వ్యవస్థ విలువ | Gollapudi Maruthi Rao Jeevan Kalam On Judicial In Society | Sakshi
Sakshi News home page

Oct 11 2018 12:54 AM | Updated on Oct 11 2018 12:54 AM

Gollapudi Maruthi Rao Jeevan Kalam On Judicial In Society - Sakshi

ఏ రోజు పేపరు తెరిచినా ఈనాటి దేశ పాలన ఆయా ప్రభుత్వాలు కాక సుప్రీం కోర్టు, చాలాచోట్ల హైకో ర్టులు నిర్వహిస్తున్నాయనిపి స్తుంది. తెల్లవారి లేస్తే ఫలానా పరీక్షలలో అయిదు మార్కులు కలపాలా వద్దా, గవర్నరుగారు ఇచ్చిన తాఖీదు ఫైలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎంత కాలం ఉండవచ్చు, కలిసి ఒక గదిలో బతికే అమ్మాయి, అబ్బాయి ఎంత కాలానికి భార్యాభర్తలనిపించు కుంటారు, అరెస్టయిన ఫలానా వ్యక్తి నేరస్తుడు అవునా? కాదా? చిన్న పిల్లల పునరావాసాలపైన నిబంధనలు సబబా, కాదా? ఫలానా నీటి పారుదల కాలువ పక్కన మరుగుదొడ్డిని నిర్మించవచ్చా, కూడదా?– ఈ విషయాలన్నింటిపై న్యాయం చెప్పా లని సుప్రీంకోర్టును వ్యాజ్యాల ద్వారా అభ్యర్థించారు. 

ఈ మధ్య డీఎంకే నేత ఎం.కరుణానిధి తమిళ నాడులో కన్నుమూశారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. దేశమంతా నివాళులర్పించింది. ఆయన 13 సార్లు శాసనసభకి ఎన్నికై, అయిదుసార్లు రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా సేవ చేశారు. ఒక పక్క శవం ఉండగా ఆయన పార్థివ శరీరానికి మెరీనా బీచ్‌లో అంత్య క్రియలు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఆయన పార్టీ నాయకులు ముఖ్యమంత్రిని అర్థించారు. ముఖ్యమంత్రి కారణాలు చెప్పి కాదన్నారు. రాత్రికి రాత్రే  మద్రాసు హైకోర్టు విచారణ జరిపి, మెరీనాలో కరుణానిధి అంత్యక్రియలు జరపడానికి అనుమతిని ఇచ్చింది. 

బయటవారికి కనిపించేది పాలకవర్గం వ్యతి రేకతో, చట్టపరమైన అభ్యంతరం మాత్రమే కాదు, ఒక పక్క దేశ రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు, విదేశీ ప్రముఖులు నివాళులర్పిస్తుండగా, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏఐడీఎంకే ప్రభుత్వం న్యాయస్థా నంలాగా పెద్దరికం చూపలేకపోయిందే అని.

ఒక అనూహ్యమైన, అద్భుతమైన విషయం. సాలీనా 160 లక్షల పోలీసు కేసులున్న బిహార్‌ దక్షిణ ప్రాంతంలోని ‘పాడియా’ అనే గ్రామవాసులు ఇంత వరకూ న్యాయస్థానం ముఖం చూడలేదు. గత 100 సంవత్సరాలలో ఒక్కటి  ఒక్కటంటే ఒక్క పోలీసు కేసు లేదట. ఇది ఈనాటి భారతదేశంలో తగాదాలు లేని, మధ్యవర్తి అవసరం రాని జీవితం గొప్ప సంస్కారం. ఇది ఒక గ్రామం ఒక శతాబ్దంగా పాటిం చడం, అదిన్నీ మన దేశంలో గొప్ప విడ్డూరం.

న్యాయ వ్యవస్థ మనకు మనం ఏర్పాటు చేసు కున్న ‘నియతి’. ఆ వ్యవస్థ మన సంస్కారానికీ, పరి ణతికీ సూచిక. అయితే ఆ వ్యవస్థ తప్ప మన నిర్ణ యాలకీ, జీవన విధానానికీ గతిలేని స్థితిని తెచ్చు కోవడం ఆ వ్యవస్థ పతనానికి నిదర్శనం. మనం ఏర్పరచుకున్న న్యాయస్థానం గొప్ప విచక్షణ, నిష్పక్ష పాత వైఖరి గల వ్యవస్థ. మన తలకు మించిన సమ స్యలకి దాన్ని ఆశ్రయించడం మన లక్ష్యం. ఏ రామ మందిరం తగాదానో, ఏ ముస్లిం విడాకుల సంప్రదా యమో, కశ్మీరులో 370 అధికరణ ఆవశ్యకతో– ఇలాంటివి సుప్రీంకోర్టు నిర్ణయించి తీర్పు ఇవ్వాల్సిన గంభీరమైన సమస్యలు.

ఫలానా పరీక్షలో అయిదు మార్కులు కల పాలా? రహదారి బంగళా పక్క సారా దుకాణం ఉండాలా? వంటి అతి సామాన్య సమస్యల పరిష్కా రానికి కాదు. మరి ఇప్పుడాపనే జరుగుతోంది. ఈ దేశాన్ని పాలక వ్యవస్థ కాక అతి ముఖ్యమైన కొండ   కచో నవ్వు పుట్టించే, చాలాసార్లు నవ్వులపాలు చేసే సమస్యల పరిష్కారం ఈ వ్యవస్థ మీద పడింది. ఫలానా జాతీయ గీతం ఫలానా చోట వెయ్యాలా వద్దా? అప్పుడు మనం నిలబడాలా, అక్కరలేదా? ఇది వ్యవస్థలో చిత్తశుద్ధి, విచక్షణ లేకపోవడానికి నిద ర్శనమని నాకనిపిస్తుంది.

కాళీపట్నం రామారావుగారి ‘యజ్ఞం’ గొప్ప కథ. వివరాలు అలా ఉండగా స్థానికులు అంగీక రించిన ఊరిపెద్ద శ్రీరాములు నాయుడు ఆ ఊరిలో చిన్న రైతు అప్పలరాముడు అప్పు గురించి నిర్ణ యాన్ని చెప్తాడు. కథంతా ఆ నిర్ణయం పర్యవ సానాన్ని గురించి. ఆ నిర్ణయానికి తలొంచడం ఆ గ్రామం ‘కట్టుబాటు’. నాయుడి తీర్పు విన్నాక పర్య  వసానం కథ. అలా కాక అప్పలరాముడు రొమ్ము విరిచి ‘ఇలా నిర్ణయించడానికి నువ్వెవరయ్యా?’ అన్నా, ‘ముందు పట్నంలో నీ మూడో పెళ్లాం సంగతి తేల్చు’ అని బోర విరిస్తే అది మరొక కథ. ఓ గొప్ప విలువ పతనం.

ఏమిటీ ఈ విపరీతం? ఏమయింది ఈ వ్యవ స్థకి? ఒకరిపట్ల ఒకరికి, ఒక వ్యవస్థపట్ల గౌరవం, నమ్మకం, మర్యాద లుప్తమవడమే ఇందుకు నిద ర్శనం. ప్రతీ విషయానికీ సుప్రీంకోర్టుని ఆశ్రయిం చడం, క్లిష్ట సమస్యపై తీర్పు చెప్పాలని అభ్యర్థిం చడం గడుసైన వ్యవహారం. వ్యవస్థను బెదిరించి నడి పించడమే. 

మనం ఏర్పరచుకున్న గొప్ప వ్యవస్థ మన విశ్వాస రాహిత్యం, విచక్షణా రాహిత్యం, దుర్విని యోగం, నవ్వు పుట్టించే ఆకతాయి వ్యాజ్యాల కార ణంగా మరుగుదొడ్లు, దెయ్యాల స్థాయికి తీసుకువస్తే ఏమవుతుంది? ఏ రోజు పేపరు తెరిచినా అందుకు వంద సమాధానాలు దొరుకుతాయి.


గొల్లపూడి మారుతీరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement