breaking news
Lincoln Memorial
-
సపోజ్..పర్ సపోజ్..
ఇది ఇలా కాకుండా అలా ఉండుంటే.. భూమి గుండ్రంగా కాకుండా.. బల్లపరుపుగా ఉండుంటే.. సిడ్నీలోని ప్రఖ్యాత ఒపెరా టవర్ అలా కాకుండా.. వేరొకలాగా ఉండుంటే..! నిజంగానే ఉండేదేమో.. ఎందుకంటే.. ఆ ప్రాంతంలో అది కట్టాలని నిర్ణయించినప్పుడు వచ్చిన డిజైన్లలో ప్రస్తుతమున్న మోడల్ సెలెక్ట్ అయింది కాబట్టి.. ఒపెరా హౌస్ అలాగుంది.. ఎంపిక కమిటీ వేరే ఆర్కిటెక్ట్ ఇచ్చిందాన్ని సెలెక్ట్ చేసుంటే.. అది వేరేలా ఉండేది కదా.. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన కొన్ని కట్టడాలకు సంబంధించి.. తిరస్కరించిన డిజైన్లను.. ఎంపికైన డిజైన్లతో బ్రిటన్కు చెందిన ‘గో కంపేర్’ వెబ్సైట్ పోల్చింది. మనం కూడా ఆ తిరస్కృత డిజైన్లను ఓసారి తిరగేద్దామా.. – సాక్షి, తెలంగాణ డెస్క్ సిడ్నీ ఒపెరా హౌస్.. దీని నిర్మాణం కోసం 1955లో డిజైన్ల పోటీని నిర్వహించారు. 223 ఎంట్రీలు రాగా.. డెన్మార్క్కు చెందిన జామ్ అట్జాన్ ఇచ్చిన సెయిలింగ్ బోట్ డిజైన్ ఎంపికైంది. సర్ ఎగీన్ గూసెన్స్ ఇచ్చిన డిజైన్ను తిరస్కరించారు. లింకన్ మెమోరియల్.. 1911లో వాషింగ్టన్ డీసీలో దీని నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీని డిజైన్ బాధ్యత హెన్రీ బాకన్కు అప్పగించారు. అయితే.. జాన్ రసెల్ పోప్ అనే ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ కూడా ఉత్సాహం చూపడంతో మెమోరియల్ కమిషన్ ఆయన రూపొందించిన పిరమిడ్ టైపు డిజైన్ను కూడా పరిశీలించింది. అయితే.. చివరగా హెన్రీ మోడల్కే ఓకే చెప్పింది. ప్యారిస్లోని ఆర్క్ ద త్రియాంప్ ఫ్రాన్స్ తరఫున యుద్ధాల్లో పోరాటం చేసి ప్రాణాలొదిలిన వారికి స్మారకంగా నగరం మధ్యలో దీన్ని నిర్మించారు. 1836లో ప్రారంభమైంది. అయితే.. 1758లోనే సరిగ్గా ఇదే ప్రాంతంలో ఏనుగు మోడల్లో ఓ భారీ నిర్మాణం చేపట్టడం కోసం చార్లెస్ రిబార్ట్ అనే ఆర్కిటెక్ట్ డిజైన్ ఇచ్చారు. మూడంతస్తుల్లో ఉండే ఈ ఏనుగులోకి వెళ్లడానికి రింగులు తిరిగే నిచ్చెన వంటివి పెట్టారు. అయితే.. ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ డిజైన్ను తిరస్కరించింది. ఓకే చేసుంటే.. ఆ ప్లేస్లో ఇదుండేది. లండన్లోని టవర్ బ్రిడ్జి థేమ్స్ నదిపై ఉన్న ఈ వంతెన నిర్మాణం కోసం మొత్తం 50 డిజైన్లు వచ్చాయి. చివరగా.. లండన్ సిటీ అధికారిక ఆర్కిటెక్ట్ సర్ జోన్స్ ఇచ్చిన మోడల్ ఎంపికైంది. ఎఫ్.జె.పామర్ అనే ఆర్కిటెక్ట్.. వంతెనలోని కొన్ని భాగాలు అవసరానికి తగ్గట్లు కదిలేలా ఉన్న డిజైన్ ఇచ్చారు. అయితే.. అది ఎంపిక కాలేదు.. -
తెల్లరేగడిలో మొలకెత్తిన నల్ల పిడుగు
సంక్షిప్తంగా... నేడు మార్టిన్ లూథర్ కింగ్ వర్ధంతి ‘‘ఐ హావ్ ఎ డ్రీమ్’’ అన్నాడు మార్టిన్ లూథర్ కింగ్. వాషింగ్టన్లోని లింకన్ మెమోరియల్లో గుమికూడిన రెండు లక్షల మంది ఆ మాట విన్నారు. ప్రతిస్పందనగా పెద్ద హోరు! ఏమిటి ఆయన కల? ‘‘ఓ రోజు వస్తుంది. ఆ రోజు అమెరికాలో నల్లవారందరికీ స్వేచ్ఛ, తెల్లవారందరితో సమానత్వం అనే నా కల నిజమౌతుంది’’ అన్నాడు మార్టిన్. 1963 ఆగస్టు 28 నాటి ప్రసంగం అంది. నెల తిరక్కుండానే ఆ కల నిజమవడానికి తనింకా చాలా కష్టపడాలని అతడికి తెలిసివచ్చింది. బర్మింగ్హామ్ చర్చిలో జరిగిన వర్ణవివక్ష పేలుళ్లలో నలుగురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. తర్వాతి ఏడాది మార్టిన్ లూథర్ కింగ్కి నోబెల్ శాంతి బహుమతి. అదే ఏడాది నల్లవారి పౌరహక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాతి ఏడాది ఓటు వేసే హక్కు కూడా! అలా అమెరికన్ ఆఫ్రికన్లందరికీ స్వేచ్ఛ, సమానత్వం - రెండూ సాధ్యమయ్యాయి. మార్టిన్ స్వప్నం ఫలించింది. మార్టిన్ లూథర్ కింగ్ 1929 జనవరి 15న అట్లాంటాలో జన్మించారు. 1968 ఏప్రిల్ 4న మెంఫిస్లో హత్యకు గురయ్యారు. మధ్యలో ఆయన బతికి ఉన్న 39 ఏళ్ల కాలం నల్లజాతి అమెరికన్లకు ఇప్పటికీ ఒక కల లానే అనిపిస్తుంటుంది! మార్టిన్ అసలు మేరు మైఖేల్. తర్వాత మార్టిన్ అయ్యాడు. తండ్రి (మార్టిన్ లూథర్ కింగ్ సీనియర్) బాప్టిస్టు మినిస్టర్. మినిస్టర్ అంటే మంత్రి కాదు. మతబోధకుడు. తల్లి ఆల్బెర్టా విలియమ్స్ కింగ్. పాఠశాల ఉపాధ్యాయిని. మార్టిన్ 1955లో డాక్టరేట్ సంపాదించడానికి ముందు, బోస్టన్లో పీహెచ్డీ చేస్తున్నప్పుడు పరిచయం అయిన కొరెట్టా స్కాట్ను 1953లో ఆయన వివాహం చేసుకున్నారు. 1954లో మాంట్గోమరీ (అలబామా) లోని డెక్స్టర్ అవెన్యూ బాప్టిస్టు చర్చికి పాస్టరుగా నియమితులయ్యారు. ఆ ఏడాదే అలబామాలో సంచలనాత్మకమైన అరెస్టు ఒకటి జరిగింది. మార్టిన్ సహచరురాలైన పౌరహక్కుల ఉద్యమ నాయకురాలు రోసా పార్క్స్ తను ప్రయాణిస్తున్న బస్సులో ఒక తెల్లవాడికి తను లేచి సీటు ఇవ్వడానికి నిరాకరించినందుకు అరెస్ట్ అయ్యారు! పార్క్స్ అరెస్టును నిరసిస్తూ మాంట్గోమరీలో బస్సులను ఆఫ్రికన్ అమెరికన్లు బహిష్కరించే ఉద్యమానికి మార్టిన్ నాయకత్వం వహించడంతో తొలిసారిగా అమెరికాలో ఆయన పేరు మారుమోగింది! 1963లో బర్మింగ్హామ్, అలబామాలలో జాతి వివక్షకు వ్యతిరేకంగా మార్టిన్ నాయకత్వంలో చెలరేగిన ఉద్యమాన్ని తెల్లవాళ్లు అత్యంత పాశవికంగా బాంబులతో అణచివేశారు. నల్లవారి ఇళ్ల మీద, కార్యకర్తల మీద తరచు బాంబు దాడులు జరుగుతుండడంతో బర్మింగ్హామ్ ‘బాంబింగ్హామ్’గా పేరుమోసింది! నిరసనలకు వ్యతిరేకంగా జారీ అయిన ఆదేశాలను ఖాతరు చేయకపోవడంతో మార్టిన్ను బర్మింగ్హామ్ జైల్లో వేశారు. జైలు నుంచి మార్టిన్ విడుదల అయ్యాక ‘చిల్డ్రన్స్ క్రూసేడ్’ మొదలైంది. వేలాది మంది పాఠశాల విద్యార్థులు మార్టిన్ దన్నుతో బర్మింగ్హామ్ అంతటా కవాతు చేస్తూ నిరసన గళం విప్పారు. వారిపై పోలీసులు విరుచుకు పడ్డారు. లాఠీలను ఝుళిపించడం, పోలీసు కుక్కల్ని ఉసిగొల్పడం, జ్వాలలను ఎగజిమ్మే పైపులను విద్యార్థులపైకి గురిపెట్టడం వంటి దృశ్యాలన్నిటినీ టీవీలలో చూసి అమెరికా ప్రజలు ఆగ్రహోదగ్రులయ్యారు. మార్టిన్కు మద్దతు ప్రకటించారు. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితోనే మార్టిన్ ‘ఐ హావ్ ఎ డ్రీమ్’ ప్రసంగాన్ని ఇవ్వగలిగారు. 1967 డిసెంబరులో మార్టిన్ ‘పూర్ పీపుల్స్ కాంపెయిన్’ ప్రారంభించారు. సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా మార్చింగ్కు ఏర్పాట్లు చేయడం కోసం 1968 ఏప్రిల్ 3 వ తేదీన టెన్నెస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ చేరుకున్నారు మార్టిన్. మర్నాడు తను బస చేసిన హోటల్ బాల్కనీలో ఉన్నప్పుడు ఆయనపై దాడి జరిగింది. తుపాకీ గుళ్లకు మార్టిన్ నేలకు ఒరిగారు. అంత్యక్రియల సమయంలో మార్టిన్ స్నేహితుడు బెంజమిన్ మేస్ మాట్లాడుతూ, ‘‘మార్టిన్ లూథర్ కింగ్ సమైక్య అమెరికా అన్న భావనను నమ్మాడు. అన్ని రకాల వివక్ష గోడలు కూలిపోవాలని కలగన్నాడు’’ అని నివాళులు అర్పించారు. -
ఒబామా చిరకాల స్వప్నం తీరనున్న వేళ...
అమెరికా మాజీ అధ్యక్షుడు మార్టిన్ లూథర్ కింగ్ 50వ వర్థంతి వేడుకలు ఆగస్టు 28న దేశవ్యాప్తంగా జరగనున్నాయి. ఆ సందర్బాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్లోని లింకన్ మెమోరియల్ హాల్లో లూథర్ కింగ్పై ప్రసంగించనున్నట్లు ఒబామా గురువారం వెల్లడించారు. ఆ ప్రదేశం నుంచే కింగ్పై ప్రసంగించాలన్న తన చిరకాల స్వప్నం ఇలా సాకారం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఒబామా చెప్పారు. ఆర్థ శతాబ్దం క్రితం ఇదే రోజు లింకన్ మెమోరియల్ హాల్ నుంచి మార్టిన్ లూథర్ కింగ్ దాదాపు మూడు లక్షల మంది యూఎస్ వాసుల నుద్దేశించి ప్రసంగించారని ఆయన తెలిపారు. దేశంలోని బ్లాక్, అమెరికన్ల మధ్య బంధం మరింత బలపడాలని మార్టిన్ ఆ సభ నుంచే ఆకాంక్షించిన సంగతిని ఒబామా ఈ సందర్భంగా గుర్తు చేశారు. మార్టిన్ లూథర్ కింగ్ వర్థంతిని పురస్కరించుకుని దేశావ్యాప్తంగా ఆగస్టు 21 నుంచి 28 వరకు మతపరమైన సేవలు జరగనున్నాయి.