breaking news
Security Cost
-
జుకర్బర్గ్కు భారీగా పెరిగిన పరిహారాలు
డేటా చోరి ఉదంతంపై ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్బర్గ్ పరిహారాలు భారీగా పెరిగినట్టు తెలిసింది. గతేడాది జుకర్బర్గ్ పరిహారాలు 53.5 శాతం పెరిగి 8.9 మిలియన్ డాలర్లుగా నమోదైనట్టు రెగ్యులేటరీ ఫైలింగ్లో కంపెనీ శుక్రవారం పేర్కొంది. దీనిలో ఎక్కువ ఆయన వ్యక్తిగత సెక్యురిటీకి వెచ్చించిన వ్యయాలే ఉన్నాయి. 83 శాతం పరిహారాలు సెక్యురిటీకి సంబంధించిన ఖర్చులని, మిగతా మొత్తం జుకర్బర్గ్ వ్యక్తిగతంగా వాడుకున్న ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ ఖర్చులు ఉన్నాయని కంపెనీ తెలిపింది. గతేడాది జుకర్బర్గ్ ఎక్కువ సమయం ట్రావెలింగ్కే వెచ్చించారని, అమెరికాలోని అన్ని రాష్ట్రాలను ఆయన చుట్టిముట్టేశారని పేర్కొంది. సెక్యురిటీ వ్యయాలు అంతకముందు 4.9 మిలియన్ డాలర్లుంటే, 2017లో 7.3 మిలియన్ డాలర్లకు పెరిగాయి. అయితే ఫేస్బుక్ సీఈవో బేస్ శాలరీలో ఎలాంటి మార్పు లేదు. ఆయన బేస్ శాలరీ 1 డాలర్గానే ఉంది. అదేవిధంగా కంపెనీలో ఆయన ఓటింగ్ అధికారాలు కూడా 59.9 శాతం పెరిగాయి. చైర్మన్గా, సీఈవోగా, వ్యవస్థాపకుడిగా ఉన్న ఆయన భద్రత విషయంలో పలు ముప్పులు ఉంటాయని, ఈ నేపథ్యంలో జుకర్బర్గ్కు వ్యక్తిగత సెక్యురిటీకి ఎక్కువగా వెచ్చించినట్టు ఫేస్బుక్ బోర్డ్ పరిహారాల కమిటీ తెలిపింది. గత రెండేళ్ల నుంచి ఫేస్బుక్ అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఆదాయాలనే ఆర్జిస్తోంది. కానీ ఇటీవల కేంబ్రిడ్జ్ అనలిటికాతో ఫేస్బుక్ యూజర్ల డేటాను కంపెనీ అక్రమంగా పంచుకుందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా ఢమాల్మన్నాయి. ఈ విషయంపై వివరణ ఇవ్వడానికి జుకర్బర్గ్ అమెరికన్ కాంగ్రెస్ ముందుకు కూడా వచ్చారు. -
ఈ సీఈవో సేవలు ఉచితం...!
ట్వీటర్ సీఈవో జాక్ డార్సీ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవడం లేదు. అయితే తన వ్యక్తిగత, నివాస భద్రత కోసం మాత్రం రూ. 46 లక్షలు తీసుకుంటున్నారట. ఆయన కంటే ముందున్న సీఈవో డిక్ కాస్టోలో రూ. 62 లక్షల జీతం తీసుకున్నారు. అందులో వేతనంతో పాటు కారు సర్వీసు, సెక్యూరిటీ ఖర్చులన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ట్వీటర్కు దాదాపు 30 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. అయితే ఫేస్బుక్కు మాత్రం ఏకంగా 150 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. దీంతో మార్కెటింగ్ వర్గాలు కూడా ట్వీటర్ కంటే ఫేస్బుక్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి 30.7 కోట్ల మంది యూజర్లు ఉండగా, ఈ త్రైమాసికం చివరకు 30.5 కోట్ల మంది ఉన్నారు. యూజర్లు పెద్దగా పెరగకపోవడంతో ట్వీటర్ షేరు ధర కూడా దాదాపు 13 శాతం వరకు పడిపోయిందని టెక్ క్రంచ్ తెలిపింది. ట్వీటర్లో చాలా మార్పులు చేయాలని అనుకుంటున్నామని, ప్రస్తుతమున్న 140 క్యారెక్టర్ల పరిమితి ఇబ్బందిగా ఉందని, అయితే దానివల్ల తక్కువ మాటల్లో బలమైన స్టేట్మెంట్లు ఇవ్వడానికి కూడా వీలవుతోందని డోర్సి అన్నారు. దీనివల్లే ట్వీటర్కు విభిన్నమైన గుర్తింపు కూడా వస్తోందని తెలిపారు.