
రేషన్ బియ్యం పట్టివేత
తాడిపత్రి టౌన్: స్థానిక రూరల్ పరిధిలోని గన్నెవారిపల్లి కాలనీ సమీపంలో దుర్గమ్మ గుడి వద్ద నివాసముంటున్న ముల్లా నజీర్ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 200 బస్తాల రేషన్ బియాన్ని పోలీసు, రెవెన్యూ అధికారులు సీజ్ చేసారు. అందిన పక్కా సమాచారంతో తహసీల్దార్ రజాక్వలి, సీఐ శివగంగాధర్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు చేపట్టారు. బియ్యం డంప్ చేసిన ముల్లా నజీర్, వేణుగోపాల్, గంగాధర్, చక్రపాణిపై కేసు నమోదు చేశారు.
మహిళ అనుమానాస్పద మృతి
కళ్యాణదుర్గం: కర్ణాటకలోని వైఎన్ హొసకోట సమీపంలో జిల్లాకు చెందిన ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కర్ణాటక పోలీసుల నుంచి సమాచారం అందుకున్న కంబదూరు ఎస్ఐ ప్రవీణ్, సిబ్బంది మంగళవారం అక్కడకు చేరుకుని పరిశీలించారు. వైఎన్ హొసకోట సమీపంలోని గుట్టలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని పరిశీలించి, కంబదూరు మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మిగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాగా, ఈ ఏడాది మే 22 నుంచి వరలక్ష్మి కనిపించడం లేదంటూ అప్పట్లో ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 23న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు.