అంతే స్పీడ్‌గా..

Special Drive on Over Speed - Sakshi

ఓవర్‌ స్పీడ్‌పై తక్షణమే చలాన్‌  

రాష్ట్ర వ్యాప్తంగా అతివేగంపై దృష్టి

30 స్పీడ్‌ లేజర్‌ గన్స్‌ సమీకరణ

వీటితో కలిపి 58కి పెరిగిన స్పీడ్‌ గన్స్‌ సంఖ్య

బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద మోహరించాలని నిర్ణయం

డీజీపీ కార్యాలయంలో ట్రాఫిక్‌ సిబ్బందికి శిక్షణ

సాక్షి, సిటీబ్యూరో: ఏటా రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రమాదాల్లో అత్యధికం అతివేగం కారణంగానే చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు, తద్వారా మృతుల సంఖ్యను తగ్గించాలనే లక్ష్యంతో డీజీపీ కార్యాలయం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలను నిరోధించడంలో భాగంగా ఓవర్‌ స్పీడ్‌పై స్పెషల్‌ డ్రైవ్స్‌ చేపట్టేందుకు పోలీసు విభాగం సన్నాహాలు చేస్తోంది. ఇందుకుగాను ప్రత్యేకంగా రాడార్‌ టెక్నాలజీతో పని చేసే 30 స్పీడ్‌ లేజర్‌ గన్‌లను కొనుగోలు చేశారు. వీటి వినియోగంపై ఆయా జిల్లాలు, కమిషనరేట్ల సిబ్బందికి డీజీపీ కార్యాలయంలో బుధవారం నుంచి శిక్షణ ఇస్తున్నారు. వీటితో కలిపి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న స్పీడ్‌ లేజర్‌ గన్స్‌ సంఖ్య 58కి చేరింది. వీటిని ‘ఎంపిక చేసిన’ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మోహరించి తనిఖీలు చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా రహదారులు, వాటి స్థితిగతులపై అధ్యయనం చేసిన మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ (ఎంఓఆర్‌టీహెచ్‌) నిర్ణీత వేగపరిమితులను విధించింది. వీటి ప్రకారం జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ వేలు, ఔటర్‌ రింగ్‌రోడ్‌లపై గరిష్టంగా గంటకు 100 కిమీ వరకు ప్రయాణించవచ్చు. ఇది వాహనాలను బట్టి మారుతుంటుంది.

మిగిలిన రహదారుల్లో గరిష్ట వేగం గంటకు 60 కిమీ మించకూడదు. జనసమ్మర్థ ప్రాంతాల్లో ఇది 40 కిమీ, విద్యాసంస్థలు ఉండే ప్రాంతాల్లో 20 కిమీ దాటకూడదు. వీటికి తోడు నగరంలో ట్యాంక్‌బండ్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో వేగ పరిమితులు విధించారు. వీటికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో సూచికలు అందుబాటులో ఉంచినా వాహనచోదకులు పట్టించుకోవట్లేదు. ఫలితంగా అత్యధిక వాహనాలు ఓవర్‌స్పీడింగ్‌తో వెళ్లి ప్రమాదాలకు లోనుకావడం, ప్రమాదకారకాలుగా మారడం జరుగుతోంది. ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌స్పాట్స్‌గా పేర్కొంటారు. గత రెండేళ్లుగా వీటిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసు విభాగం శాస్త్రీయంగా కారణాలను గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు కారణమవుతున్న ఇంజినీరింగ్‌ లోపాలు, ఆక్రమణలు తదితరాలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కేవలం ఓవర్‌ స్పీడ్‌ కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు   గుర్తించినా, ఆయా ప్రాంతాల్లో వినియోగించేందుకు స్పీడ్‌ లేజర్‌ గన్స్‌ అవసరమైన సంఖ్యలో లేవు. రాష్ట్రం మొత్తమ్మీద కేవలం 28 మాత్రమే అందుబాటులో ఉండటంతో కొత్తగా 30 గన్స్‌ను సమీకరించుకుంది. రాడార్‌ పరిజ్ఞానంతో పని చేసే వీటి వినియోగంపై డీజీపీ కార్యాలయం కేంద్రంగా క్షేత్రస్థాయి ట్రాఫిక్‌ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. వీటిని ఓవర్‌ స్పీడ్‌ కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంట్లున్న జిల్లాలు, కమిషనరేట్లకు అందించనున్నారు. ఆయా యూనిట్స్‌కు చెందిన వారు వీటి వినియోగం కోసం ప్రత్యేకంగా టీమ్స్‌ ఏర్పాటు చేస్తారు. ఈ బృందాలు ఒక్కో రోజు ఒక్కో  బ్లాక్‌స్పాట్‌ వద్ద కాపుకాసి మితిమీరిన వేగంతో వచ్చే వాహనాలను గుర్తిస్తాయి. తొలుత ఈ ఉల్లంఘనులకు చలాన్లు జారీ చేయకుండా కొన్ని రోజుల పాటు అవగాహన కల్పించాలని, ఆ తర్వాతే చలాన్లు విధించాలని డీజీపీ కార్యాలయం ఆదేశించింది.

మాన్యువల్‌..ఆటోమెటిక్‌..
ఈ స్పీడ్‌ లేజర్‌ గన్స్‌ను మాన్యువల్‌గానూ, ఆటోమేటిక్‌ మోడ్‌లోనూ వినియోగించే అవకాశం ఉంది. అంటే... ఎంపిక చేసిన ప్రాంతంలో ఉండే ట్రాఫిక్‌ సిబ్బంది  అటుగా వచ్చే వాహనాల్లో అతివేగంగా వెళ్తున్న వాటిని గుర్తించి ఫొటోలు తీయడం ద్వారా చర్యలు తీసుకుంటారు. ఆటోమెటిక్‌ విధానంలో ఓ ప్రాంతంలో స్పీడ్‌ గన్‌ను ఏర్పాటు చేసి వదిలేస్తే దాని ముందు నుంచి ప్రయాణించే వాటిలో నిర్ణీత వేగం దాటిన వాహనాలను లేజర్‌ గన్నే గుర్తించి ఫొటోలు తీస్తుంది. సదరు ప్రాంతంలో వేగ పరిమితి ఎంత? ఎంత వేగం దాటితే ఫొటో తీయాలి? తదితర అంశాలను గన్‌లో పొందుపరిచేందుకు ఆస్కారం ఉంది. దీనికి అనుసంధానించి ఉండే ట్యాబ్‌ ఈ–చలాన్‌ సర్వర్‌తో కనెక్ట్‌ అయి ఉంటుంది. గన్‌ క్యాప్చర్‌ చేసిన ఫొటోల్లో ఏది సక్రమంగా ఉంది? ఏది అస్పష్టంగా ఉంది? అనేవి సరిచూసే సిబ్బంది పక్కాగా ఉన్న ఫొటోలనే సర్వర్‌కు అప్‌లోడ్‌ చేస్తారు. ఈ సర్వర్‌ ఆర్టీఏ డేటాబేస్‌లోని వివరాల ఆధారంగా సదరు ఉల్లంఘనుడి వాహనం నంబర్‌తో ఈ–చలాన్‌ జనరేట్‌ చేస్తుంది. దీన్ని అతడి చిరునామాకు పోస్టులో పంపిస్తారు. రహదారులపై తనిఖీలు చేపట్టే ట్రాఫిక్‌ పోలీసుల చేతిలో ఉండే పీడీఏ మిషన్లలోనూ ఈ డేటా నిక్షిప్తం చేస్తారు. ఫలితంగా ఓవర్‌ స్పీడింగ్‌ చేసి, ఈ–చలాన్‌ చెల్లించని వారిని గుర్తించి పట్టుకునేందుకు ఆస్కారం ఉంటుంది.

భవిష్యత్‌లో మరిన్ని ఏర్పాటు  
‘నగరం చుట్టూ ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ఒకప్పుడు ప్రమాదాలకు నెలవుగా ఉండేది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు ఓవర్‌ స్పీడే ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. దీంతో ప్రాథమికంగా ఎనిమిది స్పీడ్‌ లేజర్‌ గన్స్‌ ఖరీదు చేసి ఔటర్‌పై మోహరించారు. ఫలితంగా వాహనాల గరిష్ట వేగం తగ్గడంతో పాటు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలోని ఓవర్‌స్పీడింగ్‌ బ్లాక్‌స్పాట్స్‌ అన్నింటి వద్దా ఈ గన్స్‌తో డ్రైవ్స్‌ చేయాలని నిర్ణయించాం. భవిష్యత్‌లో ఈగన్స్‌ సంఖ్యను భారీగా పెంచడానికీ కసరత్తు చేస్తున్నాం’  –ఓ పోలీసు ఉన్నతాధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top