేట్‌ వద్ద దివ్యాంగుల ధర్నా

రీ వెరిఫికేషన్‌ పేరుతో మా పొట్టకొట్టిన ఈ కూటమి ప్రభుత్వం మా ఉసురు పోసుకుంటుందని విజయవాడలోని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో దివ్యాంగులు భగ్గు­మన్నారు. తొలగించిన పెన్షన్లు తక్షణమే పునరు­ద్ధరించాలని, కక్ష సాధింపు విడనాడాలని నినదించారు. రీవెరిఫికేషన్‌ పేరుతో కోత విధించడం నీచమైన చర్య అని వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి విమర్శించారు. సంపద సృష్టించడం అంటే దివ్యాంగుల పెన్షన్‌లో కోత వేసి వారి పొట్ట­గొట్టడమేనా చంద్రబాబూ? అని ప్రశ్నించారు. సెప్టెంబర్‌లో యధావిధిగా పెన్షన్లు ఇవ్వకుంటే రాష్ట్ర­వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

                              విజయవాడలో కలెక్టరేట్‌ ఆఫీస్‌ వద్ద దివ్యాంగుల ధర్నా

అక్క, తమ్ముడి పెన్షన్‌ ఔట్‌..
ఉమ్మడి ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం గ్రామానికి చెందిన అక్క, తమ్ముడు ఇద్దరూ దివ్యాంగులే కావడంతో గత ప్రభుత్వంలో పెన్షన్‌ వచ్చింది. అక్క కరుణాదేవికి 90% వైకల్యం, తమ్ముడు పోకూరు విజయ­కుమార్‌కు 86 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరిస్తూ గతంలో వైద్యులు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం పింఛన్‌ తొలగించడంతో కలెక్టర్‌ను కలసి తమ దుస్థితి చెప్పుకునేందుకు ముప్పు తిప్పలు పడి గ్రామస్థుల సాయంతో ఒంగోలు వచ్చారు.-

పోలియో బాధితునికి కంటిచూపు బాగుందంటూ పింఛను తొలగింపు 
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శివరామకృష్ణ. నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గం ప్యాపిలికి చెందిన వ్యక్తి. ఇతనికి పుట్టుకతోనే పోలియో. కుడి కాలు చచ్చుబడిపోయింది. 15 ఏళ్లుగా దివ్యాంగుల పింఛన్‌ తీసుకుంటున్నాడు. సదరం క్యాంప్‌లో 88శాతం వైకల్యం ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించి సర్టిఫికెట్‌ జారీ చేశారు. 

కూటమి ప్రభుత్వం పింఛన్ల రీ వెరిఫికేషన్‌ చేపట్టడంతో ఇతను కూడా నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో పరిశీలనకు హాజరయ్యాడు. అయితే నీకు కంటిచూపు బాగానే ఉందంటూ పింఛను తొలగిస్తూ సచివాలయ ఉద్యోగులు నోటీసు జారీ చేయడంతో శివరామకృష్ణ అవాక్కయ్యాడు. తనకు పోలియో కాగా.. కంటి చూపు బాగుందని నోటీసు ఇవ్వడం ఏమిటని శివరామకృష్ణ వాపోయాడు. తనకు జరిగిన అన్యాయంపై సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.  
 

వైకల్యం తగ్గించి ఆపేశారు.. 
నాకు 70 శాతం వైకల్యం ఉన్నందున రూ.6 వేలు పింఛన్‌ పొందుతున్నా. రీ వెరిఫికేషన్‌లో నా వైకల్యాన్ని 37 శాతంగా తగ్గించి చూపించి పింఛన్‌ నిలిపివేశారు.
– ప్రవీణ కుమారి, ఆగడాలలంక, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా

రెండు చేతులు లేకున్నా పింఛను ఔట్‌..

ఈ ఫొటోలో ఉన్న డి.బాబు వయసు 40 ఏళ్లు. తిరుపతి రూరల్‌ మండలం తిరుచా­నూ­రులో నివసించే ఆయనకు రెండు చేతులు లేవు. గత 15 ఏళ్ల నుంచి దివ్యాంగుల పింఛను రూ.6 వేలు తీసుకుంటున్నాడు. గతంలో 75 శాతానికి­పైగా వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్‌ ఇచ్చారు. తాజాగా 40% కంటే తక్కువ ఉన్నట్లు పేర్కొంటూ పింఛను తొలగించారు. తిరుపతి కలెక్టరే­ట్‌లో సోమవారం ఆయన్ను గమనించిన ప్రతి ఒక్కరూ ఇదేం దారుణమని విస్తుపోయారు. ఇతని  పింఛను తొలగించడం దుర్మా­ర్గమని అంతా వ్యాఖ్యానించారు.

రెండు కాళ్లు పనిచేయవు.. పెన్షన్‌ కట్‌
ఎస్‌.రహమత్‌బాషా 2009లో తీవ్రమైన కండరాల వ్యాధి కారణంగా రెండు కాళ్లు చచ్చుపడి మంచానికే పరిమితమయ్యాడు. మంచం నుంచి కిందికి దిగాలన్నా ఇతరుల సాయం తప్పనిసరి. ఆయనకు 81 శాతం వైకల్యం ఉన్నట్లు 2010లో వైద్యులు సదరం సర్టిఫికెట్‌ ఇవ్వడంతో నెలకు రూ.15 వేలు పింఛన్‌ వస్తోంది. గత నెలలో రీ వెరిఫికేషన్‌లో 67 శాతం మాత్రమే వైకల్యం ఉన్నట్టు సర్టిఫికెట్‌ ఇవ్వడంతో రూ.6 వేలకు పెన్షన్‌ కుదించారు.

85 శాతం వైకల్యం ఉన్నా..

85 శాతం వైకల్యంతో, వీల్‌చైర్‌ లేకుండా నడవలేని పరిస్థితిలో ఉన్న తనకు పింఛన్‌ తగ్గించడం అన్యాయమని అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం భీమవరం గ్రామానికి చెందిన ఉగ్గిన సిద్దు కన్నీరు పెట్టుకు­న్నాడు. గత ప్రభుత్వం తనకు నెలకు రూ.15 వేలు చొప్పున పింఛను ఇవ్వగా ఇప్పుడు రూ.6 వేలకు మాత్రమే అర్హుడినంటూ నోటీసు ఇచ్చారని అనకాపల్లి కలెక్టరేట్‌ వద్ద వాపోయాడు.

రూ.6 వేలకు కోత..
పూర్తి అంగకవైకల్యం కారణంగా నాకు రూ.15 వేలు పింఛను వస్తోంది. 90 శాతం ఉన్న వైకల్యాన్ని ఇప్పుడు 60 శాతానికి తగ్గించి చూపించారు. దీంతో పింఛన్‌ రూ.6 వేలకు కుదించారు.
– బొర్రా సుధాకరమ్మ, వేంపాడు, పెదపాడు మండలం, ఏలూరు జిల్లా

పింఛన్‌తోపాటు ప్రాణం పోయింది..
ఇన్నాళ్లూ ఆదుకున్న పింఛన్‌ ఇకపై ఆగిపోతోందని తీవ్ర మనస్తాపానికి గురైన దివ్యాంగుడు చెట్టుకు ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ మారూరి రామలింగారెడ్డి (48) చూపు మందగించడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. 2022 డిసెంబర్‌లో కంటిచూపు మందగించినట్లు వైద్యులు ధ్రువీకరణ సర్టిఫికెట్‌ కూడా జారీ చేశారు. 

రెండేళ్లుగా ఆయన వికలాంగ పింఛన్‌ పొందుతున్నాడు. తాజాగా వెరిఫికే­షన్‌లో రామలింగారెడ్డి పింఛన్‌ తొలగింపు జాబితాలో ఉందని సచివాలయ సిబ్బంది చెప్పడంతో నిర్ఘాంతపోయిన బాధితుడు ఎన్నెస్పీ కార్యాలయం వెనుక చెట్టుకు ఉరిపో­సుకుని మరణించాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తన భర్త ఇకపై పింఛన్‌ రాకుంటే ఎలా జీవించాలని తీవ్రంగా మథనపడ్డాడని మృతుడి భార్య రామలింగమ్మ విలపించింది.

⇒ గుంటూరు జిల్లాలో వేలాది మంది దివ్యాంగుల పెన్షన్లు తొలగించటానికి నిరసనగా కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోటెత్తారు. వైఎస్సార్‌ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు బొక్కా అగస్టీన్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. 
⇒ కూటమి సర్కారు ఏడాది పాలనలో సుమారు 5 లక్షల పింఛన్లు తొలగించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. దివ్యాంగుల పింఛన్ల ఏరివేతకు నిరసనగా సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డితో కలసి నరసరావుపేట కలెక్టరేట్‌లో ఆయన వినతిపత్రం అందజేశారు.

⇒ దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట వందలాది మంది ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. కర్నూలు జిల్లాలో ఏకంగా 8,300 పెన్షన్లను తొలగించడం దారుణమని సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజామునెమ్మ, గోపాల్, గౌరవాధ్యక్షుడు ఎండీ ఆనంద్‌బాబు మండిపడ్డారు. 

⇒ రీ వెరిఫికేషన్‌ పేరుతో కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని దివ్యాంగుల సంఘం శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్‌ ధ్వజమెత్తారు. అర్హులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో బాధితులతో కలసి కలెక్టరేట్‌ను ముట్టడించారు. దివ్యాంగులకు సంఘీభావంగా వస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ను పుట్టపర్తిలోని గణేశ్‌ సర్కిల్‌ నుంచి పోలీసులు అడుగడుగునా అడ్డగించారు.  
 
⇒ తిరుపతి కలెక్టరేట్‌ వద్ద దివ్యాంగులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తిరుపతి జిల్లాలో ఏడు వేల ఫించన్లు తొలగిస్తూ నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

⇒ ఎంతో కాలంగా సాఫీగా అందుతున్న పింఛన్లను కూటమి ప్రభుత్వం తొలగించడం సిగ్గు చేటని దివ్యాంగులు ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. కలెక్టర్‌ కె.వెట్రిసెల్వికి వినతి పత్రం అందజేశారు. జిల్లావ్యాప్తంగా నాలుగు వేలకు పైగా దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దుర్మార్గమని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఏలూరు జిల్లా అధ్యక్షుడు మామిడిపల్లి నాగభూషణం మండిపడ్డారు.

⇒ నంద్యాల జిల్లాలో అక్రమంగా తొలగించిన దివ్యాంగుల పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ దేవనగర్‌ బాషా డిమాండ్‌ చేశారు. పింఛన్ల తొలగింపును నిరసిస్తూ పలు సంఘాలతో కలసి కలెక్టర్‌ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు.

ధర్నాను భగ్నం చేయొద్దని  సీఐని కాళ్లు  పట్టుకొని వేడుకుంటున్న దివ్యాంగులు 

⇒ డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ­రావు, బొమ్మి ఇజ్రాయిల్, అమలాపురం పార్లమెంటరీ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌లు పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

⇒ పింఛన్లపై ఆధారపడి జీవిస్తున్న దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వం అమానుషంగా వ్యవహరి­స్తోందని వైఎస్సార్‌ సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్‌ విమర్శించారు. దివ్యాంగులకు మేలు చేయాల్సింది పోయి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చిత్తూరు కలెక్టరేట్‌ ఎదుట దివ్యాంగులతో కలసి నిరసన చేపట్టి ట్రైనీ కలెక్టర్‌కు వినతిపత్రం అందచేశారు.

⇒ పింఛన్ల తొలగింపుపై అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట దివ్యాంగులు నిరసనలు, ధర్నాలతో హోరెత్తించారు. వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం, వికలాంగుల హక్కుల పోరాట సమితి, భారతీయ భీమ్‌ సేన ఆధ్వర్యంలో బైఠాయించి రాస్తారోకో చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement