రాయని డైరీ... అరుణ్‌ గోవిల్‌ (రామాయణ్‌)

Madhav Singaraju Rayani Dairy On Arun Govil - Sakshi

ఏ కాలంలోనైనా ఆ కాలపు జనరేషన్‌ని కుదురుగా ఒకచోట కూర్చోబెట్టడం ఎవరి వల్లా కాని పని. ఇక వాళ్లను పూర్వపు జనరేషన్‌లతో కలిపి ఇంట్లో కూర్చోబెట్టడం అన్నది ఊహకైనా అందని సంగతి. బహుశా నా జనరేషన్‌లో నేనూ అలాగే ఉండి ఉంటాను.. ఎవరి వల్లా కాని పనిగా, ఎవరి ఊహకూ అందని సంగతిగా!

అసలు కూర్చోబెట్టడం అన్న ఆలోచనే తప్పు కావచ్చు. ఎవరికి వారికి అనిపించాలి కూర్చోవాలని. కాసేపు నాన్నతోనో, అమ్మతోనో, నానమ్మతోనో, తాతయ్యతోనో కూర్చోవాలని అనిపించనప్పుడు లాక్‌డౌన్‌ పీరియడ్‌లోనైనా ఫోన్‌తో గదిలోకి వెళ్లిపోయి తలుపు వేసుకోవడాన్ని ఎలా తప్పు పట్టగలం.. మన చేతిలోనూ ఓ ఫోన్‌ ఉంచుకుని?! స్మార్ట్‌ ఫోన్‌లతో కూడా మనిషి విసుగెత్తిపోయే దశ ఒకటి రావాలేమో. ఆర్థికమాంద్యంలా ఆసక్తిమాంద్యం. ఫేస్‌బుక్‌ ముఖం మొత్తేయాలి. ఇన్‌స్టాగ్రామ్‌లు, ట్విట్టర్‌లు, యూట్యూబ్‌లు, వాట్సాప్‌లు అంటేనే ఒళ్లంతా దద్దర్లు వచ్చేయాలి. అలాంటి దశ!

వస్తే ఏం అవుతుంది? స్టోర్‌రూమ్‌కి వేసి ఉన్న తాళంకప్పల బూజు దులిపి, వాటి రంధ్రాల్లో ఓపిగ్గా కొన్ని చుక్కల నూనె పోసి, తాళం తీసి, కిర్రున తలుపు చెక్కల్ని నెట్టుకుంటూ లోపలికి వెళ్లి, ట్రంకుపెట్టెల్లో ఉండి ఉంటాయనుకున్న పూరిళ్ల, పురిటిళ్ల ఫొటో ఆల్బమ్‌ల కోసం వెతుకుతామేమో! మనం అమ్మానాన్న అయినా కూడా.. మనం తాతయ్య, నానమ్మ అయినా కూడా.. అమ్మ చిన్నప్పుడు, నాన్న టెన్త్‌క్లాస్‌లో ఉన్నప్పుడు.. అమ్మానాన్న ఫొటోలను వేళ్లతో నిమురుకుంటామేమో.. వాళ్లను మనకు మాత్రమే షేర్‌ చేసుకుంటూ.
 
నిన్నట్నుంచీ డీడీలో ‘రామాయణ్‌’ రీరన్‌ అవుతోంది. ముప్పైమూడేళ్ల తర్వాత మళ్లీ ఇంటింటా రాముడు, సీత! ‘‘సీతమ్మవారు పడిన కష్టాల కంటే సీతమ్మవారి కోసం ‘సీతా.. సీతా’ అంటూ శ్రీరాముడు అలమటించడమే అప్పటి వ్యూయర్స్‌కి ఇప్పటికీ గుర్తుండి ఉంటుంది’’ అంటోంది శ్రీలేఖ.
 
‘‘తాతయ్యా.. ఆ రాముడు మీరే కదా’’ అంటూ ఎగిరొచ్చి మీద కూర్చున్నాడు ఆర్యవీర్‌. నవ్వాను.
‘‘మరి తాతయ్యా.. మీరు శ్రీరాముడు అయినప్పుడు, నానమ్మ కదా సీతమ్మ అవ్వాలి. వేరే ఎవరో ఆంటీ సీతగా ఉన్నారేమిటి?’’ అన్నాడు. ఆ మాటకు శ్రీలేఖ నవ్వింది. ఆర్యవీర్‌ని నా చేతుల్లోంచి లాక్కుంది. వాడి ప్రశ్నలు కూడా నా చేతుల్లోంచి వెళ్లిపోయాయి. 
‘‘తాతయ్య పక్కన ఉన్న ఆ సీతమ్మ పేరేంటి నానమ్మా?’’ అని అడుగుతున్నాడు. 
‘‘మొదలు పెట్టావా.. నీ ప్రశ్నల రామాయణం’’ అంటోంది దివ్య.. హాల్లోకి వచ్చి కూర్చుంటూ. ‘‘ఆ.. మొదలైంది మమ్మీ’’ అంటున్నాడు వాడు కిలకిలా.. టీవీ వైపు వేలు చూపిస్తూ.
వాడిని నానమ్మ ఒడిలోంచి తన చేతుల్లోకి తీసుకుంది దివ్య. 
రెండు చేతుల్తో బయట్నుంచి సరుకులు మోసుకొచ్చాడు అమల్‌.
‘‘ఒక్క పురుగు లేదు రోడ్డు మీద’’ అంటున్నాడు.
‘‘అయితే నువ్వొక్కడివేనా పురుగువి.. డాడీ..’’ అన్నాడు ఆర్య. 
పెద్దగా నవ్వాడు అమల్‌.

‘‘అవున్రా.. నిన్ను కూడా తీసుకుని వెళ్లొంటే.. రెండే రెండు పురుగులు ఉండేవి రోడ్డు మీద’’ అంటూ దివ్య దగ్గర్నుంచి తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆర్యని. 
‘‘మనమిక మాటలు ఆపేస్తే, ఆ రాముడి మాటల్ని వినొచ్చు. అంతేకదా నానమ్మా..’’ అని నానమ్మను ఇమిటేట్‌ చేశాడు ఆర్య.. నాన్నను విడిపించుకుని.. నానమ్మ దగ్గరకు గెంతుతూ.  
మెల్లిగా .. మా మూడు జనరేషన్‌లు ‘రామాయణ్‌’ కాలంలోకి వెళ్లిపోయి, ఒకచోట కలిసి కూర్చున్నాయి.
-మాధవ్‌ శింగరాజు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top