-
చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచే పంచే చెట్లు ఇవిగో..
వేసవి సూరీడి కన్ను పడకుండా భద్రంగా ఉండే చోటు ఇల్లే! ఇంట్లో ఉండి ఎండ నుంచి తప్పించుకుంటాం సరే.. వేడి నుంచి ఉపశమనం పొందడమెలా?! ఇండోర్ ప్లాంట్స్తో! అవును.. చక్కగా ఇంట్లో కొలువుదీరి ప్యూర్ ఆక్సిజన్, చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచేవి ఇవిగో ఈ మొక్కలే!అలోవెరా.. కలబంద ఆకులలో నీటిని నిల్వ చేసే గుణం ఉంటుంది. నిర్వహణా సులువే! ఔషధ గుణాలు పుష్కలం. దీని ఆకుల్లోని జెల్.. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది.. వడదెబ్బతో సహా చిన్న చిన్న చర్మ సమస్యలకూ ఉపశమనం కలిగిస్తుంది.పీస్ లిల్లీ..ఈ మొక్క సూర్యకాంతి పడని ప్లేస్లో చక్కగా ఎదుగుతుంది. గాలిలోని విషపదార్థాలను తొలగిస్తూ ఇంట్లో గాలిని ప్యూరిఫై చేస్తుంది. వేసవిలో ఈ మొక్కలకు అందమైన తెల్లని పువ్వులు పూస్తాయి. వాటితో ఇంటి అందమూ రెట్టింపవుతుంది.స్నేక్ ప్లాంట్..వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఈ మొక్కకు ఉంటుంది. టాక్సిన్లను తొలగిస్తూ ఇవీ ఇంట్లో గాలిని శుద్ధి చేసి ఆరోగ్యాన్నందిస్తాయి.బోస్టన్ ఫెర్న్..అధిక తేమ, పరోక్ష సూర్యరశ్మిలో ఇది బాగా ఎదుగుతుంది. వేసవికి సరైనవి. ఈ మొక్కలు ఇండోర్ వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా అరికడతాయి.గోల్డెన్ పోథోస్..దీన్ని డెవిల్స్ ఐవీ అని కూడా పిలుస్తారు. వేసవిని తట్టుకోవడంలో ఇది ఫస్ట్. ఇండోర్ ఎయిర్ని చక్కగా ఫిల్టర్ చేసి నాణ్యతను మెరుగుపరుస్తుంది.జెడ్ జెడ్ ప్లాంట్..దీని పెంపకం చాలా సులువు. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని జీవించగలదు. దీనికి గాలిని శుభ్రపరచే, కాలుష్యాన్ని నివారించే లక్షణాలు మెండు.స్పైడర్ ప్లాంట్..ఇది వేసవిలో బాగా పెరుగుతుంది. ప్యూర్ ఆక్సిజన్కి ప్రసిద్ధి. -
రూ. 1500 చెల్లించి మరీ చెట్లను హగ్ చేసుకోవడమా?
చెట్లను హగ్ చేసుకోవడం ఏంటీ అనుకుంటున్నారా..?. అదీగాక ఇటీవల ఓ విదేశీ మహిళ చెట్టుని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. మళ్లీ ఇందేంట్రా బాబు అనుకుంటున్నారా..!. ఓ కంపెనీ దుస్సాహసం లేదా సోమ్ము చేసుకునే సరికొత్త ప్రయత్నంగా చెప్పొచ్చు దీన్ని. ఆఖరికి సహజ సిద్ధమైన ప్రకృతిని కూడా ఇలా అమ్మకానికి పెట్టేస్తోందా అని ఆ కంపెనీపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఎక్కడ జరిగింది? ఏ కంపెనీ అంటే.. చికాగుగా, ఒత్తిడిగా ఉంటే అలా కాసేపు ఓ పార్కుకో వెళ్లి ప్రకృతిలో కాసేపు సేద తీరుతాం. లేదా ఆరుబయట కాసేపు ఆకాశానికేసి చూసి ఆహా ఈ ప్రకృతి అద్భుతాలు ఊహకే అందవు అని ఆనందపడతాం. దీనికి డబ్బులు వెచ్చించాల్సిన పనిలేదు. ఈ భూమ్మీద జీవించే ప్రతి ఒక్కరి హక్కు ఇది. అదీగాక ఆరోగ నిపుణులు కూడా పచ్చని ప్రదేశాల్లో నిమగ్నమయ్యితే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పదేపదే చెబుతుంటారు. ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో ఉండే ఉద్యానవనాలు ప్రజలకు ప్రకృతి ఒడిలో సేదతీరే చక్కటి ప్రదేశాలు. అంతేగాదు ఇలా ప్రకృతితో రమించడాన్ని జపాన్లో షిన్రిన్-యోకు అంటారు. దీన్ని 1982లో జపనీస్ వ్యవసాయ, అటవీ మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఈ పేరుతో ప్రజలకు ఉచితంగా అటవీ ప్రాంతంలో గడపడం, కనెక్ట్ అవ్వడం వంటివి నేర్పిస్తుంది. దీని వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నది వారి నమ్మకం. అయితే ఇటీవల బెంగుళూరుకి చెందిన ఓ కంపెనీ అచ్చం అలాంటి కాన్సెప్ట్తో జస్ట్ రూ. 1500లతో గైడెడ్ ఫారెస్ట్ బాత్ అనుభవాలు నేర్పిస్తామంటూ ప్రకటన ఇవ్వడం వివాదాస్పదమయ్యింది. ఆ కంపెనీ చెట్టుని కౌగిలించుకుని వాటితో కనెక్ట్ అవ్వడం ఎలాగో నేర్పిస్తాం అంటూ ధర ప్రకటించడం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆఖరికి ప్రకృతిని కూడా అమ్మకానికి పెట్టేస్తున్నారా..? అని మండిపడుతున్నారు. ఇదేదో స్కామ్, అంటూ పోస్టులు పెట్టారు. ఇక్కడ చెట్టుని కౌగిలించుకుని వాటితో మమేకమవ్వడం వరకు బాగుంది. దీనికీ డబ్బులేం ఖర్చవ్వుతాయి. అదీ కూడా నేచర్కి ఉన్న పవర్. ఆ కంపెనీకి ఖర్చు పెట్టి చేసేదేం ఉంటుంది. వాలంటీర్గా గైడ్ చేయడమే సూచించడమే చేస్తే సరిపోయే దానికి ఇలా సొమ్ము చేసుకునే దుస్సాహాసానికి ఒడిగట్టడం అందరీకీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం తెప్పించింది. సహిస్తే చక్కగా పీల్చే గాలిని కూడా సొమ్ము చేసుకుంటారు కొందరు ప్రబుద్ధులు అని తిట్టిపోస్తున్నారు ప్రజలు. (చదవండి: వారెవ్వా..నీరజ!.. మొత్తానికి సాధించింది..!) -
US: అమెరికాలో వెయ్యేళ్ల చెట్లు..! చూస్తే ఆశ్చర్యపోతారు
మనుష్యుల ఆయుర్దాయం వంద సంవత్సరాలకు అటు ఇటు. అంతకు మించి వందలు, వేల సంవత్సరాలు బతికున్న మనుషులే కాదు ఏ ఇతర ప్రాణులు కూడా పురాణ కథల్లో తప్ప ఎక్కడా ఉండవు. కానీ, అలాంటి సజీవ సాక్ష్యాలు, ఇప్పటికీ బతికున్న చెట్లను మాత్రం మనం అమెరికాలో చూడవచ్చు. నా బాల్యంలో మా ఊళ్లో అతి పెద్దవృక్షం ఒక వేపచెట్టు. అది మా ఇంటికి సమీపంలోని ఓ అంగడి బజారులో మా గ్రామానికి నడిబొడ్డులా, బొడ్రాయిలా ఉండేది. పిల్లలు ఆడుకోవాలనుకున్నా.. పెద్దవాళ్లు పంచాయతీకి కూర్చోవాలన్నా.. నలుగురు చేరి ముచ్చట్లు పెట్టుకోవాలనుకున్నా.. కేరాఫ్ వేపచెట్టే. మా ఊళ్లో బస్టాండ్ నిర్మించే సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని తొలగించడంతో ఆ చెట్టు, మా జ్ఞాపకాలు రెండూ కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా పైడిమడుగు గ్రామంలో 5 ఎకరాల్లో విస్తరించి వున్న 800 సంవత్సరాల నాటి మర్రిచెట్టు కూడా చాలా కాలం జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. ఓ అగ్ని ప్రమాదంలో ఆ మహావృక్షం దెబ్బ తిని 2 ఎకరాలకే పరిమితం కావడం చేదుగా అనిపించే విషయం. మహబూబ్ నగర్ పట్టణ సమీపంలోని 700 సంవత్సరాల నాటి మర్రిచెట్టు, అనంతపురం జిల్లా కదిరి పట్టణ సమీపంలోనున్న ‘తిమ్మమ్మ మర్రిమాను’ .. ఇవి పేరుకు చెట్లే అయినా.. మనిషి జీవితంలో, జ్ఞాపకాల్లో ఎంతో విస్తరించాయి. రికార్డులు బద్దలు కొట్టాయి. ఇప్పుడీ చర్చ ఎందుకంటే.. చెట్టును కాపాడుకోవాలన్న తాపత్రయం. ఈ విషయంలో అమెరికాను మెచ్చుకోవచ్చు. నేను కుటుంబంతో కలిసి 2012లో అమెరికా వెళ్ళినప్పుడు, లాస్ ఎంజెల్స్లో మా అబ్బాయి మమ్మల్ని ‘ సెకోయా నేషనల్ పార్క్ ’ తీసుకెళ్లాడు. అక్కడ వేల సంవత్సరాల వయసున్న సెకోయా, షర్మాన్ మహావృక్షాలను చూసే భాగ్యం మాకు కలిగింది. వాటి దగ్గర నిలబడ్డప్పుడు మనమింత అల్పజీవులమా! అనిపించింది. దాదాపు 4 లక్షల ఎకరాల్లో, సముద్ర మట్టానికి 14 వేలకు పైగా అడుగుల ఎత్తులోనున్న సెకోయా అడవిని, పక్కకే వున్న కింగ్స్ కాన్యన్లను యునెస్కో 1976 లో నే బయోస్పియర్ ( జీవావరణం ) రిజర్వులుగా గుర్తించిందట. లాస్ ఎంజెల్స్ నుంచి రాత్రి ఏడున్నరకు బయలుదేరితే, నాలుగున్నర గంటల కారు డ్రైవ్ తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు సెకోయా అడవికి చేరుకున్నాము. మేము బుక్ చేసుకున్న గెస్ట్ హౌస్ దగ్గర అప్పుడు ఆ కీకారణ్యంలో మమ్మల్ని పలకరించే నరమానవుడు కనబడలేదు, జంతువుల అరుపులు మాత్రం వినబడ్డాయి. సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తే అక్కడున్న మెయిల్ బాక్స్లో మీ పేరుతో తాళం చెవి పెట్టాము, తీసుకొని హాయిగా ఆ చెక్క ఇంటిలో విశ్రమించమన్నారు. మరునాడు బ్రేక్ ఫాస్ట్ తర్వాత అక్కడున్న ‘ ఎలుగుబంట్లు ఉన్నాయి జాగ్రత్త ! ’ అన్న హెచ్చరిక బోర్డులను చూసి తుపాకి రాముళ్లలా చేతి కర్రలు పట్టుకొని లంచ్ టైం వరకు ఆ అడవి అంతా కలియ దిరిగాము. ఈపాటి అడవులు మనకూ వున్నాయి కాని అమెరికన్లలా మనం వాటిని కాపాడుకోలేకపోయాం, మన అడవుల్లోని మహా వృక్షాలు అడవి దొంగల పాలు ఆయిపోయాయి కదా! అన్న బాధ కలిగింది. అంతేకాదు అమెరికా వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు, తమ అడవులను సురక్షితంగా ఉంచుకుంటూనే, తమకు కావలసిన కలపను బయటి దేశాల నుండి తెప్పించుకుంటున్నారు. సాయంత్రం వరకు అడవిలో తిరిగి, అందులోని వాగులు వంకలు చూసి అక్కడి స్వచ్ఛమైన నీటిలో జలకాలాడి, అలసి సొలసి వచ్చి ఆ నిర్జనారణ్య అతిథి గృహంలో కూర్చుని తిన్న మామూలు రాత్రి భోజనం కూడా మృష్టాన్నంలా అనిపించింది. తాగిన ద్రాక్షరసం కూడా అమృతంలా తోచింది. అదే నెలాఖరులో మేమంతా ‘ యోసేమైట్ నేషనల్ పార్క్ ’ కూడా వెళ్ళాము , ఆనాటి అనుభవాలు కూడా దాదాపు ఇలాంటివే. దాదాపు ఏడున్నర లక్షల ఎకరాల్లోనున్న ఈ నిర్జన అడవి మధ్యలో పర్యాటకులకు ఏర్పాటు చేసిన ఆధునిక వసతులు చాలా బాగున్నాయి. ఇందులోని గ్రానైట్ కొండలు , హిమనీ నదాలు, ఇరుకు లోయలు, పచ్చిక బయళ్లు విశేషమైనవనే చెప్పాలి. 1984 లో ఈ జీవవైవిధ్య ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం విశేషం. యోసేమైట్ లోని పర్వతాన్ని తొలిచి ఏర్పరచిన మార్గం, జలపాతం అద్భుతం. ఈ అడవిలో మూడు రాత్రులు ఉన్నాం. వేముల ప్రభాకర్ (చదవండి: క్రూయిజ్ ఎక్కే అదృష్టం కూడా ఉండాలేమో.!) -
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన వృక్షాలివే!
చెట్లు మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వృక్షం ఏదో తెలుసా? అది ఎక్కడ ఉంది? ఈ జాబితాలో ఇంకేమి వృక్షాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైపెరియన్, కోస్ట్ రెడ్వుడ్ కాలిఫోర్నియాలోని రెడ్వుడ్ నేషనల్ పార్క్లో ఉన్న హైపెరియన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టు. దీని సగటు ఎత్తు 360 అడుగులు. ఈ చెట్టు 16 అడుగులు (4.94 మీటర్లు) కంటే అధిక వ్యాసాన్ని కలిగి ఉంటుంది. హైపెరియన్ రెడ్వుడ్కు 600 నుంచి 800 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని అంచనా. హైపెరియన్ కోస్ట్ రెడ్వుడ్లు 2,000 సంవత్సరాలకు పైగా భూమిపై ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 2006లో క్రిస్ అట్కిన్స్ , మైఖేల్ టేలర్ అనే ప్రకృతి శాస్త్రవేత్తలు హైపెరియన్ను కనుగొన్నారు. మేనరా, ఎల్లో మెరంటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉష్ణమండల వృక్షం మేనరా. ఇది మలేషియా బోర్నియోలోని సబాలోని డానుమ్ వ్యాలీ పరిరక్షణ ప్రాంతంలో ఉంది. దాని ఖచ్చితమైన ఎత్తుపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే ఈ వృక్షం ఎత్తును 331 అడుగులు (100.8 మీటర్లు)అని గుర్తించారు. మేనరా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యాంజియోస్పెర్మ్ లేదా పుష్పించే మొక్కగా ప్రసిద్ధి చెందింది. సెంచూరియన్, మౌంటైన్ యాష్ సెంచూరియన్ అనేది 330 అడుగుల (100.5 మీటర్లు) ఎత్తులో 13 అడుగుల (4.05 మీటర్లు) ట్రంక్ వ్యాసంతో కూడి ఉంటుంది. ఆస్ట్రేలియాలోని టాస్మానియాలోని ఆర్వ్ లోయలో ఈ వృక్షాల కారణంగా చెలరేగిన టాస్మానియన్ బుష్ఫైర్ల వల్ల ఈ ద్వీప భూభాగంలో దాదాపు మూడు శాతం అంటే 494,210 ఎకరాలు (200,000 హెక్టార్లు) కాలిపోయింది. డోర్నర్ ఫిర్, కోస్ట్ డగ్లస్ ఫిర్ డోర్నర్ ఫిర్ను ఒరెగాన్ కోస్ట్ రేంజ్లోని బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్మెంట్ సంరక్షిస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన డగ్లస్ ఫిర్. భూమిపై ఉన్న అత్యంత ఎత్తయిన నాన్ రెడ్వుడ్ వృక్షం. 327 అడుగుల (99.7 మీటర్లు) ఎత్తుతో, 11.5 అడుగుల (3.5 మీటర్లు) వ్యాసంతో ఇది చూపరులను ఆకట్టుకుంటుంది. 1989లో ఈ భారీ వృక్షాన్ని కనుగొన్నారు. రావెన్స్ టవర్, సిట్కా స్ప్రూస్ రావెన్స్ టవర్ అనేది 317 అడుగుల (96.7 మీటర్లు)ఎత్తు కలిగివుంటుంది. సిట్కా స్ప్రూస్ 2001లో దీనిని కనుగొన్నారు. అతను హైపెరియన్, హీలియోస్, ఐకారస్ లాంటి ఇతర పొడవైన చెట్లను కూడా కనుగొన్నాడు. రావెన్స్ టవర్ ఉత్తర కాలిఫోర్నియాలోని ప్రైరీ క్రీక్ రెడ్వుడ్స్ స్టేట్ పార్క్లో ఉంది. జెయింట్ సీక్వోయా కాలిఫోర్నియాలోని జెయింట్ సీక్వోయాస్ పొడవైన వృక్షాలుగా పేరొందాయి. సీక్వోయా నేషనల్ ఫారెస్ట్లో 314-అడుగుల (95.7 మీటర్లు) ఎత్తుతో ఈ వృక్షం ఉంది. జెయింట్ సీక్వోయాస్ 25 అడుగుల (7.7 మీటర్లు) వ్యాసంతో దృఢమైన ట్రంక్ను కలిగి ఉంటుంది. వైట్ నైట్, మన్నా గమ్ టాస్మానియాలోని ఎవర్క్రీచ్ ఫారెస్ట్ రిజర్వ్లోని మన్నా గమ్ (యూకలిప్టస్ విమినాలిస్) వృక్షం కనిపిస్తుంది. దీని ఎత్తు 299 అడుగులు (91 మీటర్లు). ఈ చెట్లు కలిగిన ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. కాగా ఆఫ్రికాలో పొడవైన చెట్ల జాతులు లేవు అయితే మౌంట్ కిలిమంజారో నేషనల్ పార్క్లో 267 అడుగుల (81.5 మీటర్లు) ఎత్తు కలిగిన ఎంటాండ్రోఫ్రాగ్మా ఎక్సెల్సమ్ వృక్షం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. -
మిస్టరీ: 'డోంట్ టచ్’ అనే హెచ్చరికతో.. 'చెచెన్, చాకా' ట్రీస్
'మధ్య అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ప్రతి చెచెన్ చెట్టుకు ‘డోంట్ టచ్’ అనే హెచ్చరిక బోర్డ్ మీద డేంజర్ బొమ్మ గీసి మరీ ఉంటుంది. అవును ఆ చెట్టు బెరడు తాకితే.. భయంకరమైన దద్దుర్లు వస్తాయి. తట్టుకోలేనంత దురద పుడుతుంది. భరించలేనంత మంట వస్తుంది. దాని బెరడు నుంచి నల్లటి జిగురు పొంగుతుంది. కొన్నేళ్లక్రితమే ఆ చెట్టుపై ఎన్నో ప్రయోగాలు జరిపి.. అది విషపూరితమని, పట్టుకుంటే ప్రమాదమని నిపుణులు తేల్చేశారు. అందుకే ఆ చెట్టుకు ‘బ్లాక్ పాయిజన్ వుడ్ ట్రీ’ అని పేరు పెట్టారు. కొన్నిసార్లు ఆ చెట్టు సమీపంలో తిరిగితే.. దద్దుర్లు వచ్చేవరకు తెలియదట ఆ చెట్టును మనం తాకామన్న సంగతి'. అయితే విచిత్రమేమిటంటే.. ఆ చెట్టుకు పక్కనే లేదా సమీపంలో ‘చాకా’ అనే మరో చెట్టూ కచ్చితంగా పెరుగుతుంది. చెచెన్ చేసిన గాయాలకు.. చాకా చెట్టు బెరడు విరుగుడుగా పనిచేస్తుంది. దద్దుర్లు రాగానే.. చాకా బెరడును కత్తిరించి.. దాని నుంచి వచ్చే జిగురును దద్దుర్లొచ్చిన చోట రాయాలి. బాడీ లోపలి నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే.. ఈ చాకా బెరడుతో టీ పెట్టుకుని తాగొచ్చు. చెచెన్ ట్రీ బెరడు తగిలిన వెంటనే చాకా ట్రీ బెరడును ఔషధంలా ఉపయోగించకపోతే.. వైద్యుల్ని సంప్రదించాల్సిందే. అయితే ఒక ప్రమాదం, దానికి పరిష్కారం రెండూ ఒకేచోట పుట్టిపెరగడం విశేషం. నిజానికి ఈ చెచెన్ – చాకా ట్రీస్ పుట్టుక వెనుక పెద్ద చరిత్రే ఉంది. కొన్ని వందల ఏళ్లక్రితం ఆగ్నేయ మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో ముగిసిన ఓ విషాద ప్రేమగాథే ఈ చెట్ల వెనుకున్న పురాణం. మాయన్ యోధులైన ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. టిజిక్, కినిచ్ అనే సోదరులు.. గొప్ప యుద్ధవీరులు.. ఆ రాజ్యానికి యువరాజులు కూడా. అయితే కినిచ్ దయా హృదయంతో, మంచివాడిగా ఉండేవాడు. ప్రేమతో, నిస్వార్థంగా జీవించేవాడు. అందరినీ ఆదరించేవాడు. పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేవాడు. చెచెన్ చెట్టు, పక్కపక్కనే ఉన్న చెచెన్, చాకా చెట్లు కానీ అతని సోదరుడు టిజిక్ మాత్రం.. కోపంతో, ఆవేశంతో నిత్యం అసహనంతో జీవించేవాడు. అందరి పట్ల అమర్యాదగా ప్రవర్తించేవాడు. అహంకారం ప్రదర్శించేవాడు. ఒకరోజు కినిచ్, టిజిక్లు రాజ్యపర్యటనలో ఉండగా.. ‘నిక్టే హా’ అనే అందమైన అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నారట. ‘ఆమె నాకు సొంతమంటే నాకు సొంతం’ అని అన్నదమ్ములిద్దరూ వాదులాటకు దిగారు. అది కాస్తా గొడవకు దారితీసి.. యుద్ధానికి సిద్ధమయ్యారు. చివరికి నిక్టే కళ్లముందే.. ఇద్దరు అన్నదమ్ములు యుద్ధానికి తెగబడ్డారట. కొన్నిరోజుల పాటు జరిగిన ఆ భయంకర యుద్ధంలో.. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేసిన ఒకనాడు.. సోదరులిద్దరూ ఒకరి చేతుల్లో ఒకరు చనిపోయారు. తనను ప్రేమించిన ఇద్దరు మహాయోధులు చనిపోయారన్న బెంగతో నిక్టే కూడా మరణించింది. మరణానంతరం స్వర్గానికి వెళ్లిన ఇద్దరు సోదరులూ.. దైవాన్ని క్షమాపణ కోరి, మళ్లీ పుట్టించమని కోరుకున్నారు. అనుగ్రహించిన దేవతలు వారికి పునర్జన్మను ప్రసాదించారు. టిజిక్.. చెచెన్ చెట్టులా.. కినిచ్.. చాకా చెట్టుగా తిరిగి జన్మించారు. అప్పుడే వారికి సమీపంలోనే నిక్టేహా అందమైన తెల్లటి పువ్వులా జన్మించిందట. నిజానికి టిజిక్ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా.. చెచెన్ చెట్టు విషాన్ని చిమ్మితే.. దాన్ని సరిచేసే ఔషధంలా కినిచ్.. చాకాలా ప్రేమను పంచుతున్నాడట. అందుకే ఈ పురాణగాథలో చెప్పినట్లే.. అన్నదమ్ములిద్దరూ ఆ చెట్ల రూపంలో ఎక్కడ పుట్టినా కలసే పుడతారట. వారి సమీపంలో నిక్టే కూడా అందమైన పువ్వు రూపంలో జన్మిస్తుందని నమ్ముతారు. ఏదేమైనా.. చెచెన్, చాకా చెట్ల జన్మరహస్యం నేటికీ ఓ మిస్టరీనే. ఈ సృష్టిలో అద్భుతమే. — సంహిత నిమ్మన -
ఇచట చెట్లకు డబ్బులు కాయబడును!
ఈ వైరల్ వీడియోను చూసిన వాళ్లు ‘చెట్లకు డబ్బులు కాస్తాయా!’ అనే సామెతకు ‘భేషుగ్గా’ అని జవాబు చెప్పవచ్చు. 2.8 లక్షల వ్యూస్ను సొంతం చేసుకున్న ఈ వీడియోలో రాయితో కొట్టి చెట్టు నుంచి ప్రజలు కాయిన్స్ తీసుకోవడం కనిపిస్తుంది. ‘సీయింగ్ ఈజ్ బిలీవింగ్’ అనే మాట నిజమేగానీ ‘ఇదెలా సాధ్యం?’ అనే ఒక ప్రశ్న మన ముందు నిటారుగా నిలబడుతుంది. ఇక అసలు విషయానికి వస్తే బిహార్లోని రాజ్గిర్ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్టు ఇది. ఈ చెట్టు బెరడు తీసి అందులో నాణెం పెడితే శుభం జరుగుతుందనే సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ పుణ్యమా అని చెట్టులో ఎటు చూసినా డబ్బులే డబ్బులు! అదృష్టం కోసం ఇంట్లో ‘మనీ ప్లాంట్’ పెట్టుకోవడం మనకు తెలిసిందే. ఈ వీడియోను చూసిన తరువాత మాత్రం ‘ఇదే అసలు సిసలు మనీప్లాంట్’ అంటున్నారు నెటిజనులు. -
పాక్ ఎన్నికలకు 54 వేల చెట్ల నరికివేత!
ఇస్లామాబాద్: ఇదేందిది... ఎన్నికలకోసం చెట్లు నరకడం ఏమిటా అనుకుంటున్నారా? అవును ఇది ఇది నిజం.. పాక్ ఎన్నికల నిర్వహణకు 56 వేల చెట్లు నరికి వేయాల్సి వచ్చింది. పాక్లో ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల కోసం మొత్తంగా 26 కోట్ల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. ఇందుకోసం 2,179 టన్నుల కాగితం అవసరమయ్యింది. కాగితాన్ని చెట్ల నుంచే తయారు చేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఒక అంచనా ప్రకారం ఒక చెట్టు నుండి దాదాపు 16 రీమ్ల కాగితాన్ని తయారు చేయవచ్చు. అటువంటి స్థితిలో ఒక టన్ను కాగితం తయారు చేయడానికి 25 చెట్లు అవసరం. దాని ప్రకారం మనం లెక్కలు వేస్తే ఎన్నికల కోసం పాకిస్తాన్లో దాదాపు 54 వేల చెట్లను నరికివేశారు. 2018 ఎన్నికల్లో 22 కోట్ల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. ఇందుకోసం 800 టన్నుల ప్రత్యేక సెక్యూరిటీ పేపర్ను ఉపయోగించారు. నియోజక వర్గాల్లో అభ్యర్థుల సంఖ్య పెరిగిన కారణంగానే బ్యాలెట్ పేపర్ల సంఖ్య పెరిగిందని పాకిస్తాన్ ఎన్నికల సంఘం పేర్కొంది. 2018 కంటే ఈసారి అభ్యర్థుల సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరిగింది. ఎన్నికల సంఘం పేపర్ల ముద్రణను సకాలంలో పూర్తి చేసింది. సోమవారం నాటికి బ్యాలెట్ పత్రాల పంపిణీ పూర్తి కానుంది. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాక్ టెస్ట్ నిర్వహించింది. ఈ మాక్ టెస్ట్ లో 859 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. పాకిస్తాన్ చాలా కాలంగా ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ను బలమైన అభ్యర్థిగా భావిస్తున్నారు. నవాజ్ మరోమారు ప్రధాని కాబోతున్నారని ఆయన పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) చెబుతోంది. -
నడిచే చెట్లను ఎప్పుడైనా చూశారా?
నడిచే చెట్ల గురించి విన్నారా?. ఔను! మీరు వింటుంది నిజమే!. ఈ చెట్లు నిజంగా నడుస్తాయి అది కూడా సూర్యకాంతిని వెతుక్కుంటూ నడుస్తాయట. అదెలా సాధ్యం అనుకుంటున్నారా?. నిజం నడిచేలా వాటి చెట్ల ఆకృతి కూడా అందుకు తగ్గట్టుగా ఉంటుంది. పైగా అలా నడిస్తే భూమిలో ఉన్న వేరు తెగిపోతుంది లేదా దాంతోపాటు ఎలా కదులుతుంది అని కదా డౌటు. అయితే ఆ చెట్టు ఎలా నడుస్తుంది? ఎలా కదులుతుందో సవివిరంగా చూద్దాం!. ఈ రకం చెట్టు దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చెట్లను సక్రాటియా ఎక్సరిజా అంటారు. వాటి మూలాలు సూర్యకాంతి దిశగా పెరుగుతాయి. అందువల్ల ఇవి నడుస్తాయట. ఇవి అచ్చం తాటి చెట్టు మాదిరిగా ఉండే ప్రత్యేకమైన చెట్లు. ఏడాదికి సుమారుగా 15 నుంచి 20 మీటర్లు పొడవు పెరుగుతాయని లెక్కించారు శాస్త్రవేత్తలు. దీని వ్యాసం 16 సెం.మీ ఉంటుందని చెప్పారు. వాస్తవానికి తాటి చెట్టు వేళ్లు ఎక్కువగా నేలలోపలికి చొచ్చుకుని ఉంటాయి. ఈ చెట్లకి మాత్రం వాటి వేర్లు భూమికి వెలుపల చీపురి ఆకృతిలో ఉంటాయి. ఈ ప్రత్యేక రకం తాటి చెట్లు నడుస్తున్నప్పుడు వాటికి ఉన్న పాత వేర్లు ఊడిపోవడం(నశించిపోవడం) జరుగుతుందట. ఇలా అవి రోజుకి రెండు నుంచి 3 సెం.మీ వరకు నడుస్తాయని చెబుతున్నారు నిపుణులు. అలా ఏడాదికి ఈ చెట్టు సుమారు 20 మీటర్ల దూరం వరకు నడుస్తాయని అంచనా వేశారు. ఇలాంటి చెట్లు దట్టమైన అడవుల్లోనే ఉంటాయని చెబుతున్నారు. ఇది నిజంగా అత్యంత విచిత్రంగా ఉంది కదూ!. సూర్యరశ్మిని అనుసరిస్తూ కదలడం అలా ఏకంగా కొంత దూరం వరకు నడవడం అనేది శాస్త్రవేత్తలకు ఓ అంతు చిక్కని మిస్టరీలా ఉంది. View this post on Instagram A post shared by Advancible (@advancible) (చదవండి: ఆ ఊరిలో నాలుగొందలకు పైగా ఇళ్లు ఉన్నాయ్! కానీ సడెన్గా..) -
ఎడారిలో పచ్చదనం కోసం కృషి చేస్తున్న స్కూల్ టీచర్.. ఇప్పటికే 4లక్షల మొక్కలు
నిజాయితీగా, విరామం లేకుండా కృషి చేస్తే విజయం తప్పక సాధిస్తామని నమ్మే ట్రీ టీచర్... అతిపెద్ద థార్ ఎడారిని సస్యశ్యామలం చేసేందుకు నిర్విరామంగా కృషిచేస్తున్నాడు. ఇసుకమేటలను పచ్చని అడవులుగా మార్చేందుకు తను తాపత్రయపడుతూ.. అందరిలో అవగాహన కల్పిస్తున్నాడు. ‘‘ప్రకృతిని తన కుటుంబంలో ఒకరిగా చూసుకుంటూ భూమాతను కాపాడుకుందాం రండి’’ అంటూ పచ్చదనం పాఠాలు చెబుతున్నాడు ట్రీ టీచర్ భేరారం భాఖర్. రాజస్థాన్లోని బార్మర్ జిల్లా కుగ్రామం ఇంద్రోయ్కుచెందిన భేరారం భాఖర్ స్కూల్లో చదివే రోజుల్లో .. విద్యార్థులందర్నీ టూర్కు తీసుకెళ్లారు. ఈ టూర్లో యాభై మొక్కలను నాటడం ఒక టాస్క్గా అప్పగించారు పిల్లలకు. తన స్నేహితులతో కలిసి భేరారం కూడా మొక్కలను ఎంతో శ్రద్ధ్దగా నాటాడు. అలా మొక్కలు నాటడం తనకి బాగా నచ్చింది. టూర్ నుంచి ఇంటికొచ్చిన తరువాత మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం వల్ల ప్రకృతి బావుంటుంది అని తెలిసి భాఖర్కు చాలా సంతోషంగా అనిపించింది. మిగతా పిల్లలంతా మొక్కలు నాటడాన్ని ఒక టాస్క్గా తీసుకుని మర్చిపోతే భేరారం మాత్రం దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు.‘‘ప్రకృతిని ఎంత ప్రేమగా చూసుకుంటే అది మనల్ని అంతగా ఆదరిస్తుంది. పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత’’అని నిర్ణయించుకుని అప్పటి నుంచి మొక్కలు నాటడం మొదలు పెట్టాడు. ట్రీ టీచర్గా... మొక్కలు నాటుతూ చదువుకుంటూ పెరిగిన భాఖర్కు ప్రభుత్వ స్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది. దీంతో తనకొచ్చిన తొలిజీతాన్ని మొక్కల నాటడానికే కేటాయించాడు.‘మొక్కనాటండి, జీవితాన్ని కాపాడుకోండి’ అనే నినాదంతో తన తోటి టీచర్లను సైతం మొక్కలు నాటడానికి ప్రేరేపించాడు. ఇతర టీచర్ల సాయంతో బర్మార్ జిల్లా సరిహద్దుల నుంచి జైసల్మేర్, జోధర్, ఇంకా ఇతర జిల్లాల్లో సైతం మొక్కలు నాటుతున్నాడు. ఒకపక్క తన విద్యార్థులకు పాఠాలు చెబుతూనే, మొక్కల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ప్రకృతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొక్కలను ఉచితంగా సరఫరా చేస్తూ మొక్కలు నాటిస్తున్నాడు. తన స్కూలు విద్యార్థులకేగాక, ఇతర స్కూళ్లకు కూడా తన మోటర్ సైకిల్ మీద తిరుగుతూ మొక్కలు నరకవద్దని చెబుతూ ట్రీ టీచర్గా మారాడు భేరారం. అడవి కూడా కుటుంబమే... బర్మార్లో పుట్టిపెరిగిన భాఖర్కు అక్కడి వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. సరిగా వర్షాలు కురవకపోవడం, నీళ్లు లేక పంటలు పండకపోవడం, రైతుల ఆవేదనను ప్రత్యక్షంగా చూసి ఎడారిలో ఎలాగైనా పచ్చదనం తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడు. ఈ క్రమంలోనే... ‘ఫ్యామిలీ ఫారెస్ట్రీ’ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మొక్కను మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అనుకుంటే దానిని కచ్చితంగా కాపాడుకుంటాము. అప్పుడు మొక్కలు పచ్చగా పెరిగి ప్రకృతితో పాటు మనమూ బావుంటాము అని పిల్లలు, పెద్దల్లో అవగాహన కల్పిస్తున్నాడు. భేరారం మాటలతో స్ఫూర్తి పొందిన యువతీ యువకులు వారి చుట్టుపక్కల ఖాళీస్థలాల్లో మొక్కలు నాటుతున్నారు. నాలుగు లక్షలకుపైగా... అలుపెరగకుండా మొక్కలు నాటుకుంటూపోతున్న భేరారం ఇప్పటిదాకా నాలుగు లక్షలకుపైగా మొక్కలు నాటాడు. వీటిలో పుష్పించే మొక్కలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలతో సహా మొత్తం లక్షన్నర ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడి మట్టిలో చక్కగా పెరిగే మునగ మొక్కలు ఎక్కువగా ఉండడం విశేషం. రాజస్థాన్లోని ఎనిమిది జిల్లాల్లో పన్నెండు లక్షల విత్తనాలను నాటాడు. 28వేల కిలోమీటర్లు బైక్ మీద తిరుగుతూ లక్షా ఇరవైఐదు వేలమందికి మొక్కల నాటడంతో పాటు, వాటి ప్రాముఖ్యం గురించి అవగాహన కల్పించాడు. మొక్కలే కాకుండా 25వేల పక్షులకు వసతి కల్పించి వాటిని ఆదుకుంటున్నాడు. గాయపడిన వన్య్రప్రాణులను సైతం చేరదీస్తూ పర్యావరణాన్ని పచ్చగా ఉంచేందుకు కృషిచేస్తున్నాడు. చంద్రయాన్ మిషన్ విజయవంతమైనట్టుగా.. భేరారం కృషితో ఎడారి ప్రాంతం కూడా పచ్చదనంతో కళకళలాడాలని కోరుకుందాం. -
ఎర్రచందనం..ఎనీటైమ్ ప్రొటెక్షన్
చిప్ పనితీరు ఇలా.. రియల్టైం ప్రొటెక్షన్ చిప్ సెన్సార్ పరికరం 3.6 వాల్ట్స్ లిథియమ్ ఇయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఎర్రచందనం చెట్లను ఎవరైనా నరికినా, దొంగిలించేందుకు ప్రయత్నించినా క్షణాల్లోనే మొబైల్ అప్లికేషన్స్, వాట్సాప్లకు అలర్ట్స్ పంపిస్తుంది. చెట్ల వద్ద ఉన్న హూటర్ ఎలక్ట్రానిక్ సైరన్ మోగిస్తుంది. వెంటనే అప్రమత్తమై చెట్లను రక్షించుకోవచ్చు.మొబైల్ అప్లికేషన్స్తో క్లౌడ్ సర్వర్ను అనుసంధానం చేయడంతో యూజర్స్కు వివిధ రకాల నివేదికలు చేరవేస్తుంది. గచ్చిబౌలి : ఖరీదైన ఎర్రచందనం చెట్లను పరిరక్షించేందుకు అధునాతన పరికరం (రియల్టైం ప్రొటెక్షన్ చిప్) అందుబాటులోకి వచ్చింది. నగరంలోని బొటానికల్ గార్డెన్లో ప్రయోగాత్మకంగా చిప్ సెట్లు అమర్చినట్టు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) వైస్చైర్మన్, ఎండీ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. శుక్రవారం కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్లో విలేకరుల సమావేశంలో అధునాతన టెక్నాలజీని ఆయన వివరించారు. బొటానికల్ గార్డెన్లో 10 వేల ఎర్రచందనం మొక్కలు ఉన్నాయని, మొదటి విడతలో 50 ఎర్రచందనం చెట్లకు రియల్ టైం ప్రొటెక్షన్ చిప్లు అమర్చామని పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన సీబీఐఓటీ టెక్నాలజీస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. చిప్ల అమరికతో దొంగల నుంచి ఎర్రచందనం చెట్లను రక్షించుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే వీలుంటుందన్నారు. సీబీఐఓటీ సీఈఓ సత్యనారాయణ చొప్పదండి మాట్లాడుతూ ఎర్రచందనం చెట్ల రక్షణకు తమ సంస్థ ఇండియన్ ఉడ్ సైన్స్ టెక్నాలజీస్(ఐడబ్ల్యూఎస్టీ) సహకారంతో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఈ టెక్నాలజీని ఐడబ్ల్యూఎస్టీతో పాటు ఢిల్లీ ఐకార్, బెంగళూరు, ఝాన్సీ నగరాల్లో వాడుతున్నట్టు వివరించారు. సెన్సార్ కేసింగ్ (యాంటినో)తో అనుసంధానం చేయడంతో మొబైల్ ఫోన్లోనే చెట్ల రక్షణ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఎవరైనా చెట్టును కొట్టేందుకు ప్రయత్నించినా చిప్ సెట్ సాయంతో అలారం మోగుతుందన్నారు. ఒక్క సెన్సార్ కేసింగ్తో కిలోమీటరు దూరంలో ఉన్న 500 చెట్లకు చిప్లను అమర్చుకోవచ్చన్నారు.అధికగాలి, జంతువుల రాపిడిని గుర్తించే విధంగా చిప్ సెట్ ఉంటుందన్నారు. ప్రతిరోజూ రాత్రి చెట్టుకు సంబంధించిన సమాచారాన్ని సర్వర్కు చేరవేస్తుందన్నారు. చెట్టును కొట్టాలని చూస్తే అలారం మోగుతుందని, చెట్టు ఎక్కడ ఉందనే వివరాలు ఫోన్కు చేరవేసి మ్యాప్ ద్వారా డైరెక్షన్ చూపిస్తుందన్నారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి బ్యాటరీ మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో టీఎస్ఎఫ్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్నాయక్, డైరెక్టర్ అక్బర్, ఎకో టూరిజం ప్రాజెక్ట్ మేనేజర్ సుమన్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
Intresting Facts: పేరుకు మాత్రమే చెట్లు.. కానీ అవి చెట్ల సమాధులు
నమ్మలేని నిజాలు.. ఇది మీకు తెలుసా? ► నమీబియాలోని ‘డెడ్ వ్లయ్’లో 900 ఏళ్ల వయసు ఉన్న చెట్లు ఉన్నాయి. అయితే అవి పేరుకు మాత్రమే చెట్లు. పచ్చదనం లేకుండా ఎండిపోయిన చెట్లు! అందుకే దీన్ని ‘చెట్ల ఎడారి’ ‘చెట్ల సమాధులు’ అని పిలుస్తారు. ► చిలకలలో ‘డ్రాకూన్ చిలకలు వేరయా’ అని చెప్పుకోవచ్చు. పపువా న్యూ గినియాలోని రెయిన్ ఫారెస్ట్లో కనిపించే డ్రాకూల ప్యారట్స్ నలుపు, చార్కోల్ గ్రే రంగుల్లో ఉండి కొంచెంచెం భయపెట్టేలా ఉంటాయి. ► నార్వేలో ‘హెల్’ పేరుతో ఒక విలేజ్ ఉంది. టూరిస్ట్ ఎట్రాక్షన్లో భాగంగా ఆ పేరు పెట్టారు! -
కూల్చాల్సిన భవనాలెన్ని..కొట్టేయాల్సిన చెట్లెన్ని..?
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి మూడు కాలా(కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్విజిషన్)ల పరిధిలో అవా ర్డు పాస్ చేసేందుకు ఎన్హెచ్ఏఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం పట్టాదారుల వారీగా వివరాలు నమోదు చేస్తోంది. రోడ్డు నిర్మాణంలో సేకరించాల్సిన భూముల్లో ఉన్న నిర్మాణాలు, తోటలు, ఇతర ఆస్తుల విలువను మదింపు చేసే ప్రక్రియకు తాజా గా అధికారులు శ్రీకారం చుట్టారు. సేకరించాల్సిన భూమి విలువ ఆధారంగా పరిహారాన్ని అందించే క్రమంలో, ఆయా భూముల్లో ఉన్న నిర్మాణాలు, చెట్ల విలువలను కూడా గుణించి పరిహారం అందిస్తారు. ఇప్పుడు వాటి విలువకు సంబంధించి అధికారులు సర్వే చేస్తూ లెక్కలు సేకరిస్తున్నారు. ఉత్తరభాగంలో 8 ’కాలా’లు రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో 8 ‘కాలా’లున్న విషయం తెలిసిందే. ఇందులో యాదాద్రి–భువనగిరి, చౌటుప్పల్, ఆందోల్–జోగిపేట కాలాలకు సంబంధించి ఇటీవలే ఎన్హెచ్ఏఐ 3డీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మూడు ప్రాంతాల్లోని రైతులకు పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా అవార్డ్ పాస్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాదాద్రి ప్రాంతంలో భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ జరక్కుండా రైతులు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఎట్టిపరిస్థితుల్లో రీజినల్ రింగ్రోడ్డుకు భూములు ఇవ్వబోమంటూ వారు భీషి్మంచుకుని కూర్చున్నారు. నిరసన కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవల కొందరు రైతులపై కేసులు పెట్టిన పోలీసులు, వారికి బేడీలు వేసి మరీ కోర్టుకు తీసుకురావటం తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాంతంలో సర్వేను అలాగే పెండింగులో ఉంచిన అధికారులు, మిగతా రెండు కాలాల్లో వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సేకరించాల్సిన భూముల్లో ఉన్న ఇళ్లు, దుకాణ సముదాయాలు, పరిశ్రమలు, ఇతర నిర్మాణాల లెక్కలు తీస్తున్నారు. పొలాల్లో ఉన్న తోటలు, సాధారణ చెట్ల లెక్కలు కూడా సిద్ధం చేస్తున్నారు. వాటి నిర్ధారిత విలువ ఆధారంగా నష్టపరిహారాన్ని అందిస్తారు. ప్రైవేటు వ్యక్తులతోపాటు, కొన్ని ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు కూడా ఉన్నాయి. వాటి లెక్కలను కూడా సంబంధించి విభాగాల అధికారులతో కలిసి సర్వే చేసి సిద్ధం చేస్తున్నారు. ఎన్హెచ్ఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో రింగురోడ్డుకు అడ్డుగా ఉన్న స్తంభాలు, నీటి పైపులైన్లను తర లించేందుకు కూడా సమాంతరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్టీ లైన్లకు సంబంధించిన చిన్న స్తంభాలను తొలగించనున్నారు. అదే హైటెన్షన్, పవర్ గ్రిడ్ స్తంభాలను తొలగించకుండా, లైన్లు మరింత ఎత్తుగా ఉండేలా స్తంభాల ఎత్తును పెంచాలని నిర్ణయించారు. ఈమేరకు ట్రాన్స్కో, పవర్గ్రిడ్ అధికారులతో కలిసి ఎన్హెచ్ఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇక మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైను కూడా అడ్డుగా ఉన్నందున, ఏయే ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలో, వాటి పొడవు, ఎత్తు ఎంత ఉండాలో తేల్చేందుకు రైల్వే అధికారులతో కలిసి సర్వే చేస్తున్నారు. మిషన్ భగీరథ పైపులైన్లు ఉన్న చోట్ల ప్రత్యేక నిర్మాణాలు చేపడతారు. మరో నెల రోజుల్లో ఈ కసరత్తు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. సంగారెడ్డి–తూప్రాన్ మధ్య 30 కి.మీ.లు చొప్పున రెండు ప్యాకేజీలుగా 60 కి.మీ. నిడివి గల రింగు రోడ్డు పనులు తొలుత ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ రెండు ప్యాకేజీలకు ఈ సంవత్సరమే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరగా అవార్డు పాస్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
భావి ఫలం
పాత కథే. కానీ కొత్త విషయానికి ప్రారంభంగా పనికొస్తుంది. చావు దగ్గరపడిన ఓ ముసలాయన ఎంతో శ్రద్ధగా మొక్క నాటడాన్ని చూసిన బాటసారి నవ్వడం మనకు తెలుసు. అది ఎప్పటికి పెరిగేనూ, ఎప్పటికి కాసేనూ! ప్రతి పనినీ మన కోసమే చేయం. ముందు తరాలకు పనికొచ్చేట్టుగా చేస్తాం. అదే వాళ్ల పూర్వీకులుగా మనం ఇవ్వగలిగే కానుక! బాటసారిలో గౌరవం పెరిగేలా వృద్ధుడు ఇదే చెబుతాడు. సరిగ్గా ఇలాంటి భావనతోనే నార్వేలో ‘ఫ్యూచర్ లైబ్రరీ ప్రాజెక్ట్’ ప్రారంభమైంది. దీనికి శ్రీకారం చుట్టింది స్కాట్లాండ్కు చెందిన విజువల్ ఆర్టిస్ట్ కేటీ పేటర్సన్. ఈమె వయసు 41 ఏళ్లు. ఈ భవిష్యత్ గ్రంథాలయ ప్రాజెక్టు 2014లో ప్రారంభమైంది. వందేళ్ల పాటు అంటే 2114 వరకూ కొనసాగుతుంది. ఒక్కో ఏడాదికి ఒక్కో రచయిత తన సరికొత్త అముద్రిత రచనను ఈ గ్రంథాలయానికి బహూకరిస్తారు. మొదటి రచనగా 2014 సంవత్సరానికి మార్గరెట్ అట్వుడ్ (కెనడా) తన ‘స్క్రిబ్లర్ మూన్ ’ సమర్పించారు. 2015కు డేవిడ్ మిషెల్ (ఇంగ్లండ్) తన ‘ఫ్రమ్ మి ఫ్లోస్ వాట్ యు కాల్ టైమ్’ను ఇచ్చారు. 2016కు షివోన్ (ఐస్లాండ్), 2017కు ఏలిఫ్ షాఫక్ (టర్కీ) తమ రచనలు బహూకరించారు. 2018కి హాన్ కాంగ్ (దక్షిణ కొరియా), 2019కి కార్ల్ ఊవ్ నాస్గార్డ్ (నార్వే), 2020కి ఓసియన్ వువాంగ్ (వియత్నాం) ఇచ్చారు. ఈ రచనలన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయని కాదు, అలా ఇవ్వాలని కూడా లేదు. సౌకర్యార్థం శీర్షికల వరకు ఆంగ్లంలో అనువదించి ఉంచారు. విశేషం ఏమంటే– ఇందులోకి చేరే ‘పుస్తకాలు’ ఏమిటో కేటీకి గానీ, ఈ లైబ్రరీని నిర్వహించడానికి నెలకొల్పిన ‘ద ఫ్యూచర్ లైబ్రరీ ట్రస్టు’కు గానీ తెలీదు. సాహిత్యానికి గానీ కవిత్వానికి గానీ అద్భుతమైన చేర్పు అయిన, భవిష్యత్ తరాల ఊహలను అందుకోగలిగే శక్తి సామర్థ్యాలున్న రచయితను ఆ సంవత్సరపు రచయితగా ఎంపిక చేసుకుంటారు. వారు అంగీకరించాక, అది రాయడానికి ఒక ఏడాదైనా పడితే, ఆ పూర్తయిన రాతపత్రిని నార్వేలో జరిపే ప్రత్యేక వేడుక ద్వారా స్వీకరిస్తారు. అందుకే 2021కి గానూ సిత్సి దాంగెరెంబ్గా(జింబాబ్వే) ‘నారిని అండ్ హర్ డాంకీ’ని 2022లో ఇచ్చారు. 2022 సంవత్సరానికి జుడిత్ షలన్ స్కీ (జర్మనీ) ఈ జూన్ లో అందజేస్తారు. ఆ రాతప్రతిని ప్రత్యేకమైన వస్త్రాల్లో చుట్టి, ఓస్లో ప్రజా గ్రంథాలయంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన గదిలో ఉంచుతున్నారు. ఇవి వందేళ్ల తర్వాత ప్రచురితమవుతాయి. మరో విశేషం ఏమంటే, ఈ పుస్తకాలను అచ్చు వేయడానికే వెయ్యి చెట్లను ప్రత్యేకంగా అక్కడి నార్డ్మార్కా అటవీ ప్రాంతంలో పెంచుతున్నారు. ఈ వంద చేతిరాత ప్రతులను ఈ చెట్లతో తయారుచేసిన కాగితాలతో లిమిటెడ్–ఎడిషన్ గా ప్రచురిస్తారు. అందుకే దీన్ని ప్రపంచపు అత్యంత రహస్య గ్రంథాలయం అని గార్డియన్ పత్రిక అభివర్ణించింది. అయితే వందేళ్ల పాటు వీటిని చదవకుండా పాఠకులకు దూరంగా ఉంచుతున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. వందేళ్ల నాటికి ఈ ప్రాజెక్టును ప్రారంభించిన వాళ్లుగానీ, దీనికి పుస్తకాలు సమర్పించిన చాలామంది రచయితలుగానీ ఉండరు. మార్గరెట్ అట్వుడ్ వయసు 83 ఏళ్లు. అంతెందుకు, ఈ ప్రాజెక్టు రచయితలుగా పరిగణనలోకి వచ్చిన టోమాస్ ట్రాన్స్ ట్రోమార్ (స్వీడన్ ), ఉంబెర్టో ఎకో (ఇటలీ) ఇప్పటికే మరణించారు కూడా. ‘‘అప్పటికి దీర్ఘకాలంగా నిశ్శబ్దంగా ఉన్న నా గొంతుక ఉన్నట్టుండి, ఒక వందేళ్ల తర్వాత మేల్కొంటుందన్న ఆలోచనే చిత్రంగా ఉంది. ఆ కంటెయినర్ లోంచి ఆ పుస్తకంలోని మొదటి పేజీ తెరిచే ఇప్పటికింకా శరీరంగా రూపుదిద్దుకోని ఆ చేతికి ఆ గొంతుక ఏం చెబుతుంది?’’ అని ఉద్విగ్నంగా మాట్లాడారు మార్గరెట్ అట్వుడ్. ‘‘భవిష్యత్తులో ఎప్పుడో చదువుతారని ఆశిస్తున్న ఒక రాతప్రతిని రాయడమనే ఆలోచనే ఒక ఉత్తరం రాసి నదిలో వేయడం లాంటిది. అది ఎటు పోతుందో మనకు తెలీదు, ఎవరు చదువుతారో తెలీదు– ఆ కాలప్రవాహాన్ని విశ్వసించడమే’’ అన్నారు ‘ద బాస్టర్డ్ ఆఫ్ ఇస్తాంబుల్’, ‘ద ఫార్టీ రూల్స్ ఆఫ్ లవ్’ లాంటి నవలలు రాసిన ఎలిఫ్ షఫాక్. ఆమె ఇచ్చిన ‘ద లాస్ట్ టాబూ’ కాల ప్రవాహంలో ఏ మలుపులు తీసుకుంటుందో! ‘‘నేనెట్లాగూ మరో వందేళ్లు ఉండను. నేను ప్రేమించేవాళ్లు కూడా ఉండరు. ఈ కనికరం లేని వాస్తవం నా జీవితంలోని అత్యంత ముఖ్యమైన విషయం గురించి ఆలోచించేట్టు చేసింది. నేనెందుకు రాస్తాను? నేను రాస్తున్నప్పుడు ఎవరితో సంభాషిస్తున్నాను? ఆ తర్వాత నేను ఒక ప్రపంచాన్ని ఊహించాను, అక్కడ నేను ప్రేమించేవాళ్లు ఎవరూ ఉండరు. కానీ ఆ ప్రపంచంలో నేను బతికి వుండగా కలిసిన నార్వేలోని చెట్లు ఇంకా ఉంటాయి. మనుషులకూ, చెట్లకూ మధ్య ఉన్న స్పష్టమైన ఈ అంతరం నన్ను తాకింది. ఈ ధ్యానం ఎంత తీవ్రమైనదంటే, మన నశించిపోయే జీవితాల అశాశ్వతత్వానికీ, విలువైన పెళుసుదనాల మన జీవితాలకూ నేరుగా కళ్లు తెరిపించింది’’ అంటారు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్. ‘‘ఈ ఆలోచన అద్భుతం. ఇప్పటికింకా పుట్టని పాఠకులకు మన కాలం నుంచి వారి కాలానికి ఒక చిన్న పడవను పంపడమే ఇది’’ అన్నారు కార్ల్ ఓవ్ నాస్గార్డ్. ఇప్పుడు పెరుగుతున్న ఈ చెట్ల నుంచి కాయనున్న పుస్తకాలను ఆరగించడానికి ప్రపంచంలోని ఏ మూలల్లో మనుషులు జీవం పోసుకోనున్నారో! వందేళ్ల తర్వాత ఏం జరుగుతుందో చూడాలని ఇప్పుడే కుతూహలంగా లేదూ! -
ఈ చెట్ల పెంపకం మీ జీవితాన్ని మార్చేస్తుంది - రూ. కోట్లలో ఆదాయం పొందవచ్చు!
Mahogany Trees: జీవితంలో గొప్పవాడివి కావాలంటే తప్పకుండా ఏదో ఒక బిజినెస్ చేయాలి. బిజినెస్ అనగానే కోట్లలో పెట్టుబడి పెట్టాలనే భయం ఏ మాత్రం వద్దు. ఎందుకంటే నీ కృషి, పట్టుదలే నిన్ను జీవితంలో ఎదిగేలా చేస్తాయి. చెట్లను పెంచడం వల్ల కూడా కోటీశ్వరులయ్యే మార్గాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇందులో ఒకటి మహాగని చెట్ల పెంపకం. ఈ చెట్ల వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి? ఎన్ని రోజులకు వస్తాయనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. మహాగని మొక్కలను పెంచడం ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్లలోని ఆకులు, గింజలు, ఆఖరికి బెరడు కూడా విక్రయించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ మొక్కలు నాటిన తరువాత సుమారు 12 సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుంది. మహాగని ఉపయోగాలు మహాగని కలప సంగీత వాయిద్యాల్లోనూ, విగ్రహాల తయారీలోనూ, వాటర్క్రాఫ్ట్, అలంకార ఉత్పత్తులలోనూ ఉపయోగిస్తారు. విత్తనాలను కొన్ని ఔషదాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ఔషదాలు షుగర్, క్యాన్సర్, బీపీ వంటి రుగ్మతల నివారణకు వాడే వైద్యంలో ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఇక ఆకుల విషయానికి వస్తే, ఇవి వ్యవసాయ పురుగు మందులగా ఉపయోగిస్తారు. సబ్బు, పెయింట్ వంటి తయారీలో మహాగని నుంచి తీసిన నూనెలను వినియోగిస్తారు. ఈ విధంగా ఈ చెట్టులోకి ప్రతి భాగం అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. (ఇదీ చదవండి: చదివింది బీటెక్.. చేసేది బట్టల వ్యాపారం.. రూ. కోట్లలో టర్నోవర్) మహాగని వేర్లు భూమికి కొంత పైభాగంలోనే ఉంటాయి, కావున కొండ ప్రాంతాల్లో కాకుండా మిగిలిన అన్ని భూభాగాల్లో పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. కావున రైతులు వ్యవసాయ, బంజరు భూములలో కూడా పెంచుకోవచ్చు. ఈ చెట్టు కలప రంగును బట్టి మార్కెట్లో గిరాకీ ఉంటుంది. ఎరుపు రంగులో ఉన్న కలప ధర రూ. 1300 నుంచి రూ. 2500 వరకు (క్యూబిక్ఫీట్) ఉంటుంది. బ్రౌన్ రంగులో ఉన్న కలప కొంత తక్కువ ధర పలుకుతుంది. ఈ చెట్టు సుమారు 60 నుంచి 80 అడుగులు పెరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ చెట్టు 40 క్యూబిక్ అడుగులు పెరుగుతుంది. క్యూబిక్ ఫీట్ ధర సరాసరి రూ. 1500 అనుకున్నప్పటికీ ఒక చెట్టు రూ. 60,000 వరకు అమ్ముడవుతుంది. (ఇదీ చదవండి: కేవలం 18 నెలలు.. రూ. 100 కోట్ల టర్నోవర్ - ఒక యువతి సక్సెస్ స్టోరీ!) ఒక కేజీ మహాగని విత్తనాల ధర మార్కెట్లో రూ. 1000. ఈ విధంగా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. ఒక వ్యక్తి మహాగని పెంచాలనుకున్నప్పుడు సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో సమీకృత వ్యవసాయం కూడా చేయవచ్చు. అలాంటి పంటలు కూడా వారికి కొంత లాభాన్ని తీసుకురావడంలో సహాయపడతాయి. -
కొమ్మలు, ఆకులు లేని చెట్టు.. లిక్విడ్ ట్రీ
చెట్లు అంటే.. పెద్ద కాండం, కొమ్మలు, ఆకులు ఉంటాయి. గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని, మనకు ఆక్సిజన్ను అందిస్తాయి. కానీ ఈ చెట్లకు కాండం, కొమ్మలు, ఆకులు వంటివేవీ ఉండవు. అయినా కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయి, ఆక్సిజన్ ఇస్తాయి. వీటిని ఎక్కడ కావాలన్నా పెట్టేసుకోవచ్చు. ఎన్ని అయినా రెడీ చేసుకోవచ్చు. మరి ఏమిటా చెట్లు? వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా.. కాలుష్యానికి పరిష్కారంగా.. బొగ్గును కలపను మండించడం నుంచి వాహనాల పొగ దాకా వాతావరణం కాలుష్యం ఏటేటా పెరిగిపోతోంది. కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ పరిస్థితి ఏర్పడుతోంది. భారీగా చెట్లను పెంచడం దీనికి పరిష్కారమైతే.. అందుకు విరుద్ధంగా అడవుల నరికివేత విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఈ క్రమంలో యూరప్లో అత్యంత కాలుష్య దేశాల్లో ఒకటిగా నిలిచిన సెర్బియా శాస్త్రవేత్తలు.. వాతావరణ కాలుష్యానికి పరిష్కారం చూపేలా ‘లిక్విడ్ ట్రీస్’ను రూపొందించారు. ఏమిటీ ‘లిక్విడ్ ట్రీస్’? నీళ్లు, ఒక రకం నాచు (మైక్రో ఆల్గే) నింపి, ప్రత్యేకమైన కాంతి వెలువర్చే విద్యుత్ దీపాలను అమర్చిన ట్యాంకులే ‘నీటి చెట్లు (లిక్విడ్ ట్రీస్)’. సాంకేతికంగా వీటిని బయో రియాక్టర్లు అని పిలుస్తారు.నీటిలోని నాచు కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని.. విద్యుత్ బల్బు నుంచి వెలువడే కాంతి సాయంతో ఫొటో సింథసిస్ (కిరణజన్య సంయోగ క్రియ) జరుపుతుంది. ఈ క్రమంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఈ నీటి చెట్ల ట్యాంకులకు ‘లిక్విడ్3’ అని పేరు పెట్టారు. పదేళ్ల వయసున్న రెండు పెద్ద చెట్లతో, లేదా 200 చదరపు మీటర్ల స్థలంలోని గడ్డి, మొక్కలతో సమానమైన స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ను ‘లిక్విడ్ 3’ పీల్చుకుంటుందని దీనిని అభివృద్ధి చేసిన బెల్గ్రేడ్ యూనివర్సిటీ మల్టీడిసిప్లీనరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్త ఇవాన్ స్పాసోజెవిక్ చెప్తున్నారు. గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఎలా తగ్గుతుంది? సాధారణంగా నీటిలో కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ వివిధ శాతాల్లో కరిగి ఉంటాయి. ఏదైనా కారణంతో నీటిలో వాటి శాతం తగ్గిన ప్పుడు.. చుట్టూ ఉన్న గాలిలోంచి నీటిలోకి చేరుతాయి. ‘లిక్విడ్ 3’లోని కార్బన్ డయాక్సైడ్ను నాచు పీల్చుకున్నప్పుడు.. చుట్టూ ఉన్న గాలిలోంచి తిరిగి కార్బన్ డయాక్సైడ్ ఆ నీటిలోకి చేరుతుంది. అంటే చుట్టూ ఉన్న గాలిలో కాలుష్యం తగ్గుతుంది. ఉదాహరణకు అక్వేరియంలలోని నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను చేప పిల్లలు పీల్చుకుంటాయి. ఇలా నీటిలో తగ్గిపోయే ఆక్సిజన్ శాతాన్ని తిరిగి పెంచేందుకే గాలి బుడగలను వెలువర్చే పంపులను అమర్చుతుంటారు. అయితే ‘లిక్విడ్ 3’లో ఇలా కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంటుంది. బెంచ్గా.. చార్జర్గా.. సెర్బియాలోని బెల్గ్రేడ్లో మున్సిపాలిటీ ఆఫీసు ముందు మొట్టమొదటి ‘లిక్విడ్ 3’ ట్యాంక్ను ఏర్పాటు చేశారు. దీనిని భూమి నుంచి కాస్త లోతుగా ఏర్పాటు చేయడం వల్ల కూర్చునే బెంచ్లా ఉపయోగపడుతుంది. పైన సోలార్ ప్యానల్తో నీడ అమర్చారు. ఆ ప్యానెల్ నుంచి వచ్చే విద్యుత్తోనే ట్యాంకులో బల్బు వెలుగుతుంది. మొబైల్ ఫోన్లు వంటివి చార్జింగ్ చేసుకునే సాకెట్ కూడా ఉంటుంది. ‘ఐక్యరాజ్యసమితి అభివృద్ధి ప్రోగ్రాం (యూఎన్డీపీ)’ కింద ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 11 ఉత్తమ వినూత్న ఆవిష్కరణల్లో ‘లిక్విడ్ 3’ కూడా చోటు సాధించడం గమనార్హం. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
పొరుగింటి పచ్చదనం
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : గత పదేళ్లలో తెలంగాణలో 632 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం పెరిగింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ (647 చ.కి.మీ) తర్వాత పచ్చదనం పెరిగిన రెండో రాష్ట్రం తెలంగాణ అని ఇండియన్ ఫారెస్ట్ సర్విస్ రిపోర్ట్ తాజాగా వెల్లడించింది. తెలంగాణలో వేగంగా పట్టణీకరణ పెరుగుతున్న సమయంలో ఇది సంతోషకర పరిణామమే అయినా.. పర్యావరణవేత్తలు, జీవ వైవిధ్య నిపుణులు మాత్రం ఒక అంశంపై పెదవి విరుస్తున్నారు. అదేమిటంటే.. విస్తరిస్తున్న వనాల్లో స్థానిక మొక్కలు లేకపోవడం, ట్రాన్స్లొకేషన్ (భారీ వృక్షాలను ఒకచోటి నుంచి మరోచోటికి తరలించడం)లో సక్సెస్ రేటు సగం కూడా లేకపోవటమే. దక్కన్ పీఠభూమి విస్తారమైన ఆయుర్వేద మొక్కల నిలయమని, దేశంలోని జీవవైవిధ్య మండలాల్లో అత్యధిక దిగుబడి, పునరుత్పత్తి కలిగిన పశ్చి మ, తూర్పు కనుమల్లోని మొక్కలు, వృక్షాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కనిపించే పరిస్థితి ఉండేదని నిపుణులు చెప్తున్నారు. కానీ నేడు ఎక్కడ చూసినా విదేశీ జాతుల మొక్కలకే ప్రాధాన్యమివ్వటం వల్ల జీవవైవిధ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తలెత్తుకు నిలబడింది.. మూసీ ఒడ్డున ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలోని ఈ చింతచెట్టు వయసు సుమారు 425 సంవత్సరాలపైనే. అయినా నిటారుగా నిలబడింది. వానలు, వరదలెన్ని వచ్చినా కదల్లేదు.. కారణం లోకల్ జాతి కావటమే. ఇక్కడి వాతావరణం, భూమితో పెనవేసుకున్న బలమైన బంధంతో ఇంకా అందరి ‘చింత’తీరుస్తోంది. ఈ చెట్టే 1908 నాటి మూసీ వరదల్లో 150 మంది ప్రాణాలు కాపాడింది. ఆ ఏడాది సెపె్టంబర్ 27, 28 తేదీల్లో కుండపోత వానతో మూసీ ఉప్పొంగి తీర ప్రాంతాలను ముంచెత్తగా.. ఈ చెట్టు ఎక్కి కూర్చున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. అందుకే ఈ చెట్టుకు ఏటా సెప్టెంబర్ 28న ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. ‘బాగ్’నగర్లో.. బాగ్లు మాయం.. హైదరాబాద్ అంటేనే ‘బాగ్ నగర్’.. అంటే ఉద్యాన వనాల నగరం అని అర్థం. అప్పట్లో నగరమంతా పరుచుకున్న మొక్కలు, వృక్షాలన్నీ అన్నీ స్థానిక వెరైటీలే. నగరంలో జాంబాగ్, కుందన్బాగ్, సీతారాంబాగ్, బషీర్బాగ్, రాంబాగ్, పూల్బాగ్, కిషన్బాగ్,, మూసారాంబాగ్ , ఇబ్రహీంబాగ్, బాగ్లింగంపల్లిలతోపాటు చింత వనాలతో నిండిన ఇమ్లీబన్, చింతలబస్తీలతో హైదరాబాద్ నగరం ప్రపంచ జీవ వైవిధ్య పటంలో ప్రత్యేకంగా నిలిచేది. తూర్పు, పశ్చి మ కనుమల్లో ఉండే ప్రతిమొక్క, వృక్షం మూసీ పరీవాహకంతోపాటు హైదరాబాద్ నగరంలో కనిపించేవని పర్యావరణవేత్త డాక్టర్ కె.పురుషోత్తంరెడ్డి చెప్తున్నారు. అందులో అత్యధికం ఔషధ గుణాలున్నవేనని.. గండిపేట నీళ్లు, హైదరాబాద్ గాలి తాకగానే మనుషుల్లో మార్పు స్పష్టంగా కనిపించేదని అంటున్నారు. కానీ క్రమంగా జనావాసాలు పెరగడం, కాలనీలు, రోడ్ల విస్తరణ, ప్రభుత్వ, చెరువు భూముల కబ్జాలతో స్థానిక రకాలైన మర్రి, రావి, వేప, చింత, నేరేడు తదితర వృక్షాలన్నీ కనిపించకుండా పోయాయి. వాటి స్థానంలో అందం కోసమంటూ ఇతర ప్రాంతాలు, దేశాలకు చెందిన మొక్కలు, చెట్లను పెంచేశారు. కానీ అవి బలంగా లేక, ఈదురుగాలులకు కూలిపడుతుండటంతో ఏటా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతోంది. హరితహారంలోనూ ఇలాగే..! రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలోనూ విదేశీ జాతుల మొక్కలనే ఎక్కువగా నాటుతున్నారు. స్థానిక జాతులైతే పెరిగేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాయని.. వేగంగా పెరిగే విదేశీ జాతులను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఎడారి దేశాల్లో పెరిగే ‘కోనోకార్పస్’అనే మొక్కను రాష్ట్రమంతటా నాటారు. పెద్దగా నీటి తడి లేకున్నా పెరిగి, ఏడాదంతా పచ్చగా కనిపించే ఈ చెట్లు ఇప్పుడు అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోనూ కనిపిస్తున్నాయి. అయితే కోనోకార్పస్ పూల నుంచి వెలువడే పుప్పొడి వల్ల అలర్జీ, శ్వాసకోశ, ఆస్తమా వంటి సమస్యలు వస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. వాటి వేర్లు లోతుగా పాతుకుపోతూ.. మధ్యలో అడ్డు వచ్చే కమ్యూనికేషన్ కేబుళ్లు, డ్రైనేజీ లైన్లు, మంచినీటి వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయని.. సమీపంలో ఇతర చెట్లు పెరగకుండా చేస్తున్నాయని గుర్తించారు. ఈ చెట్ల ఆకులను స్థానిక జంతువులేవీ తినవు కూడా. దీంతో ఇప్పటికే పలు దేశాలు, రాష్ట్రాలు కోనోకార్పస్ నాటడాన్ని నిషేధించాయి. ట్రాన్స్లొకేషన్.. ట్రాజెడీయే.. రహదారుల విస్తరణ సమయంలో భారీ వృక్షాలను ట్రాన్స్లొకేషన్ చేస్తున్నా.. తదనంతర జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఆశించిన ఫలితం రావటం లేదు. అదే విధంగా వేసవి కాలంలో ట్రాన్స్లొకేషన్ చేయొద్దు. అయినా ఇదే సమయంలో చేస్తున్నారు. ట్రాన్స్లొకేషన్కు సంబంధించి త్వరలోనే ఓ ప్రొటోకాల్ విడుదల చేయనున్నాం. – ఉదయకృష్ణ, వట ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఇక్కడి ప్రతి మొక్కలో ఔషధ గుణాలే.. దక్కన్ పీఠభూమిలో పెరిగే ప్రతి మొక్క జీవ వైవిధ్యానికి పనికి వచ్చేదే. ప్రకృతి వర ప్రసాదాన్ని మనం రక్షించుకోలేకపోతున్నాం. ఇక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడ్డ వృక్షాలను తొలగించి.. వాటి స్థానంలో కాత, పూత లేని విదేశీ మొక్కలను నాటుతున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు. తూర్పు, పశ్చి మ కనుమల్లో కనుగొన్న అపార వృక్ష సంపదను ప్రత్యేక విభాగాలతో సంరక్షించాల్సి ఉంది. – డాక్టర్ కె.తులసీరావు, జీవ వైవిధ్య నిపుణుడు -
సేవ్ స్పారో
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): పిచ్చుక గూడు నిర్మాణమే ఓ అద్భుతం. ప్రకృతి తీర్చిదిద్దిన గొప్ప ఇంజనీర్లుగా పిచ్చుకలు పేరొందాయి. రేడియేషన్, వాతావరణ పరిస్థితులలో మార్పుల కారణంగా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. పట్టణాలు కాంక్రీట్ జంగిల్గా మారుతున్న తరుణంలో చెట్లు లేక పిచ్చుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి. పల్లెల్లో చెట్లు ఉన్నా.. అరకొరగానే పిచ్చుక గూళ్లు కనిపిస్తున్నాయి. కాపాడుతున్న పక్షి ప్రేమికులు గతంలో పట్టణాలలో పూరిళ్లు, పెంకుటిళ్లలో గూళ్లు ఏర్పాటు చేసుకుని పిచ్చుకలు సంతానాన్ని వృద్ధి చేసుకునేవి. నగరీకరణ నేపథ్యంలో ఇపుడా పరిస్థితి కనిపించడం లేదు. ఆహార పంటల స్థానే వాణిజ్య పంటలు సాగు చేస్తుండటంతో పిచ్చుకలు ఆహారానికి ఇబ్బందులు పడుతున్నాయి. సంతానోత్పత్తి మాట అలా ఉంచి ప్రాణాలు కాపాడుకోవడానికే ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగర వాసుల్లో పక్షుల పట్ల ప్రేమ పెరుగుతోంది. ముఖ్యంగా పిచ్చుకల కిచకిచలు వినాలని.. వాటికి ఆవాసాలు ఏర్పాటు చేయాలన్న స్పృహ చాలా మందిలో పెరిగింది. ఈ నేపథ్యంలోనే చెక్కతో చేసిన స్పారో హౌస్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆపార్ట్మెంట్స్లోని బాల్కనీలు, ఇళ్ల ముంగిట వీటిని అమరుస్తున్నారు. పిచ్చుకలకు కావాల్సిన ఆహారాన్ని, నీటిని సమకూరుస్తున్నారు. బియ్యం నూక, జొన్నలు, సజ్జలు వివిధ రకాల ధాన్యపు గింజలు వాటి కోసం పెడుతున్నారు. పక్షి ప్రేమికుల కోసం గడ్డితో తయారు చేసిన పిచ్చుక గూళ్లు సైతం కొన్ని మాల్స్లో విక్రయిస్తున్నారు. ‘స్ఫూర్తి’ నింపుతున్నారు పిచ్చుకలను రక్షించే లక్ష్యంతో విజయవాడకు చెందిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. పిల్లలకు పిచ్చుకల రక్షణపై అవగాహన కలి్పంచడం, వాటికి ఆవాసాలు ఏర్పాటుపై ఆసక్తి కల్పిస్తున్నారు. పిచ్చుకలను రక్షించుకోవడం ఎలా అనే అంశంపై వర్క్షాపులు, చిత్ర ప్రదర్శనలు సైతం నిర్వహిస్తోంది. అంతటితో సరిపెట్టకుండా చెక్కతో చేసిన కృత్రిమ ఆవాసాలను సైతం చిన్నారులకు అందిస్తోంది. కొందరు వ్యక్తులు పిచ్చుకలపై ప్రేమతో తమ ఇంటి పరిసరాల్లో వాటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ గిన్నెల్లో నీళ్లు నింపి, గింజలు పెడుతున్నారు. మార్కెట్లో లభించే స్పారో హౌస్లను తమ ఇళ్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరుకు చెందిన తోట శ్రీనివాసరావు తన ఇంటి పెరట్లోని చిన్న చెట్లకు 10కి పైగా స్పారో హౌస్లు ఏర్పాటు చేశారు. వాటిలో చేరే పిచ్చుకలకు నీళ్లు, ఆహారం అందిస్తున్నారు. వేసవి కాలం పిచ్చుక సంతానోత్పత్తి సమయమని.. ఈ కాలంలో వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపితే మంచిదని ఆయన సూచిస్తున్నారు. పిచ్చుకలను కాపాడుకోవాలి పంటలకు హాని చేసే క్రిములను తినడం ద్వారా పిచ్చుకలు రైతులకు సహాయకారిగా ఉండేవి. చిన్న జీవి అయినా పిచ్చుకతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. మా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తమవంతుగా పిచ్చుకలకు కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – శ్రీనివాస్, వ్యవస్థాపకులు, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్, విజయవాడ -
అక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయ్!
చింతపల్లి(పశ్చిమగోదావరి జిల్లా): డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా... అంటూ చాలామంది వ్యంగ్యంగా అంటుంటారు. కానీ, చాలా దేశాల్లో డబ్బులను చెట్ల నుంచే తయారు చేస్తారు. మన దేశంలో చెట్ల నుంచి కరెన్సీ నోట్లు తయారు చేయకపోయినా... ఇందుకోసం ఉపయోగించే అరుదైన ఆల్పైన్స్ వృక్షాలు మాత్రం మన దగ్గర దశాబ్దాలుగా పెరుగుతున్నాయి. చదవండి: శ్రీకాకుళం జిల్లాలో ఎర్ర చీమల దండయాత్ర.. హడలిపోతున్న జనం.. వాటిలో అల్లూరి జిల్లాలోని చింతపల్లి ప్రాంతం కూడా ఒకటి. కొన్ని దశాబ్దాల కిందట అటవీ శాఖ ఆధ్వర్యంలో పరిశోధనల కోసం చింతపల్లి మండలంలోని కృష్ణాపురం, చిన్నగెడ్డ అటవీ ప్రాంతాల్లో 20 హెక్టార్లలో ఆల్పైన్స్ మొక్కలను శాస్త్రవేత్తలు నాటారు. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండటంతో చెట్లు బాగా పెరిగాయి. దీంతో మరో పది హెక్టార్లకు ఆల్పైన్స్ మొక్కల సాగును విస్తరించారు. అమెరికా, కెనడా వంటి దేశాల్లో... అమెరికా, స్విట్జర్లాండ్, కెనడా వంటి దేశాల్లో ఆల్ పైన్స్ వృక్షాల కలప నుంచే కరెన్సీ నోట్లు తయారు చేస్తారు. ఆయా దేశాల్లో మెత్తని స్వభావం కలిగిన ఆల్పైన్స్ వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి. అందువల్ల కరెన్సీ నోట్ల తయారీకి పూర్తిగా వీటిపైనే ఆధారపడతారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మన దేశంలో ఆల్పైన్స్ వృక్షాల పెంపకం తక్కువగా ఉండడం వల్ల నగదు తయారీకి ఉపయోగించడం లేదు. కరెన్సీ తయారీకి సంబంధించిన యంత్ర సామగ్రి కూడా అందుబాటులో లేదు. దీంతో ఈ కలపను ఫర్నిచర్, ఇళ్లలో కబోర్డులు, ఫ్లోరింగ్, అలంకరణ వస్తువుల తయారీ వంటి వాటికి వినియోగిస్తున్నారు. పర్యాటకులకు కనువిందు... మన దేశంలో హిమాలయాలు, పశ్చిమ కనుమలు, రాష్ట్రంలోని చింతపల్లిలో గల ఎత్తయిన చల్లని వాతావరణం కలిగిన ప్రాంతాల్లో మాత్రమే ఆల్పైన్స్ చెట్లు పెరుగుతాయి. చాలా ఎత్తుగా ఉండే ఈ చెట్లు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. వేసవిలో సేదదీరేందుకు అనువుగా ఉంటాయి. చింతపల్లి ప్రాంతం అనువైనది ఎత్తయిన పర్వత శ్రేణి ప్రాంతంలో ఉన్న చింతపల్లి అటవీ ఏరియాలో ఆల్పైన్స్ చెట్లను పెంచేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మన దేశంలో తక్కువ ప్రాంతాల్లో ఈ చెట్లు పెంచడం వల్ల కరెన్సీ తయారీకి సరిపడా కలప ఉత్పత్తి కావడం లేదు. దీంతో కరెన్సీ తయారీకి ఉపయోగించడం లేదు. విదేశాల్లో ఎక్కువగా ఈ చెట్ల కలప ద్వారానే కరెన్సీ నోట్లు తయారు చేస్తారు. – శ్రీనివాసరావు, అటవీ శాఖ రేంజ్ అధికారి, చింతపల్లి -
Library On Trees: పుస్తకాలు కాసే చెట్లు!
చెట్లకు డబ్బులు కాస్తాయా! అంటారు. డబ్బులు కాదుగానీ పుస్తకాలు కాస్తాయి... అని సరదాగా అనవచ్చు. ఎలా అంటే... అస్సాంలోని జోర్హాట్ జిల్లాకు చెందిన మహిళలు ఒక బృందంగా ఏర్పడ్డారు. రకరకాల సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకసారి వీరి మధ్య గ్రంథాలయాల గురించి చర్చ జరిగింది. తమ చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. స్కూల్ అయిపోగానే రోజూ ఊరి గ్రంథాలయానికి వెళ్లేవాళ్లు. లోపల పెద్దవాళ్లు న్యూస్పేపర్లు తిరగేస్తూనో, పుస్తకాలు చదువుకుంటూనో గంభీరంగా కనిపించేవారు. తాము మాత్రం ఆరుబయట పచ్చటిగడ్డిలో కూర్చొని బొమ్మలపుస్తకాలు చదువుకునేవారు. సరదాగా ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. ఈ ఇంటర్నెట్ యుగంలో చాలామంది పిల్లలు సెల్ఫోన్ల నుంచి తల బయట పెట్టడం లేదు. పాఠ్యపుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు వారి దగ్గర కనిపించడం లేదు. చదివే అలవాటు అనేది బాగా దూరం అయింది. ‘మన వంతుగా ఏం చేయలేమా’ అనుకుంది మహిళాబృందం. అప్పుడే ‘ట్రీ లైబ్రరీ’ అనే ఐడియా పుట్టింది. ప్రయోగాత్మకంగా మారియాని గర్ల్స్హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న చెట్లకు బాక్స్లు అమర్చి వాటిలో దినపత్రికలు, మ్యాగజైన్లు, పుస్తకాలు పెట్టారు. స్పందన చూశారు. అద్భుతం. చెట్ల నీడన పిల్లలు పుస్తకాలు చదువుకుంటున్న దృశ్యం కన్నుల పర్వం! ‘పిల్లలకు, లైబ్రరీలకు మధ్య దూరం ఉంది. ఆ దూరాన్ని దూరం చేయడమే మా ప్రయత్నం. సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్లినా పఠనం అనేది మనకు ఎప్పుడూ అవసరమే. అది మన ఆలోచన పరిధిని విస్తృతం చేస్తుంది’ అంటుంది బృందంలో ఒకరైనా దిపిల పొద్దార్. విశేషం ఏమిటంటే... జోర్హాట్ జిల్లా చుట్టుపక్కల గ్రామాలు ఈ ట్రీ లైబ్రరీని స్ఫూర్తిగా తీసుకొని, తమ గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాయి. ‘ఈ ట్రీ లైబ్రరీ గురించి విని మా ఊరి నుంచి పనిగట్టుకొని వచ్చాను. నాకు బాగా నచ్చింది. పిల్లలను పుస్తకాల దగ్గరికి తీసుకురావడానికి అనువైన వాతావరణం కనిపించింది. మా ఊళ్లో కూడా ఇలాంటి లైబ్రరీ మొదలు పెట్టాలనుకుంటున్నాను’ అంటుంది భోగ్పూర్ సత్రా అనే గ్రామానికి చెందిన హిమంత అనే ఉపాధ్యాయిని. ఇక మజులి గ్రామానికి చెందిన నీరబ్ ఈ ‘ట్రీ లైబ్రరీ’ గురించి సామాజిక వేదికలలో విస్తృత ప్రచారం చేస్తున్నాడు. ‘ఇలాంటివి మా ఊళ్లో కూడా మొదలుపెట్టాలనుకుంటున్నాము’ అంటూ మంచి స్పందన మొదలైంది. మూడు నెలలు వెనక్కి వెళితే... పశ్చిమబెంగాల్లోని అలీపూర్దౌర్ యూరోపియన్ క్లబ్ గ్రౌండ్లోని చెట్లకు అరలు తయారు చేసి పుస్తకాలు పెట్టారు. ఓపెన్ ఎయిర్ కాన్సెప్ట్తో మొదలైన ఈ ట్రీ లైబ్రరీ సూపర్ సక్సెస్ అయింది. ఇది పర్యాటక కేంద్రంగా మారడం మరో విశేషం! -
బ్యూటిఫుల్ వీడియోతో గడ్కరీకి ఆనంద్ మహీంద్ర వినతి
న్యూఢిల్లీ: ఆసక్తికర వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ ఆనంద్ మహీంద్ర. తాజాగా మరో అందమైన, అద్భుత ట్రీ టన్నల్ (ట్రన్నల్) దృశ్యాలతో కూడిన వీడియోను ట్విట్టర్లో పంచుకున్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఈ సందర్భంగా.. దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న గ్రామీణ రహదారుల వెంట ఇలాంటి చెట్లను నాటి ‘ట్రన్నల్స్’ నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ‘నాకు సొరంగాలు(టన్నల్స్) అంటే చాలా ఇష్టం. కానీ, నిజంగా ఇలాంటి ‘ట్రన్నల్స్’ గుండా వెళ్లడానికి ఇష్టపడతాను. కొత్తగా నిర్మించే గ్రామీణ రహదారుల వెంట చెట్లు నాటి ఇలాంటి ట్రన్నల్స్ను మనం నిర్మించగలమా నితిన్ గడ్కరీ జీ?’ అంటూ రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్ర. ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి రెండు మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. 37వేలకుపైగా లైకులు వచ్చాయి. ‘ప్రపంచంలోనే సహసిద్ధ టన్నల్’ అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. ‘రోడ్డుపై ఉష్ణోగ్రతలను ఈ టన్నల్స్ తగ్గిస్తాయి’ అని మరొకరు పేర్కొన్నారు. మరోవైపు.. ఆనంద్ మహీంద్ర ట్వీట్కు స్పందించారు కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి దినేశ్ త్రివేది. ‘వృక్షాలు బలంగా లేకపోతే వాహనాలపై పడతాయి. హైవేలపై పడి ప్రయాణాలకు ఆటంకం కలిగిస్తాయి. ఇది ఆ ప్రాంతంలోని మట్టి, వాతావరణ పరిస్థితులు, చెట్ల రకాలపై ఆధారపడి ఉంటుంది. భద్రత అనేది సమస్య కానప్పుడు ఇది చాలా అందంగా కనిపిస్తుందని చెప్పగలను.’ అంటూ పేర్కొన్నారు. I like tunnels, but frankly, I’d much rather go through this kind of ‘Trunnel’ …@nitin_gadkari ji, can we plan to purposefully plant some of these trunnels on the new rural roads you are building? https://t.co/6cE4njjGGi — anand mahindra (@anandmahindra) August 27, 2022 ఇదీ చదవండి: Anand Mahindra: ఆనంద్ మహీంద్ర అద్భుతమైన పోస్ట్: నెటిజన్లు ఫిదా -
ఔషధ గుణం.. తారా వనం..
పిఠాపురం: వృక్షారాధన భారతీయుల ఆచారంగా కొనసాగుతోంది. ప్రతి దైవక్షేత్రానికి ఒక స్థల వృక్షం ఉంటుంది.తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి ఆలయ స్థలవృక్షం చింత చెట్టు. ద్వాదశ రాశులు, నవ గ్రహాలు, 27 నక్షత్రాలతో పవిత్రమైన వృక్షాలకు అనుబంధం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. నక్షత్ర వనాలు.. ప్రకృతిని ప్రభావితం చేసే పచ్చని వృక్షాలు జీవరాశుల మనుగడకు దోహదం చేస్తున్నాయి. ప్రతి గ్రహానికి నక్షత్రానికి ఒక వృక్షం ఉంటుందని భారతీయ సనాతన ధర్మం చెబుతోంది. నవగ్రహారాధనలో వృక్షాలకు ప్రత్యేక స్థానం ఉందని వేద పండితులు చెబుతున్నారు. ఒక్కో కాలంలో ఒక్కో చెట్టును పూజిస్తుంటారు.నవ గ్రహాల్లో చంద్రుడికి మోదుగ, సూర్యుడికి ఎర్ర చందనం, అంగారకుడికి చండ్ర, బుధుడికి రావి, గురుడుకి ఉత్తరేణి, శుక్రుడికి వెలగ, శనీశ్వరుడికి జమ్మి, రాహువుకు గరిక, కేతువుకు దర్ప వృక్షాలను పూజించాలని వేదాలు చెబుతున్నాయి. ఆగమ శాస్త్ర ప్రకారం 27 నక్షత్రాలు, 9 గ్రహాలకు సంబంధించి 36 రకాల వృక్షాలను గ్రహాలు, నక్షత్రాలకు సూచికగా చెబుతుంటారు. నక్షత్రాల్లో అశ్వినికి ముషిని, భరణికి ఉసిరి, కృత్తికకు మేడి, రోహిణికి నేరేడు, మృగశిరకు సండ్ర, ఆరుద్రకు గుమ్మడి, పునర్వసుకు సదనం, పుష్యమికి రావి, ఆశ్లేషకు నాగకేశరి, మూలాకు శ్రీగంధం, పూర్వాషాఢకు వందనం, ఉత్తరాషాఢకు పనస, శ్రవణానికి తెల్ల జిల్లేడు, ధనిష్టకు ఇనుపతుమ్మ, శతభిషానికి కదంబ, పూర్వాభాద్రకు వేప, ఉత్తరాభాద్రకు మామిడి, రేవతికి ఇప్ప, మఖకు మర్రి, పుబ్బకు మోదుగ, ఉత్తరకు జువ్వి, హస్తకు అడివి మామిడి, చిత్తకు మారేడు, స్వాతికి తెల్లమద్ది, వైశాఖకి పులివెలగ, అనురాధకు పొగడ, జేష్టకు బూరుగు మొక్కలు నాటడం మంచిదని చెబుతున్నారు. ఆయుర్వేద వనమూలికలుగా చెప్పే నక్షత్ర వృక్షాల కొమ్మలతో హోమం నిర్వహిస్తే వాటి నుంచి వచ్చే పొగ వాతావరణాన్ని రక్షిస్తుందని, గాలిని శుభ్రపరుస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. నా మొక్క నా శ్వాస నా మొక్క నా శ్వాస అనే నినాదంతో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. ఔషధ గుణాలున్న మొక్కలు నాటాలనే సంకల్పంతో ఇటీవల నక్షత్రవనం నిర్మాణం చేపట్టాం. – డాక్టర్ ఉమర్ అలీషా, శ్రీవిశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతులు, పిఠాపురం నక్షత్రాలను బట్టి మొక్కలు ఎవరి నక్షత్రానికి తగ్గ మొక్కను నాటడం వారికి చాలా మంచిది. ఆయా నక్షత్రాల ప్రకారం ఔషధ మొక్కలు నాటితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. – అల్లంరాజు చంద్ర మౌళి, వేద పండితులు, పిఠాపురం -
ఈ వేడి ఏమార్చేస్తోంది..!
కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని దశాబ్దాల ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలవుతున్నాయి. ఒక్క మనదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ‘వేడి’ మంటెక్కిస్తోంది. మనుషులపై మాత్రమేకాదు.. జంతువులు, చెట్లు, ఇతర జీవజాలం మొత్తంపై ప్రభావం చూపుతోంది. చల్లగా యాపిల్స్ పండేచోట మండే ఎండల్లో వచ్చే మామిడి పళ్లు కాస్తున్నాయి.. జంతువులే కాదు చెట్లూ తమ ప్రాంతాలు వదిలి ‘వలస’పోతున్నాయి.. ఇదేదో కొద్దిరోజులకో, కొన్ని ప్రాంతాలకో పరిమితమైంది కాదు.. భూమిపై జీవం మొత్తం అసాధారణ మార్పులకు లోనవుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, జీవజాలంపై ప్రభావం ఏమిటో తెలుసుకుందామా? సాక్షి సెంట్రల్ డెస్క్ జంతుజాలం ‘వలస మారె!’ మారుతున్న వాతావరణంలో జంతువులు ఇమడలేకపోతున్నాయి. ఆయా జంతువులకు తగిన ఆహారం దొరకడం లేదు. దీనితో ఇతర ప్రాంతాలకు వలస పోతున్నాయి. సంతానోత్పత్తి తగ్గిపోతోంది. కొత్త కొత్త అలవాట్లు సంతరించుకుంటున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. ♦అమెజాన్ అడవుల్లో పక్షులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా వాటి పరిమాణం తగ్గిపోతోందని తేల్చారు. పక్షులు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు ఓ వైపు శరీర పరిమాణాన్ని తగ్గించుకుంటున్నాయని గుర్తించారు. మరోవైపు శరీరాన్ని చల్లబర్చుకోవడం, బయటి ఉష్ణోగ్రతల నుంచి రక్షించుకోవడం కోసం ముక్కు, రెక్కలు, ఈకలు, తోకల పరిమాణాన్ని పెంచుకుంటున్నాయని గుర్తించారు. ♦ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రాంతాల్లో మాంసం, పాల కోసం పెంచుతున్న పశువుల నుంచి ఉత్పత్తి తగ్గిపోతోందని ఇటీవల లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ♦మంచు ప్రాంతాల్లో బతికే ఎలుగుబంట్లు, పెంగ్విన్లు, ఇతర జీవజాతుల సంతతి తగ్గిపోతోందని అమెరికన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ♦ఏటా శీతాకాలం, ఎండాకాలంలో పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ తమకు అనువైన ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి. కానీ ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పులతో.. ఈ వలసలు మారిపోతున్నాయి. మన దేశానికి వలస వచ్చే సైబీరియన్ కొంగల సంఖ్య కొన్నేళ్లుగా బాగా తగ్గిపోయింది. అందులోనూ కొద్దిరోజులకే అవి తిరిగి వెళ్లిపోతుండటం గమనార్హం. ♦సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో కొన్నిరకాల చేపలు, ఇతర జలచరాలు అంతరించిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. చెట్టూచేమ.. వరుస మారె.. ప్రతి చెట్టు, మొక్క కూడా ఆయా ప్రాంతాల్లోని చల్లదనం, వేడి వంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎదిగే, మనగలిగే లక్షణాలను అలవర్చుకుంటాయి. కానీ ఉష్ణోగ్రతలు అడ్డగోలుగా పెరిగిపోవడంతో చల్లటి ప్రాంతాల్లోని పలు రకాల చెట్లు, మొక్కలు బతకలేకపోతున్నాయి. మరోవైపు అదేచోట ఉష్ణమండల చెట్లు (వేడి వాతావరణంలో మాత్రమే పెరిగే చెట్లు/ మొక్కలు) కొత్తగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ♦ఉదాహరణకు కాఫీ, తేయాకు, యాపిల్స్ వంటివి చల్లగా ఉండే హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాల్లో, పశ్చిమ కనుమలు వంటి ప్రాంతాల్లో పండుతాయి. కానీ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో.. అవి దెబ్బతిని దిగుబడులు తగ్గుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వేడిని తట్టుకునే పంటలు/ చెట్లు/మొక్కలు కొత్తగా పెరుగుతున్నాయి. ♦ఇక వేడిగా ఉండేచోట్ల మరింత వేడి పెరిగి చెట్లు, మొక్కలు ఎండిపోయి బీళ్లుగా మారుతున్నాయి. ♦వేడి వాతావరణంలో చెట్లు బలహీనపడుతుండటంతో.. ఫంగస్లు విజృంభించి వాటిని నిర్వీర్యం చేస్తున్నాయి. ఇటీవలే మన దేశంలో మూడు రకాల ఫంగస్లు వ్యాపించి పెద్ద సంఖ్యలో వేప చెట్లు దెబ్బతినడం దీనికి ఉదాహరణ అని నిపుణులు చెప్తున్నారు. అడవి రూపు మారె... వాతావరణ మార్పులతో తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, వర్షాభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అడవులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మన దేశంలోనూ భారీగా అడవులు ఎండిపోతున్నాయి. బ్రిటన్కు చెందిన రీడింగ్ యూనివర్సిటీ ఇటీవలే భారతదేశంలో వర్షపాతం, ఉష్ణోగ్రతల తీరు, వాటివల్ల అడవుల క్షీణతపై శాస్త్రీయ అధ్యయనం చేసింది. దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాలు, తెలంగాణ, చత్తీస్గఢ్, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో అడవుల క్షీణత ఎక్కువగా ఉందని పేర్కొంది. దేశంలోని వృక్షాలు, జీవజాతుల్లో పదిశాతం మేర అంతరించిపోయే దశలో ఉన్నాయని తెలిపింది. ♦ 2001 – 2018 మధ్య దేశంలో 20,472 చదరపు కిలోమీటర్ల అడవులు తగ్గిపోయినట్టు పేర్కొంది. ఇది దేశంలోని మొత్తం అడవుల్లో 7.34 శాతం కావడం గమనార్హం. ♦ఇక ఒక్క 2017లోనే 2,503 చ. కిలోమీటర్ల అడవి అంతరించిపోయినట్టు పరిశోధన వెల్లడించింది. ♦‘‘ఇండియాలో కొన్నేళ్లుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అతి ఎక్కువ వేడి, వడగాడ్పులు వీచే రోజుల సంఖ్య పెరిగింది. ఈ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఇండియాలో మరింత ఎక్కువగా అడవులకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది అటవీ సంపద, వన్యప్రాణులపైనా ప్రభావం చూపుతుంది’’అని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త అలైస్ హఫన్ పేర్కొన్నారు. రోగాల తీరు మారె.. ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ఆయా ప్రాంతాల్లో వాతావరణ మార్పులు జరగడంతో.. కొత్త కొత్త బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులు విజృంభిస్తున్నాయి. వేడి వాతావరణం కారణంగా దోమలు, ఈగలు, ఇతర కీటకాలు పెరిగి అంటు రోగాలు విజృంభిస్తున్నాయని.. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వ్యాధులు, రోగాలు ఇతర ప్రాంతాలను కమ్ముకుంటున్నాయని గతేడాది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ♦అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం వల్ల ఊపిరితిత్తులు, గుండె నాళాల సమస్యలు, చర్మ సంబంధిత రుగ్మతలు పెరుగుతున్నాయని అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇటీవలే హెచ్చరించింది. ♦వేల ఏళ్ల కిందట మంచు అడుగున కూరుకుపోయిన నాటి సూక్ష్మజీవులు బయటికి వచ్చి కొత్త వ్యాధులు కమ్ముకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా. కాలం అదను మారె.. ♦ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల చాలా ప్రాంతాల్లో వానాకాలం, చలికాలం తగ్గిపోతున్నాయి. ఎండాకాలం పెరిగిపోతోంది. భవిష్యత్తులో ఆరు నెలలు ఎండాకాలమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ♦అధిక ఉష్ణోగ్రతలు వల్ల ఆరుబయట పనిచేసుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ది లాన్సెట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇలా ఒక్క 2019 ఏడాదిలోనే 30వేల కోట్ల పని గంటలకు నష్టం జరిగింది. ♦వాతావరణ మార్పుల వల్ల రుతువుల సమయాల్లోనూ మార్పులు వస్తున్నాయి. బ్రిటన్, ఇతర యూరప్ దేశాల్లో మార్చి నెల మధ్యలో వసంతకాలం మొదలవుతుంది. కానీ కొన్నేళ్లుగా ఫిబ్రవరి నెల మొదట్లోనే ఇది మొదలవుతోంది. ♦ హిమాలయాల ప్రాంతంలో ఉండే రోడోడెండ్రాన్ చెట్లు సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో అంటే ఎండాకాలం మొదట్లో పూలు పూస్తాయి. కానీ కొన్నేళ్లుగా జనవరిలోనే పూస్తున్నాయి. ♦మామిడి చెట్లకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలే అనుకూలం. చలి, మంచు ప్రదేశాల్లో చెట్లు పెరిగినా పళ్లు కాయవు. కానీ శీతల ప్రాంతమైన అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలో కొన్నేళ్లుగా మామిడి పండ్లు కాస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే దీనికి కారణం. -
లక్ష చెట్ల రింగురోడ్డు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించబోతున్న రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్), దాని పరిసరాలను హరితమయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం కేంద్రం అనుమతించిన ఉత్తర భాగంలో 158 కిలోమీటర్ల పొడవునా లక్ష చెట్లు పెంచాలని అధికారులు నిర్ణయించారు. రోడ్డుకు రెండు వైపులా మూడు వరుసల్లో.. మొత్తంగా ఒక్కో కిలోమీటర్కు 600 మొక్కల చొప్పున నాటేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రీజనల్ రింగ్రోడ్డు, ఇతర రాష్ట్ర, జాతీయ రహదారులు కలిసే ఎనిమిది చోట్ల నిర్మించే భారీ ఇంటర్ ఛేంజర్ల వద్ద చెట్ల సంఖ్య మరింత ఎక్కువగా ఉండనుంది. భారీగా వృక్ష సంపద కోల్పోతుండటంతో.. రీజనల్ రింగ్ రోడ్డును భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎనిమిది వరుసలకు సరిపడా భూసేకరణ చేయనున్నారు. అందులో ప్రస్తుతానికి నాలుగు వరుసలతో రోడ్డు నిర్మిస్తారు, వాహనాల సంఖ్య పెరిగే క్రమంలో ఎనిమిది లేన్లకు విస్తరిస్తారు. మొత్తంగా రోడ్డుతోపాటు విద్యుత్ స్తంభాలు, చెట్ల పెంపకం, అవసరమైన చోట ట్రక్ వే సైడ్ పార్కింగ్, డ్రైనేజీ.. ఇలా ఇతర అవసరాలకు కలిపి 100 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేసి చదును చేసి పెడతారు. ఈ క్రమంలో భారీగా వృక్ష సంపదకు నష్టం జరగనుంది. అదే సమయంలో రోడ్డు వెంట భూముల్లో వ్యవసాయం స్థానంలో వాణిజ్య కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. వీటన్నింటితో పర్యావరణానికి దెబ్బపడే నేపథ్యంలో.. రీజినల్ రింగురోడ్డు పొడవునా భారీగా చెట్లు పెంచేందుకు ప్రణాళిక వేస్తున్నారు. మొక్కలు నాటేదిలా.. వంద మీటర్ల వెడల్పుతో భూమిని చదును చేశాక.. రెండు చివరల్లో 3 మీటర్ల చొప్పున 6 మీటర్ల స్థలాన్ని మొక్కలు నాటేందుకు కేటాయించారు. ఒక్కోవైపు మీటరు చొప్పున దూరంతో మూడు వరుసల్లో మొక్కలు నాటుతారు. రోడ్డు వైపు ఉండే వరుసలో తక్కువ వెడల్పుతో విస్తరించే చెట్లను, మధ్యలో సాధారణమైనవి, చివరిగా ఏపుగా పెరిగే పెద్ద చెట్లను పెంచుతారు. ఇలా రోడ్డుకు రెండు వైపులా, ఇంటర్ ఛేంజర్లతో కలుపుకొంటే మొత్తం చెట్ల సంఖ్య లక్షకుపైగా ఉండనుంది. ♦ప్రస్తుతం రోడ్డు మధ్యలో 20 మీటర్ల వెడల్పుతో సెంట్రల్ మీడియన్ ఉండనుంది. అందులో ఆరు వరుసలతో వివిధ జాతుల పూల మొక్కలు నాటనున్నారు. భవిష్యత్తులో రోడ్డును ఎనిమిది లేన్లకు విస్తరిస్తే.. సెంట్రల్ మీడియన్ స్థలం ఐదు మీటర్లకు పరిమితమవుతుంది. అప్పుడు పూల చెట్ల వరుసలు తగ్గుతాయి. ♦గతంలో పెద్ద రహదారులకు ఇరువైపులా రోడ్డుపైకి అల్లుకునేలా రావి, మర్రి, వేప, మామిడి, చింత వంటి భారీ చెట్లు కనిపించేవి. రీజినల్ రింగురోడ్డును ఎక్స్ప్రెస్వేగా నిర్మిస్తున్నందున.. వాహనాలకు ఇబ్బంది రాకుండా తక్కువ కొమ్మలతో ఎత్తుగా పెరిగే జాతులనే ఎంపిక చేస్తున్నారు. -
అక్కడ చెట్లను తొలగిస్తే.... బహుమతులు ఇస్తారట!
Callery Pear Tree Smells Bad In US state of Maine: చెట్లను నాటండి అంటూ మన దేశాల్లో పచ్చదనం, హరిత విప్లవం అంటూ రకరకాల కార్యక్రమాలను చేపడుతుంటారు. అయితే అందుకు విరుద్ధంగా యూఎస్లోని మైనే రాష్ట్రంలోని అధికారులు మొక్కలను తొలగిస్తే బహుమతులు ఇస్తాం అంటున్నారు. అసలే ప్రపంచ దేశాలన్ని కాలుష్యం కోరల్లో చిక్కుకుని బెంబేలెత్తుతుంటే ఏంటిది వెటకారంగా అని అనుకోకండి. (చదవండి: బాప్రే!.... నెపోలియన్ ఖడ్గం వేలంలో రూ. 21 కోట్లు పలికిందట!) అసలు విషయంలోకెళ్లితే... మానవుల మనగడ చెట్లతోనే సాధ్యం అని అందరికి తెలిసి విషయమే. కానీ యూఎస్కి తూర్పున ఉన్న మైనే రాష్ట్రంలోని కాలరీ పియర్ చెట్లు మాత్రం ప్రజలకు సమస్యగా మారి ఇబ్బందులకు గురిచేస్తోంది. అంతేకాదు సౌత్ కరోలినా ఫారెస్ట్రీ కమిషన్ కాలరీ పియర్ చెట్లను తొలగించాలనుకునే వారికి ఐదు కొత్త చెట్ల బహుమతిగా ఇస్తానని ప్రకటించింది. అయితే ఈ కాలరీ పియర్ చెట్టు యూఎస్కి చెందినది కాదు. అంతేకాదు ఈ చెట్టు చైనా, వియత్నాంకు చెందిన పియర్ చెట్టు జాతి. ఈ మేరకు ఇది 1900లలో అనేక ఆసియా దేశాల నుండి యూఎస్ దేశానికి వచ్చింది. అయితే 1960ల నాటికల్లా ఈ చెట్లు వాటికి పూచే ఆకర్షణీయమైన తెల్లని పువ్వుల కోసం రాష్ట్రాలలోని అనేక శివారు ప్రాంతాల్లో విస్తారంగా వీటిని నాటారు. పైగా యూఎస్లో విస్తృతంగా సాగు చేయబడిన 'బ్రాడ్ఫోర్డ్' పియర్ చెట్టుగా కూడా పిలుస్తారు. ఏ ఆకర్షణీయమైన పువ్వుల కోసం అయితే ఈ మొక్కలను నాటారో ఆ పువ్వులు అత్యంత భయంకరమైన వాసనను కలిగి ఉన్నాయన్న విషయాన్ని ప్రజలు గ్రహించలేకపోయారని మైనే వ్యవసాయ సంరక్షణ అటవీ శాఖకు చెందిన ఉద్యానవన నిపుణులు అన్నారు. అంతేకాదు ఈ పియర్ చెట్లు వల్ల స్థానిక జాతి చెట్ల పై తీవ్ర వినాసకరమైన ప్రభావాన్ని చూపాయని చెప్పారు. దీంతో అక్కడి అధికారులు 2024 నాటికల్లా ఈ పియర్ మొక్కలను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. పైగా అక్కడి అధికారులు ఇప్పటికే ఉన్న కాలరీ పియర్ చెట్లను తొలగించినందుకు ఇంటి యజమానులకు బహుమతులు అందించే వరకు వెళ్లడం గమనార్హం (చదవండి: జైలును ఆర్ట్ సెంటర్గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!) -
California Wildfire: ప్రమాదంలో ప్రపంచంలోనే అతి పురాతన చెట్టు..
జనరల్ షెర్మాన్ అనే చెట్టు ప్రపంచంలోనే అతి పె..ద్ద.. చెట్టంట! ఇది కాలిఫోర్నియాలోని సిక్వోయా అండ్ కింగ్స్ కెన్యాన్ నేషనల్ పార్కులో ఉంది. ఐతే ప్రస్తుతం ఇది ప్రమాదంలో ఉందట. ఎందుకంటే.. గత నెలలో 9వ తేదీన కురిసిన మెరుపులతో కూడిన గాలివాన తుఫానులో అక్కడి అడవిలో నిప్పురాజుకుని పశ్చిమ భాగంలో చాలా వరకు కాలిపోయినట్లు నివేదికలో వెల్లడించింది. ఐతే ఇప్పుడు 275 అడుగుల ఎత్తున్న జనరల్ షెర్మాన్ చెట్టుకు ఆ మంటలు అంటుకునే ప్రమాదం ఉన్నట్లు ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అగ్నిమాపక సిబ్బంది దీనిని పరిరక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా 2200 యేళ్ల నాటి ఈ చెట్టు ప్రపంచంలోనే అతి పురాతనమైన వృక్షంగా పేరుగాంచింది. కాగా గత యేడాది సంభవించిన కార్చిచ్చులో వేలకొద్ది జనరల్ షెర్మాన్ చెట్లు కాలి బూడిదైపోయాయి. ఇవి కూడా వేల యేళ్లనుంచి ఉన్నఅతిప్రాచీన చెట్లే. ఈ అగ్నికీలలవల్ల అడవులకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని పశ్చిమ ప్రాంతంలో మంటలను ప్రస్తుత రోజుల్లో అదుపుచేయడం చాలా కష్టంగా ఉంది. దాదాపు 30 యేళ్ల క్రితం నాటి ఉష్ణోగ్రతతో పోలిస్తే ప్రస్తుతం అక్కడ గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఇటీవలి కాలంలో అడవుల్లో అగ్నిప్రమాదాలు సంభవించడం పరిపాటైపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ మంటలు సిక్వోయా నేషనల్ పార్కుకు 1.5 కిలీమీటర్ల దూరంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ పార్కులో దాదాపుగా రెండువేల చెట్లు ఉన్నాయి. ఈ అగ్నికీలన్నుంచి చెట్లను కాపాడటానికి అల్యుమినియం చుట్లతో వీటిని కప్పుతున్నారు. అడవిలో మంటలు మరింత పెరగడానికి కారణమయ్యే చెట్లను తొలగించే పనులను అగ్నిమాపక సిబ్బంది ముమ్మరం చేస్తున్నారు. వాతావరణం వేడెక్కితే సంభవించే పరిణామాలకు నిదర్శనమే కాలిఫోర్నియా కార్చిచ్చు. వీటిని అదుపు చేయలేక, చెట్లను కాపాడుకోలేక అక్కడి ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులు ఇతర దేశాలకు భవిష్యత్తు హెచ్చరికలుగా భావించవచ్చు. చదవండి: కాలిఫోర్నియా బీచ్లో ముడిచమురు లీక్.. పర్యావరణానికి తీవ్ర నష్టం!
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement