breaking news
destitute
-
ప్రతి అడుగులోనూ అంతులేని ఆవేదన!
సాక్షి, హైదరాబాద్: చెరువుల ఫుల్ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), ప్రభుత్వ భూములు, నాలా పరిరక్షణ పేరుతో హైడ్రా వేసిన ప్రతి అడుగుతోనూ నిరుపేదలే నష్టపోయారనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, సరైన సమాచారం లేకుండా, కొన్నిసార్లు కనీసం ఇంట్లోని వస్తువులు, పుస్తకాలూ కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టి పేదల కన్నీటికి, తీరని వేదనకు కారణమయ్యిందనే విమర్శలు ఉన్నాయి. సున్నం చెరువుతో ప్రారంభిస్తే అనేక కూల్చివేతల్లో నిరుపేదలు గూడు కోల్పోయి కట్టబట్టలతో మిగిలారు.హైడ్రా కూల్చివేతల్లో అత్యంత వివాదాస్పదమైన అంశం సున్నం చెరువు కూల్చివేతలు. మాదాపూర్లో ఉన్న ఈ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాల పేరుతో హైడ్రా 2024 సెప్టెంబర్లో కూల్చివేతలు చేపట్టింది. ఈ సందర్భంలో స్థానికులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమకు ముందస్తు నోటీసులు ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు. అప్పట్లో చిన్నారులు గూడుతో పాటు పుస్తకాలను సైతం కోల్పోయారు. ఈ ఘటన తర్వాత ‘నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చబోమని’ హైడ్రా ప్రత్యేక వివరణ ఇవ్వాల్సి వచ్చింది. రోడ్డున పడిన వందల కుటుంబాలుఅమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన విల్లాలు, భవనాలతో పాటు షెడ్లను సైతం హైడ్రా కూల్చివేసింది. ఇక్కడా బాధితులు నోటీసులు లేకుండానే కూల్చివేతలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే కూకట్పల్లి నల్లచెరువు ఎఫ్టీఎల్లో ఉన్న షెడ్లు, వాణిజ్య నిర్మాణాలు, ఇతరాలను హైడ్రా తొలగించింది. ఈ సందర్భంలోనూ బాధితులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దుండిగల్ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువు వద్దా ఇలాంటిదే జరిగింది.గాజుల రామారం సర్వే నం.307 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు 350 ఎకరాలు కేటాయించింది. ఈ స్థలంలో పేదలు ఇల్లు కట్టుకోగా అక్టోబర్ 2025లో హైడ్రా 800కు పైగా నిర్మాణాలను తొలగించింది. దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇదిలా ఉంటే అదే సర్వే నంబర్లో ప్రగతినగర్ ఆనుకొని ఓ ఎమ్మెల్యే 30 ఎకరాల వరకు స్థలాన్ని కబ్జా చేయగా హైడ్రా అడ్డుకుంది. అయితే తెల్లారేసరికే అదే స్థలం చుట్టూ ఎమ్మెల్యే మనుషులు ఫెన్సింగ్ వేయగా హైడ్రా ఇంతవరకు వారి పైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఫాతిమా కాలేజీ వ్యవహారంలో ద్వంద్వ వైఖరిఫాతిమా కాలేజీ (బారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్) వివాదం హైడ్రా చేపట్టిన చెరువుల ఆక్రమణల తొలగింపు చర్యల్లో అత్యంత చర్చనీయాంశమైంది. చాంద్రాయణగుట్టలోని సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కళాశాల ఉందనే ఆరోపణలు ఉన్నాయి. న్యాయవాది విజయ్ గోపాల్ తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ పిటిషన్లో బారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ సల్కం చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉందని, అయినప్పటికీ హైడ్రా ఇతర ప్రాంతాల్లో కూల్చివేతలు చేపడుతున్నట్టుగా ఇక్కడ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.దీని విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పాఠశాల విద్యాశాఖ అధికారులను పలుమార్లు ప్రశ్నించింది. కళాశాలకు ఎవరు అనుమతులు ఇచ్చారు? ఎఫ్టీఎల్ హద్దులు ఏమిటి? నిర్మాణం ఎలా అనుమతించబడింది? అనే అంశాలపై పూర్తి రికార్డులు సమర్పించాలని ఆదేశించింది. అధికారులు పలుమార్లు పూర్తి వివరాలు సమర్పించకపోవడంతో కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంతో హైడ్రాపై ‘ఎంపిక చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటోంది‘ అనే విమర్శలు వచ్చాయి.చెరువుల ఎఫ్టీఎల్లో ఉన్న చిన్న ఇళ్లు, వాణిజ్య భవనాలను కూల్చుతున్న హైడ్రా, ఈ విద్యాసంస్థపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష పార్టీలు, కొందరు ప్రజాప్రతినిధులు, పిటిషనర్ వాదించారు. రాజకీయ ప్రభావం కారణంగానే చర్యలు ఆలస్యం అవుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపించాయి. అలాగే మూసీ పరివాహక ప్రాంతాలు, హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్ పేరుతో ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తాల్లో ఇళ్లు కూల్చివేస్తారనే ప్రచారంతో వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా వెళ్లి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.ఎన్ని మొట్టికాయలో..!కూకట్పల్లిలోని ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన కేసులోనూ హైడ్రా వివాదాస్పదమైంది. కోర్టు రక్షణలో ఉన్న భూమిలో కూల్చివేతలు, కాంపౌండ్ తొలగింపు, విద్యుత్ కనెక్షన్ నిలిపివేత జరిగాయని ఆరోపణలు రావడంతో భూమిని మునుపటి స్థితికి తీసుకురావాలని రెవెన్యూ, హైడ్రా అధికారులను హైకోర్టు ఆదేశించింది. గుడిమల్కాపూర్లోని ఓ భూమికి సంబంధించి పాత కోర్టు డిక్రీలు ఉన్నప్పటికీ హైడ్రా షెడ్ కూల్చి ఫెన్సింగ్ వేసిందనే ఆరోపణలు వచ్చాయి.ఈ వివాదంపై ఘాటుగా స్పందించిన కోర్టు ఫెన్సింగ్ తొలగించి స్టేటస్కో కొనసాగించాలని ఆదేశించింది. బహదూర్గూడలో రైతులు వ్యవసాయం చేస్తున్న భూములకు హైడ్రా ఫెన్సింగ్ వేసిందని పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకు బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఐలాపూర్ (అమీన్పూర్) భూముల కేసులో స్టేటస్కో ఉల్లంఘించారని హైడ్రా కమిషనర్తో పాటు ఇతర అధికారులకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇక లోతుకుంటలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కేసులో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హైడ్రా జోక్యం చేసుకుందని సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. ఇదే కేసు విచారణ చివరకు కమిషనర్ను తొలగించాలనే ఆదేశాలకు దారితీసింది.మెడకు చుట్టుకున్న ‘లోతుకుంట’ వివాదంహైడ్రా తన రెండేళ్ల ప్రస్తానంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా లోతుకుంట భూముల వివాదంతో హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఎం రేవంత్రెడ్డి 2024 జూలై 12న హైడ్రా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అదే నెల 19 నుంచి అది అమలులోకి వచ్చింది. అంబర్పేటలోని బతుకమ్మకుంట విషయంలో హైకోర్టు ఇచ్చిన స్టేటస్కో ఆదేశాలను ఉల్లంఘిస్తూ హైడ్రా పనులు చేపట్టిందనే ఆరోపణలు వచ్చాయి. కమిషనర్ రంగనాథ్ ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని న్యాయస్థానం పేర్కొంది. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులు, నిర్మాణాలు తొలగించి, నాలుగు వారాల్లో అమలు నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో హైడ్రా చర్యలు తీసుకుంది. -
సంక్షేమ జాతర.. అర్హులకు టోకరా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి :రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశ పెడుతోంది. అయితే అవి అర్హులకు అందడం లేదని, నిరుపేదలకు నిరాశే ఎదురవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ దన్ను లేదా బలమైన సిఫారసు ఉంటేనే గృహలక్ష్మి, బీసీ, మైనారిటీ బంధు పథకాల జాబితాలో చోటు దక్కుతోందని ఆయా పథకాలకు అన్ని విధాలా అర్హులైన వారు వాపోతున్నారు పోటీ తీవ్రంగా ఉండటంతో.. ‘ఇప్పటికైతే పార్టీలో ముఖ్య నాయకులు, కార్యకర్తలకే పంచేద్దాం..ఈ మేరకు గ్రామాల వారీగా జాబితాలు పంపండి’ అంటూ ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జాబితాలు సిద్ధం అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇళ్లకు గాను 14.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి. బీసీబంధు పథకం కింద ఒక్కో నియో జకవర్గంలో 300 మందికి, మైనారిటీ బంధు కింద 100 మందికి ఆర్థిక సహా యం చేయాలని నిర్ణయించారు. ఈ రెండు పథకాలకూ వేలల్లో దర ఖాస్తు లు వచ్చాయి. పలు జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపికను దాదాపు పూర్తి చేశారు. వాస్తవానికి అత్యంత నిరుపేదలకు, ఇచ్చే ఆర్థిక సహాయాన్ని జీవనోపాధికి ఉపయోగించుకునే సాంకేతికత, ఇతర పరిజ్ఞానం ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా.. ఎమ్మెల్యేలు చెప్పినవారికి, బంధుగణానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, కొన్ని చోట్ల అర్హుల జాబితాల్లో చేర్చేందుకు 10 నుంచి 30% కమీషన్ మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలను తమసిబ్బందితో కలిసి పరిశీలించాల్సిన జిల్లా యంత్రాం గాలు, కనీస పరిశీలన లేకుండానే ఆమోద ముద్ర వేసేసి చేతులు దులుపు కొంటూ సంక్షేమాన్ని పక్కదారి పట్టిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పథకం ఏదైనా అదే తీరు.. డబుల్ బెడ్రూంలు దక్కని నిరుపేద తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే మూడు దశల్లో రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇందులో బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు10, ఇతరులకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఆయా కులాల్లో దివ్యాంగులుంటే వారికి 5 శాతం కేటాయించాలి. కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో ఈ నిబంధనలు పాటించలేదు. చేతి వృత్తులే జీవనాధారమైన నాయీ బ్రాహ్మణ, రజక, సగర పూసల, మేదరి, వడ్డెర, ఆరెకటిక, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, కంచరి ఇతర ఎంబీసీ కులాల్లో పేదరికం, వృత్తి నైపుణ్యం ఆధారంగా ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాధాన్యతలేవీ పాటించటం లేదని జిల్లా కలెక్టర్లకు చేరిన జాబితాలు చూస్తే అర్థం అవుతోంది. మైనారిటీ బంధులో లబ్ధిదారుల సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ ఇందులో కూడా నిబంధనలు, ప్రాధాన్యతల పాటింపుపై అక్కడక్కడా ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. పథకాలు కలెక్టర్లకు అప్పగించాలి.. ప్రస్తుతం అమలు చేస్తున్న దళిత, మైనారిటీ, బీసీ బంధుతో పాటు నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం పథకాలు పూర్తి పక్కదారి పట్టాయి. రాష్ట్ర ప్రజలు పన్నులతో వచ్చిన ఆదాయం దుర్వినియోగం అవుతోంది. నిజమైన అర్హులకు కాకుండా గ్రామ స్థాయి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల ద్వారా జరుగుతున్న ఎంపికలతో వాస్తవ పేదలకు న్యాయం జరగడం లేదు. వెంటనే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో కలెక్టర్లకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం అందించే ప్రతి పైసా నిరుపేదల ఆర్థిక ప్రగతికి ఉపకరించేలా చర్యలు తీసుకోవాలి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గృహ‘లక్షీ కటాక్షం’ లేదంట పూరి గుడిసెలో జీవితాన్ని వెల్లదీస్తున్న ఈమె పేరు గాలి ఉపేంద్ర. మహబూబా బాద్ జిల్లా నల్లెల గ్రామం. డబుల్ బెడ్రూం రాలేదు. చివరకు సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షలైనా ఇస్తారన్న ఆశతో దరఖాస్తు చేసింది. అన్ని అర్హతలున్న తనకు లబ్ధి చేకూరుతుందని ఎదురుచూసింది. కానీ ఈ మారు కూడా ఇళ్లు ఇవ్వటం లేదని గ్రామ నాయకులు తేల్చేశారు. అర్హతలున్నా ఎంపిక చేయలేదు..! ఈమె పేరు రాచమల్ల మంజుల. సీఎం కేసీ ఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియో జకవర్గంలోని అలిరాజపేట గ్రామం. ఇటీ వల భర్త చనిపోవటంతో కొడుకు శ్రీకాంత్తో కలిసి ఇస్త్రీ షాపునకు అవసరమయ్యే పని ముట్లు కొనేందుకు బీసీబంధు పథకంలో లక్ష రూపాయల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇలా ఈ ఊరిలో మొత్తం 33 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం ఇద్దరినే ఎంపిక చేశారు. అయితే ఆ ఇద్దరు తమకంటే అన్ని విధాలుగా బాగా ఉన్నవారేనని మంజుల పేర్కొంది. -
Stampede: బెంగాల్లో తొక్కిసలాట.. ముగ్గురు మహిళలు మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ బర్దవాన్లో విషాద ఘటన జరిగింది. దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. ప్రతిపక్షనేత సువేంధు అధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే దుప్పట్ల పంపిణీకి అనుకున్నదానికంటే ఎక్కువ మంది రావడంతో ఈ ప్రమాదం జరిగింది. సువేందు అధికారి కార్యక్రమంలో పాల్గొని వెనుదిరిగిన వెంటనే తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని అధికార టీఎంసీ ఆరోపించింది. చిన్న వేదికలో సామర్థ్యానికి మించి ఎక్కువమందిని తరలించారని, అందుకే ప్రమాదం జరిగిందని పేర్కొంది. నిబంధనలు పాటించని సువేందు అధికారిపై విమర్శలు గుప్పించింది. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంది. చదవండి: కదులుతున్న రైలు ఎక్కబోయి కిందపడ్డ తల్లీకూతురు.. తృటిలో.. -
ఫుట్బాల్లో రాణిస్తున్న దుర్గారావు
కోలా దుర్గారావుకు రెండు చేతులూ లేవు.. కడు పేదరికం కారణంగా అనాథ శరణాలయంలో చదువుకున్నాడు.. అక్కడే ఫుట్బాల్పై దృష్టి సారించాడు. వైకల్యం ఉంటేనేం.. అందరికన్నా మిన్నగా దూసుకెళ్లాడు. ఎంతలా అంటే దుర్గారావు లేకుండా జిల్లా జట్టు బయట టోర్నీలకు వెళ్లలేనంతగా... అటు చదువులోనూ ఏమాత్రం తగ్గకుండా ఇంటర్ ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఇక డిగ్రీలో యూనివర్సిటీ స్థాయిలో మెరవాలని ఆకాంక్షిస్తున్నాడు.. -రాజ్కుమార్, విజయవాడ విజయవాడలోని రాజరాజేశ్వరీపేటలో నివాసముండే దుర్గారావుది పేద కుటుంబం. ఊహించని రీతిలో తన రెండు చేతులను కోల్పోవాల్సి వచ్చింది. తెలిసీ తెలియని వయసులో గాలిపటం కోసం కరెంట్ స్తంభం ఎక్కి ప్రమాదానికి గురయ్యాడు. తన వెనుకే మరికొందరు అదే స్తంభం ఎక్కగా కింద ఉన్న వాడు అదుపు తప్పుతూ దుర్గారావు కాళ్లు పట్టుకుని లాగాడు. దీంతో తను తీగలపై పడ్డాడు. అంతే ఒక్క క్షణం వాటికి అతుక్కుపోయి తర్వాత ధబేలున కిందపడిపోయాడు. పెద్ద ఆస్పత్రికి వెళ్లే స్తోమత లేక స్థానికంగా ఓ వైద్యుడి దగ్గర చికిత్స తీసుకున్నాడు. సాయంత్రానికి రెండు చేతులు రంగు మారి కొన్ని రోజులకు కుళ్లిపోయాయి. వీటిని తీసేయడం తప్ప మరో మార్గం లేకపోయింది. అయితే చుట్టుపక్కల వారు చూసే జాలి చూపులను తట్టుకోలేకపోయేవాడు. ఏదో రీతిన ప్రత్యేకత చాటుకుని సెహబాష్ అనిపించుకోవాలని తపించసాగాడు. దుర్గారావు తండ్రి గణపతి రిక్షా కార్మికుడు. కొడుక్కి చదువు చెప్పించే స్తోమత లేకపోవడంతో విజయవాడ సమీపంలోని బుద్ధవరం కేర్ అండ్ షేర్ అనాథ సంస్థలో చేర్చాడు. ఆట పాటల్లో చురుకుగా ఉంటూ ఇక్కడే ఫుట్బాల్పై ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఇతడి ఆసక్తికి కోచ్ సురేష్ శిక్షణ తోడయ్యింది. ఆయన పర్యవేక్షణలో దుర్గారావు రాటుదేలాడు. చిన్నప్పటి నుంచీ ఏదో సాధించాలనే తపనను ఈ ఆట ద్వారా తీర్చుకోవాలనుకున్నాడు. అద్భుత ఫిట్నె స్ను సొంతం చేసుకుని బంతిని తన అదుపులో ఉంచుకున్నాడు. అందరిలా బంతితో రకరకాల విన్యాసాలు చేస్తాడు. ఫార్వర్డ్ ఆటగాడిగా ప్రతీ మ్యాచ్లోనూ దాదాపు తనే తొలి గోల్ సాధించే స్థాయికి ఎదిగాడు. వాస్తవానికి తను లేకుండా బయటి జిల్లాల్లో జరిగే ఓపెన్ ఆహ్వానిత టోర్నీలకు జట్టు వెళ్లదంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రా లయోలా కాలేజీలో చదివి ఇంటర్ ప్రథమస్థాయిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇక ఈ ఏడాది డిగ్రీ స్థాయిలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఫుట్బాల్ టోర్నీలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జట్టు తరఫున ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. కొస మెరుపు: చేతుల్లేకపోయినా దుర్గారావు అన్ని విషయాల్లోనూ అందరికన్నా ముందుండాలని ప్రయత్నిస్తుంటాడు. తాటి, కొబ్బరి చెట్లు ఎక్కడమే కాకుండా బైక్పై రివ్వున దూసుకుపోగలడు. రెండు చేతులు కలిపి పెన్ను పట్టుకొని రాయగలడు.


