ముఖానికి మాస్క్‌.. మెడలో టవల్‌ | - | Sakshi
Sakshi News home page

ముఖానికి మాస్క్‌.. మెడలో టవల్‌

May 30 2025 1:32 AM | Updated on May 30 2025 1:32 AM

ముఖానికి మాస్క్‌.. మెడలో టవల్‌

ముఖానికి మాస్క్‌.. మెడలో టవల్‌

గుంతకల్లుటౌన్‌: సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు అంటూ నిత్యం బిజీగా ఉండే కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఓ సాధారణ వ్యక్తిలా ముఖానికి మాస్క్‌ ధరించి, మెడలో టవల్‌ వేసుకుని గుంతకల్లు ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బుధవారం రాత్రి గుంతకల్లులో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌.. తిరిగి అనంతపురం వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరిగ్గా రాత్రి 10.10 గంటల సమయంలో ముఖానికి మాస్క్‌, మెడలో టవల్‌ వేసుకుని ఆస్పత్రిలోకి ప్రవేశించిన ఆయన... తొలుత నూతన ఎంసీహెచ్‌ భవనం వద్దనున్న ప్రైవేట్‌ అంబులెన్స్‌ వద్దకు వెళ్లారు. తమ బంధువులను అనంతపురం తరలించాల్సి ఉందని, ఎంత ఖర్చవుతుందని ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌ను అడిగారు. ఆక్సిజన్‌తో అయితే రూ.5,500, ఆక్సిజన్‌ లేకుండా అయితే రూ.5 వేలు తీసుకుంటామని డ్రైవర్‌ చెప్పాడు. సరే మళ్లీ కలుస్తామని చెప్పిన కలెక్టర్‌.. అక్కడి నుంచి నేరుగా ఎమర్జెన్సీ క్యాజువాలిటీ, ఐడీ, లేబర్‌ వార్డులను పరిశీలించారు. రోగుల సహాయకులతో మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది సేవలు, మందులు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం టాయిలెట్లను పరిశీలించారు. సుమారు 25 నిమిషాల పాటు ఆస్పత్రిలో కలెక్టర్‌ తనిఖీలు చేసినా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి తెలియలేదు. కలెక్టర్‌ బయటికి వెళ్తున్న సమయంలో బయటి నుంచి స్థానిక పోలీసుల రాకను గమనించిన ఆస్పత్రి సిబ్బంది ఎవరొచ్చారు.. ఎందుకొచ్చారని తెలుసుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రోగుల వద్దకు వెళ్లి కలెక్టర్‌ ఏమడిగారు.. మీరేం సమాధానమిచ్చారంటూ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ రాత్రి వేళ ఆకస్మికంగా తనిఖీ చేయడంతో ఒక్కసారిగా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిలో అలజడి మొదలైంది.

సెక్యూరిటీ గార్డులకు మెమో ఇవ్వండి

ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆవరణలో ప్రైవేట్‌ అంబులెన్స్‌లను ఎందుకు పార్కింగ్‌ చేయిస్తున్నారని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజేంద్రరావును ప్రశ్నించారు. గురువారం డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పాల్‌రవికుమార్‌తో పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అజేంద్రరావు, డ్యూటీ డాక్టర్‌ శ్రీనివాసయాదవ్‌ ను కలెక్టరేట్‌కు పిలిపించుకున్నారు. ప్రభుత్వ అంబులెన్స్‌ను ఎందుకు నిరుపయోగంగా ఉంచారని ప్రశ్నించారు. ప్రైవేట్‌ అంబులెన్స్‌లను ఆస్పత్రి ఆవరణలో పార్కింగ్‌ చేయించడంపై కలెక్టర్‌ సీరియస్‌ అయినట్లు తెలిసింది. డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డులకు మెమో జారీ చేయాలని, ఆస్పత్రి శానిటేషన్‌ను మెరుగుపరచాలని కలెక్టర్‌ ఆదేశించినట్లు సూపరింటెండెంట్‌ వెల్లడించారు. ఆస్పత్రిలో జరుగుతున్న సాధారణ కాన్పులు, సిజేరియన్ల గురించి ఆరా కలెక్టర్‌ తీసినట్లు తెలుస్తోంది.

సాధారణ వ్యక్తిలా గుంతకల్లు ఆస్పత్రికి కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

రాత్రి 10 గంటల సమయంలో వార్డుల్లో ఆకస్మిక తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement