
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మైదుకూరు : మైదుకూరు – బద్వేలు రహదారిపై మున్సిపాలిటీ పరిధిలోని గోపిరెడ్డిపల్లె సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంపర్ల చిన్న వెంకటసుబ్బయ్య (60) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మీదుగా నెల్లూరు వైపు వెళుతున్న లారీ గోపిరెడ్డిపల్లె సమీపంలో నెల్లూరు నుంచి ఇంటి సామానుతో వస్తున్న గూడ్స్ ఆటోను, అలాగే జీవీ సత్రం నుంచి మైదుకూరు వైపు వస్తున్న ప్రయాణికుల ఆటోను ఒకే సారి ఢీ కొంది. సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఉప్పుగుంటపల్లెకు చెందిన వెంపర్ల చిన్న వెంకటసుబ్బయ్య అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ నారాయణ, గూడ్స్ ఆటోలోని డ్రైవర్ మహమ్మద్ బాషా, షేక్షావలి, సింధూర మేషా అనే వారు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని అర్బన్ సీఐ కేవీ రమణారెడ్డి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.