
మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూలుకు కసరత్తు
భువనగిరిటౌన్ : 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను మున్సిపాలిటీల్లో వంద శాతం ఆస్తిపన్ను వసూలుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నారు. గతేడాది ఆర్థిక సంవత్సరం మార్చితో ముగియగా 2025–26 నూతన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది. ఎటువంటి రుసుము లేకుండా త్రైమాసిక పన్ను చెల్లించేందుకు జూన్ 30వ తేదీ వరకు గడువు ఉంది. దీంతో ఆస్తిపన్నుదారులకు డిమాండ్ నోటీసులు పంపిణీ చేస్తున్నారు. డిమాండ్ నోటీసు అందని వారు ఆన్లైన్, మీసేవ కేంద్రాలు లేదా మున్సిపల్ కార్యాలయంలోని కౌంటర్లు, ఇంటి వద్దకు వచ్చే వార్డు అధికారులకు పన్ను చెల్లించవచ్చు. గడువు దాటితే రెండు శాతం ఫెనాల్టీ విధిస్తారు. భువనగిరి మున్సిపాలిటీలో ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆస్తులు 15,331 ఉండగా ఆస్తిపన్ను రూ.9.33 కోట్ల మేర డిమాండ్ ఉంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 210 అసెస్మెంట్స్ పెరిగాయి. వీటి ద్వారా రూ.33 లక్షల ఆదాయం సమకూరనుంది.
నేత్రపర్వంగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు వీధిలో ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. ఆండాళ్ దేవికి ఇష్టమైన నాధస్వరం వినిపించారు. అనంతరం హారతినిచ్చారు. ఇక ప్రధానాలయంలో నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణ వేడుక, ముఖ మండపంలో జోడు సేవోత్సవం తదితర పూజలు గావించారు.
నేడు బక్రీద్
భువనగిరిటౌన్ : త్యాగనిరతిని చాటి చెబుతూ, దైవం పట్ల ఆరాధన భావం పెంచే ‘బక్రీద్’ (ఈద్–ఉల్–అదా) పండుగను శనివారం జిల్లాలోని ముస్లింలు ఘనంగా నిర్వహించుకోనున్నారు. ఈ సందర్భంగా భువనగిరిలోని హైదరాబాద్ చౌరస్తా వద్ద ఉన్న ఈద్గాను ప్రత్యేక ప్రార్థనలకు సిద్ధం చేశారు. తొలుత మసీదులలో ప్రార్థనలు చేసిన అనంతరం ఈద్గాలో ఈదుల్ జుహా ప్రత్యేక నమాజ్ చేయనున్నారు.మత పెద్దలు ధార్మిక సందేశాలు ఇస్తారు. ఈద్గా వద్ద అధికారులు తగిన సదుపాయాలు కల్పించారు.
ఆదాయ వనరులు సమకూర్చుకోవాలి
భూదాన్పోచంపల్లి: అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ఆదాయం పెంచుకోవాలని మున్సిపల్ పరిపాలనా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోత్స్న సూచించారు. శుక్రవారం ఆమె భూదాన్పోచంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. వినోబాభావే మందిరంలో వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు, స్వయం సహాయక మహిళా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వంద రోజుల ప్రణాళికలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వృత్తి, వ్యాపార లైసెన్స్లు జారీ చేయడం, తడి, పొడి చెత్తనుంచి సేంద్రియ ఎరువు తయారు చేసి ఆదాయం సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వాడవద్దని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని వారికి సూచించారు. కుక్కల సంతతి నియంత్రణకు స్టిరిలైజేషన్ చేయాలన్నారు. వందల రోజుల కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని డైరెక్టర్ కోరారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, మేనేజర్ నిర్మల, సీనియర్ అసిస్టెంట్లు రాజేశ్, ఆదిత్య, రవి, జూనియర్ అసిస్టెంట్ ఖయ్యూమ్, వార్డు ఆఫీసర్లు, ఆర్పీలు పాల్గొన్నారు.

మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూలుకు కసరత్తు