పడకేసిన వైద్యం | - | Sakshi
Sakshi News home page

పడకేసిన వైద్యం

May 30 2025 1:32 AM | Updated on May 30 2025 5:17 PM

 గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో తామున్న ప్రాంతంలోనే వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలు (ఫైల్‌)

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో తామున్న ప్రాంతంలోనే వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలు (ఫైల్‌)

కూటమి.. కనికరం లేమి

చంద్రబాబు ప్రభుత్వంలో ప్రాథమిక ఆరోగ్య రంగం కుదేలు

104, 108 వాహనాల సేవలకు తీవ్ర విఘాతం

మందుల కొరతతో అల్లాడుతున్న సామాన్య రోగులు

ఏడాది పాలనలో ఆరోగ్య రంగం తిరోగమనం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రాథమిక వైద్యం పడకేసింది. కూటమి సర్కారు పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వైద్య రంగం తిరోగమనంలో వెళుతోంది. మందుల కొరత, డాక్టర్లు అందుబాటులో లేకపోవడం నిత్యకృత్యమయ్యాయి. ఇక పేదలకు అపర సంజీవనిగా వెలుగొందిన ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం కావడంతో ప్రజల కష్టాలు చెప్పనలవిగా మారాయి. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: పది రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత మందుల పంపిణీపై రాష్ట్రవ్యాప్తంగా కూటమి సర్కారు ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 50 శాతం మంది తమకు మందులు అందడం లేదని చెప్పారు. చాలాచోట్ల యాంటీబయాటిక్స్‌ లేవు. పాముకాటు మందు లేదు. గర్భిణులకు కాన్పు సమయంలో ఇచ్చే ఇంజెక్షన్లు లేవు. అంతెందుకూ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం ఆస్పత్రిలోనే మందులు లేవు. పీహెచ్‌సీ నుంచి బోధనాసుపత్రి వరకూ మందుల కొరత రోగులను వేధిస్తోంది.

దారుణ పరిస్థితులు..

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రక్తపరీక్షలు సరిగా జరగడం లేదు. ఎమర్జెన్సీ మందులు లేవని సిబ్బంది వాపోతున్నారు. చిన్నారులకు ఇచ్చే టీకాలు కూడా సరిగా సరఫరా కావడం లేదని చెబుతున్నారు.

‘ఆరోగ్య శ్రీ’ నిర్వీర్యం..

2019–24 మధ్య కాలంలో అప్పటి సీఎం జగన్‌ చొరవతో ఆరోగ్యశ్రీ పథకం కొత్త జవసత్వాలు నింపుకుంది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా 3,250 జబ్బులకు ఈ పథకం ద్వారా చికిత్సలు అందించేవారు. అయితే, చంద్రబాబు అధ్యక్షతన కూటమి సర్కారు ఏర్పటినప్పటి నుంచి పథకం ప్రకారం ‘ఆరోగ్య శ్రీ’ని నిర్వీర్యం చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు రెండు మాసాలకోసారి సమ్మెకు దిగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం త్వరలో ‘ఆరోగ్య శ్రీ’ని ప్రైవేటు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి అప్పజెప్పబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో పథకం పరిస్థితి ఎలా ఉంటుందోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

గాల్లో దీపంలా 108, 104 ..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాది మందిని ఆపత్కాలంలో ఆదుకున్న 108 అంబులెన్సులు నేడు షెడ్డుకు చేరాయి. అంబులెన్సుల నిర్వహణా సంస్థను మార్చారు. పాత వాహనాలన్నీ రాప్తాడు వద్ద షెడ్డులో పడ్డాయి. కాల్‌ వెళ్లిన 30 నిమిషాల్లో ఘటనా స్థలికి వెళ్లాల్సిన అంబులెన్సు నేడు గంటకు కూడా రావడం లేదు. ఇక 104 అంబులెన్సులకు కూటమి సర్కారు రాగానే కాలం చెల్లింది. గతంలో నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి దీర్ఘకాలిక వ్యాధుల బాధితులు, గర్భిణులకు మందులివ్వడంతో పాటు వైద్య పరీక్షలు చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. 104 వాహనాలు పల్లెలకు వెళ్లక ఏడాది అవుతోంది.

పెనుకొండలో మెడికల్‌ కాలేజీకి గ్రహణం...

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో వైఎస్‌ జగన్‌ హయాంలో రూ.375 కోట్లతో మెడికల్‌ కాలేజీకి పునాది వేశారు. కూటమి సర్కారు వచ్చాక దీన్ని ముందుకు కదలనివ్వలేదు. ఉమ్మడి జిల్లా అంతటికీ కలిపి ఇప్పటికీ ‘అనంత’లో ఒక్కటే మెడికల్‌ కళాశాల ఉంది. కొత్త కాలేజీ వస్తే శ్రీ సత్యసాయి జిల్లాకు వరం అయ్యేది. కానీ ‘కూటమి’ దీన్ని కాలరాసింది.

Medicine List not available at Govt Hospitals1
1/2

ప్రభుత్వ ఆసుపత్రులలో లేని మందుల జాబితా

 Previous YSRCP Regime Jagan's health safety campaigns organized list2
2/2

గత వైఎస్సార్ సీపీ హయాంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వివారాలు ఇలా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement