
నాణ్యమైన విత్తనం సిద్ధం చేయండి
● ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్య ఆదేశం
అనంతపురం అగ్రికల్చర్: నిబంధనల మేరకు నాణ్యమైన విత్తనం సిద్ధం చేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్) జిల్లా మేనేజర్ జి.వెంకటసుబ్బయ్య ఆదేశించారు. శనివారం ఆయన స్థానికంగా ఉన్న హిమబిందు ప్రాసెసింగ్ ప్లాంట్ను సందర్శించి, అక్కడ జరుగుతున్న విత్తనశుద్ధి కార్యక్రమాన్ని పరిశీలించారు. విత్తనశుద్ధి చేసి ఆర్ఎస్కేలకు సరఫరా చేసిన విత్తనకాయలు బాగలేవని వెనక్కు వస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలు విధిగా పాటించాలని ఆదేశించారు. అవుటన్, తూకాలు కచ్చితంగా ఉండాలన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 40 శాతం రాయితీతో 1.14 లక్షల క్వింటాళ్ల వరకు వేరుశనగ పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం 15 ప్రాసెసింగ్ ప్లాంట్లలో విత్తనశుద్ధి వేగవంతంగా జరగుతోందన్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లా వ్యాప్తంగా 16 వేల క్వింటాళ్లు, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో ఉన్న ఆర్ఎస్కేలకు 8,500 క్వింటాళ్లు సరఫరా చేసినట్లు వెల్లడించారు. వ్యవసాయశాఖ సహకారంతో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయని, త్వరలోనే విత్తన పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.