టీడీపీ ప్రభుత్వంతో కలసి పనిచేస్తా: కలమట
కొత్తూరు: తెలుగుదేశం ప్రభుత్వంతో కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి(వైఎస్సార్సీపీ) చెప్పారు. కొత్తూరు మండలంలోని మాతలలోని స్వగృహంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు. నియోజవర్గంలోని తన అనుయాయులు, అభిమానుల అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ నెల 4న విజయవాడలో లేదా హైదరాబాద్లో సీఎం చంద్రబాబును కలసి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిస్తానన్నారు.
టీడీపీలో చేరిక: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు తనయుడు బొడ్డు వెంకటరమణచౌదరి మంగళవారం టీడీపీలో చేరారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బొగ్గు లక్ష్మణరావు, వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి చెందిన ఎంపీపీ పద్మావతి తదితరులూ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.