
రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన
● మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి
ఉరవకొండ: ఎమర్జెన్సీ తలపించేలా పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఉరవకొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులపై తప్పుడు కేసులు బనాయించి వారిని జైలుకు పంపించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అండ్ కో పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం అనంతపురంలోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన ప్రగతి అంటూ ఏదీ లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. సంపద సృష్టి, సూపర్ సిక్స్ హామీలు కేవలం చంద్రబాబు అభూత కల్పనగానే మిగిలిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అన్ని వర్గాల ప్రజల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. పాలన గాడి తప్పడంతో రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు అడుగంటి పోతున్నాయన్నారు. లిక్కర్ స్కాంలో అసలైన దోషి చంద్రబాబు అని బెయిల్పై బయటకు వచ్చి పాలన సాగిస్తున్నాడనే విషయాన్ని టీడీపీ పెద్దలు గుర్తించాలన్నారు. రైతుల శ్రేయస్సును పూర్తిగా విస్మరించిన క్రెడిట్ కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.