
విశాఖ చరిత్రలో ‘క్రూయిజ్ టెర్మినల్’ ఓ మైలురాయి
● వర్చువల్గా కార్డేలియా షిప్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి సోనోవాల్ ● రాష్ట్రంలో క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ● విశాఖ క్రూయిజ్ టెర్మినల్ నుంచి బయలుదేరిన క్రూయిజ్ షిప్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఓ మైలురాయి అని కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు. బుధవారం పోర్టు అడ్మినిస్ట్రేటివ్ సమావేశ మందిరంలో కార్డెలియా క్రూయిజ్ షిప్ విశాఖ–చైన్నె సర్వీస్ను వర్చువల్ విధానంలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేరుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, కలెక్టర్ ఎం.హరేందిర ప్రసాద్, పోర్టు చైర్మన్ అంగముత్తు పాల్గొన్నారు. పోర్టు అడ్మినిస్ట్రేషన్ సమావేశం మందిరంలో కార్డెలియా టూరిజం షిప్లో ప్రయాణించే కుటుంబాలకు కందుల దుర్గేష్ బోర్డింగ్ పాస్లు అందజేశారు. అనంతరం విశాఖ పోర్టులో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్కు చేరుకున్న కార్డెలియా క్రూయిజ్ షిప్ను సందర్శించారు. క్రూయిజ్ నౌకలో వసతులు, పర్యాటకులకు అందించే సౌకర్యాలు, ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీటీడీసీ ఏర్పాటు చేసిన పర్యాటక స్టాళ్లను మంత్రి దుర్గేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించారు. అనంతరం టెర్మినల్ బిల్డింగ్, స్పెషల్ లాంజ్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్స్ తదితర అంశాలను పరిశీలించారు. బుధవారం సాయంత్రం 7.30 గంటలకు విశాఖ నుంచి క్రూయిజ్ షిప్ బయలుదేరింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విశాఖ పోర్టు అథారిటీ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలో వీలైనంత త్వరగా క్రూయిజ్ టూరిజంను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మట్లాడుతూ విశాఖ పోర్టుకు మరిన్ని క్రూయిజ్ లైనర్లు రావాలని ఆకాంక్షిస్తూ, అందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. పోర్టు చైర్మన్ ఎం.అంగముత్తు మాట్లాడుతూ ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సముద్ర సంబంధిత కేంద్రంగా, షిప్ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్, కోస్టల్ లేదా క్రూయిజ్ టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రతీ ఏడాది 5,000 మంది విద్యార్థులకు క్రూయిజ్ ఆధారిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పించి, ఉపాధి అవకాశాలకు సిద్ధం చేస్తామని వెల్లడించారు. వర్చవల్ విధానంలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా సహాయ మంత్రి శాంతను ఠాకూర్, కేంద్ర సెక్రటరీ రామచంద్రన్ పాల్గొన్నారు.

విశాఖ చరిత్రలో ‘క్రూయిజ్ టెర్మినల్’ ఓ మైలురాయి

విశాఖ చరిత్రలో ‘క్రూయిజ్ టెర్మినల్’ ఓ మైలురాయి