విద్యాశాఖ తీరుపై ఎస్జీటీల కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ తీరుపై ఎస్జీటీల కన్నెర్ర

Jun 9 2025 6:55 AM | Updated on Jun 9 2025 7:07 AM

విశాఖ డీఈవో కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన టీచర్లు

ఆరిలోవ (విశాఖ): విద్యాశాఖలో బదిలీల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై గురువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో నిబంధన, గంటకో సవరణ, తొలుత ఇచ్చిన హామీని విస్మరించడపై నిరసన గళం వినిపించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్జీటీ) ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విశాఖ జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ఆదివారం ముట్టడించారు. నగరంతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల నుంచి వందల మంది టీచర్లు ఉదయం 9 గంటలకే డీఈవో కార్యాలయానికి చేరుకొని కదం తొక్కారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ వద్దు.. మాన్యువల్‌ కౌన్సెలింగే ముద్దు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి, ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక స్టీరింగ్‌ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఎస్జీటీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ చేపడతామని చెప్పి, ఇప్పుడు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామనడం ఆక్షేపణీయమన్నారు. గతంలో విద్యాశాఖా మంత్రి లోకేశ్‌ మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ అని మాటిచ్చి, ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా వందల ఆప్షన్లు ఇవ్వడం కష్టమన్నారు. మాన్యువల్‌ ద్వారా అయితే అవసరమైన వాటిలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్జేడీ కె.విజయభాస్కర్‌, డీఈవో ఎన్‌.ప్రేమకుమార్‌లకు వినతి పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక స్టీరింగ్‌ కమిటీ నాయకులు డి.గోపినాఽథ్‌, ఇమంది పైడిరాజు, టి.చిన్నబ్బాయి, టి.రామకృష్ణారావు, అరుణ్‌కుమార్‌, వీరభద్రరావు, సూర్యనారాయణ పాల్గొన్నారు.

మాట మార్చిన అధికారులు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బదిలీల కౌన్సెలింగ్‌లో మాన్యువల్‌ విధానం అవలంబిస్తామని విద్యా శాఖాధికారులు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కుతున్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ కోరుకుంటున్నారని, ఇంతమంది కోరుతున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌ విధానాన్ని పక్కనబెట్టి, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్న వెబ్‌ కౌన్సెలింగ్‌ను అమలు చేయడం సరికాదు.

– డి.గోపీనాథ్‌, పీఆర్‌టీయూ

అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు

విద్యాశాఖ తీరుపై ఎస్జీటీల కన్నెర్ర 1
1/1

విద్యాశాఖ తీరుపై ఎస్జీటీల కన్నెర్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement