breaking news
Lymphatic
-
బోదకాలు బాధితులకు పెన్షన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బోదకాలుతో బాధపడుతున్న వారికి పింఛన్ అందజేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. దాదాపు 47 వేల మంది బాధితులకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నెలకు రూ.వెయ్యి పింఛన్ అందజేస్తామని, ఈ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. జబ్బుల విషయంలో చికిత్స కంటే నివారణే మేలన్న మాటను ప్రభుత్వం ఆచరణలో పెట్టదలుచుకుందని, ఇందుకోసం ప్రజలందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు చేయించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రజారోగ్యం విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు. శుక్రవారం ప్రగతిభవన్లో వైద్యారోగ్యశాఖపై కేసీఆర్ సమీక్షించారు. ఇందులో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్రావు, శాంత కుమారి, ఉన్నతాధికారులు, పలువురు నేతలు పాల్గొన్నారు. మంత్రి తుమ్మల, ఎంపీ కవిత చొరవతో.. తమ నియోజకవర్గాల్లో బోదకాలు బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారిని ఆదుకోవాలని ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపీ కవిత ముఖ్యమంత్రికి విన్నవించారు. వారికి తగిన వైద్యం అందించాలని, బోదకాలు వ్యాధి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో బోదకాలు బాధితులకు పింఛన్ అందజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దాంతోపాటు వారికి అవసరమైన మందులు, ఇతర వైద్య సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి బోదకాలు బాధితులను గుర్తించాలని సూచించారు. పేదల ముంగిట్లోకే వైద్యం గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదల ముంగిట్లోకే వైద్యం చేరాలని, స్థానికంగానే వారికి వైద్య సేవలు అందాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ.. గ్రామాల్లో ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. మరోసారి జీతాలు పెంచుతాం ఆశ వర్కర్లకు ఒకసారి జీతాలు పెంచామని, మరోసారి కూడా పెంచడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ ప్రకటించా రు. ఆశ వర్కర్లను విలేజ్ హెల్త్ అసిస్టెంట్లుగా గుర్తిస్తామని, సెకండ్ ఏఎన్ఎం జీతాలు కూడా పెంచుతామని తెలిపారు. ప్రభుత్వాస్పత్రులకే కేసీఆర్ కిట్స్ కేసీఆర్ కిట్స్ పథకం అద్భుతంగా అమలవుతోందని, పేదలకు ఎంతో మేలు కలుగుతోందని కేసీఆర్ చెప్పారు. అదనపు భారం పడినా సరే వైద్యులు, సిబ్బంది ఓపిగ్గా విధులు నిర్వహిస్తున్నారని, వారికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇస్తామని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు కూడా కేసీఆర్ కిట్స్ పథకం వర్తింపచేయాలన్న వినతులు వస్తున్నాయని.. కానీ ప్రభుత్వాస్పత్రులను బాగు చేసుకుంటామే తప్ప, ప్రైవేటు ఆస్పత్రులకు ఈ పథకం వర్తింపచేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రజలందరికీ వైద్య పరీక్షలు అమెరికా వంటి దేశాల్లో ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటారని, రాష్ట్రంలోనూ అలాంటి ఆరోగ్య అవగాహన అలవాటు చేయించాలని సమీక్షలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘అవగాహన ఉన్నవారు, ఆర్థిక స్థోమత కలిగిన వారు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలవారు, పేదలు ఏదైనా జబ్బు వచ్చినప్పుడే తప్ప ఆసుపత్రులకు వెళ్లరు. వైద్య పరీక్షలు చేయించుకోరు. దీనివల్ల చాలా వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించలేకపోతున్నారు. వ్యాధి తొలిదశలోనే గుర్తిస్తే నయం చేయడం తేలిక అవుతుంది. బోదకాలు కూడా అలాంటిదే. ఇకపై అలా జరగడానికి వీల్లేదు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే వైద్య పరీక్షలు చేయిస్తుంది. వ్యాధులేమైనా ఉంటే ప్రభుత్వపరంగానే చికిత్స, మందులు అందించే ఏర్పాట్లు చేస్తాం. ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదు..’’అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రభుత్వాస్పత్రులు మెరుగయ్యాయని, కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ చర్యలను ప్రశంసించిందని పేర్కొన్నారు. -
బోదను మరిచారా?
రాయవరం, న్యూస్లైన్ : తాము చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ శాపగ్రస్థులుగా మారుతున్నారు ఫైలేరియా వ్యాధి గ్రస్థులు. దోమకాటుతో సోకే ఈ వ్యాధితో శరీరంలో భాగాలు బాగా వాచిపోతాయి. ఆభాగంలో బరువు అధికంగా ఉంటుంది. దాంతో కురూపులవుతుంటారు. ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రతీ ఏటా నవంబర్ 11న ఫైలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆ సందర్భంగా డీఈసీ మాత్రల పంపిణీని నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటి వరకు 13 విడతలుగా ఫైలేరియా దినోత్సవాన్ని నిర్వహించిన జిల్లా యంత్రాంగం గతేడాది 14వ విడత ఫైలేరియా దినోత్సవాన్ని నిర్వహించలేదు. బోదవ్యాధిని నిర్లక్ష్యం చేస్తున్నారనడానికి ఇదే ప్రత్యక్ష తార్కాణం. ఫైలేరియా వస్తుందిలా... ప్రపంచ వ్యాప్తంగా దీన్ని లింఫాటిక్, సబ్ క్యూటినస్, సీరస్ క్యావిటీ ఫైలేరియాలుగా విభజించగా మన దేశంలో లింఫాటిక్ ఫైలేరియా వ్యాధిగ్రస్థులు మాత్రమే ఉన్నారు. దీనినే బ్రాంకఫ్టిన్ ఫైలేరియగా కూడా పిలుస్తారు. క్యూలెక్స్ ఆడదోమ కుట్టడం వలన ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దోమల నియంత్రణ ఏదీ.. దోమల నిర్మూలన కేంద్రాలు రామచంద్రపురం, మండపేట, అమలాపురం, పెద్దాపురం, పిఠాపురం మున్సిపాల్టీల్లో ఒక్కొక్కటి, రాజమండ్రిలో రెండు, కాకినాడలో మూడు ఉన్నాయి. పల్లెల్లో దోమల నిర్మూలన కేంద్రాలు లేకపోవడంతో దోమలు దారుణంగా ప్రబలుతున్నాయి. ఫైలేరియా శాఖకు సిబ్బంది కొరత ఫైలేరియా శాఖ సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. పట్టణాల్లో దోమల నియంత్రణకు ఎబేట్ అనే దోమల మందును స్ప్రేచేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఫీల్డ్ స్టాఫ్ 96మంది ఉండాల్సి ఉండగా కేవలం 36మంది మాత్రమే ఉన్నారు. రామచంద్రపురం, అమలాపురం యూనిట్లలో రెండేళ్లుగా ఫీల్డ్ వర్కర్లు ఒక్కరూ లేరు. హెల్త్ ఇనస్పెక్టర్లు పూర్తిస్థాయిలో ఉన్నా సుపీరియర్ ఫీల్డ్ వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇన్సెక్ట్ కలెక్టర్లు తగినంతమంది లేరు. 28 నుంచి 30 వరకు డీఈసీ మాత్రల పంపిణీ బోధ వ్యాధి నియంత్రణలో భాగంగా జిల్లాలో ఈనెల 28 నుంచి 30వ తేదీవరకు మూడురోజులపాటు 1.20 కోట్ల డీఈసీ మాత్రల పంపిణీకి చర్యలు చేపట్టినట్టు జిల్లా ఫైలేరియా అధికారిణి డాక్టర్ జక్కంశెట్టి శశికళ తెలిపారు. రెండేళ్లు పైబడి, 65 సంవత్సరాల లోపు ఉన్న 50 లక్షల జనాభాకు ఈ మాత్రలు అందజేస్తామన్నారు. అదేవిధంగా 54 లక్షల ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నామన్నారు. ఆ మూడురోజుల్లో ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, ఆశ కార్యకర్తలు, పారామెడికల్ సిబ్బంది డీఈసీ మాత్రల పంణీలో పాల్గొంటారన్నారు. ఫైలేరియా శాఖలో సిబ్బంది కొరత ఉన్న విషయం వాస్తవమేనన్నారు. జిల్లాలో ఫైలేరియా తీరు 1972లో మన జిల్లాలో 11 శాతం మంది ఫైలేరియా వ్యాధి క్రిమి కలిగిన వారు ఉండేవారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ బోధ వ్యాధి నివారణను పైలట్ ప్రాజెక్టుగా మన జిల్లాలో 1999 నవంబర్ 11న ప్రారంభించింది. 1999లో వ్యాధికారక క్రిమి రేటు జిల్లాలో 4 శాతం ఉండేది. 2010 నాటికి 0.14 శాతానికి తగ్గినట్టు జిల్లా ఫైలేరియా అధికారిణి డాక్టర్ శశికళ తెలిపారు. {పస్తుతం జిల్లాలో 15,533మంది బోధ వ్యాధిగ్రస్థులు ఉన్నట్టు సీనియర్ ఎంటమాలజిస్ట్ ప్రసాద్ తెలిపారు. రాయవరం, మాచవరం, రామచంద్రపురం, మండపేట, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, నేలటూరు, అంగర, పిఠాపురం ప్రాంతాలలో ఈ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఉన్నారు. 1999 నుంచి 2012 వరకు ప్రతీ ఏటా ఫైలేరియా దినోత్సవం జరిగింది.