
54,184 క్వింటాళ్లతో ఖరీఫ్ విత్తన ప్రణాళిక
● 50,592 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీకి అనుమతులు
అనంతపురం అగ్రికల్చర్: జూన్ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్లో రైతులకు రాయితీతో 54,184 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. విత్తన వేరుశనగ 50,592 క్వింటాళ్లు పంపిణీకి అనుమతులు వచ్చినట్లు తెలిపారు. 2,380 క్వింటాళ్ల కందులు, 800 క్వింటాళ్ల విత్తన వరి, 207 క్వింటాళ్ల జీలుగు, జనుము, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలు, 60 క్వింటాళ్ల పెసర, 60 క్వింటాళ్లు అలసందలు, 36 క్వింటాళ్ల మినుములు, 45 క్వింటాళ్ల కొర్రలు, 4 క్వింటాళ్ల రాగులు పంపిణీకి కమిషనరేట్ నుంచి అనుమతులు జారీ అయినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలు 50 శాతం రాయితీతో పంపిణీకి ధరలు ఖరారైనట్లు తెలిపారు. మే మొదటి వారంలో మిగతా విత్తన ధరలు, రాయితీలు ప్రకటించగానే విత్తన సేకరణ, సరఫరా, పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు తెలిపారు.