
చెరువులో స్నానానికి దిగి మృత్యువు పాలైన ముగ్గురు చిన్నా
డుంబ్రిగుడ : మండలంలోని పోతంగి పంచాయతీ బిల్లాపుట్టుకు చెందిన అన్నదమ్ములు గుంట కమందన్, గుంట రామదాస్కు చెందిన కుమారులు గుంట సాయికిరణ్(14), గుంట భానుతేజ్ (14) వారం రోజుల క్రితం ఇదే మండలంలోని గుంటసీమ పంచాయతీ గంగవలస గ్రామంలోని మేనత్త, మేనమామ ఇంటికి వెళ్లారు. వీళ్లు ఇదే గ్రామానికి చెందిన కొర్ర ధన్యారావు కుమారుడు కొర్ర సుశాంత్తో కలిసి ఆదివారం ఉదయం 10 గంటలకు సమీప అటవీప్రాంతానికి వెళ్లారు. అక్కడి నుంచి మామిడిపళ్లు తీసుకుని వస్తుండగా మార్గం మధ్యలో జంగమయ్య గుడి పక్కనున్న చెరువులోకి స్నానానికి దిగారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులో 10 నుంచి 12 అడుగుల లోతున నీరు చేరడంతో ముగ్గురు ప్రమాదానికి గురయ్యారు. నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. వారిని రక్షించేందుకు పరిసర ప్రాంతీయులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న గుంటసీమ సర్పంచ్ గుమ్మ నాగేశ్వరరావు, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. ఈమేరకు ఎస్ఐ కె.పాపినాయుడు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అరకు ఏరియా ఆస్పత్రికి అంబులెన్సులో తరలించారు. పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
● గుంట కమందన్కు సాయికిరణ్తోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గుంట బలరామ్కు కుమారుడు భానుతేజ్తోపాటు కుమార్తె ఉంది. సాయికిరణ్, భానుతేజ్ మృతితో ఈ రెండు కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. మృతులు ముగ్గురు వేర్వేరు పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. సాయికిరణ్ అరకులోయలోని పాఠశాలలో చదువుతుండగా భానుతేజ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని గిరిజన గురుకుల పాఠశాల, కొర్రా సుశాంత్ మండలంలోని గుంటసీమలోని ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాలలోను చదువుతున్నారు.
కూలికి వెళ్తేనే గడిచేది..
చెరువులో మునిగి మృతి చెందిన ముగ్గురు చిన్నారులకు చెందిన కుటుంబాలది దయనీయ పరిస్థితి. రోజు వారీగా కూలీకి వెళ్తేనే తప్ప.. పూట గడవని పరిస్థితి బాధిత తల్లిదండ్రులది. సుశాంత్ తండ్రి వ్యవసాయ కూలీకాగా సాయికిరణ్, భానుతేజ్ తండ్రులు ఓ ప్రైవేటు గ్యాస్ ఏజెన్సీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు చిన్నారులను చెరువు రూపంలో మృత్యువు దూరం చేసి తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
ప్రభుత్వం ఆదుకోవాలి
చెరువులో స్నానానికి దిగి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ఎంపీ తనూజరాణి, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో ఉన్న ఎంపీని బాధిత కుటుంబీకులతో సర్పంచ్ నాగేశ్వరరావు ఫోన్లో మాట్లాడించారు. అనంతరం ఆమె అరకు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్తో మాట్లాడారు. పోస్టుమార్టం త్వరగా పూర్తి చేసిన చిన్నారుల మృతదేహాలను అంబులెన్సులో వారి స్వగ్రామాలకు తరలించాలని ఎంపీ ఆదేశించారు.
ముగ్గురు చిన్నారుల మృతితో
గంగవలస, బిల్లాపుట్టులో విషాదం
స్నానానికి దిగడంతో ప్రమాదం
మృతుల్లో ఇద్దరు అన్నదమ్ముల సంతానం
పుట్టెడు దుఃఖంలో బాధిత కుటుంబాలు
ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి: అరకు ఎంపీ తనూజరాణి,
ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

చెరువులో స్నానానికి దిగి మృత్యువు పాలైన ముగ్గురు చిన్నా