
మృత్యువులోనూ వీడని బంధం
రామన్నపేట: వారిద్దరు దంపతులు. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. భర్త ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య క్యాన్సర్ బారిన పడడంతో భర్త మానసికంగా కుంగిపోయాడు. భర్త చనిపోయిన పోయిన కొద్ది గంటల వ్యవధిలోనే భార్య కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో చోటుచేసుకున్న ఘటన అందరినీ కలచివేసింది. ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన రేపాక సునీత(41)కు చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన గుర్రం నర్సింహ(45)తో సుమారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి ఇంద్రపాలనగరంలోనే అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. వారి కుమార్తె అమ్ములు స్థానిక జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి, కుమారుడు శివ 8వ తరగతి చదువుతున్నాడు. నర్సింహ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గిరాకీలు లేక నర్సింహ రోజువారీ కూలీపనులకు వెళ్తూ వచ్చే ఆదాయంతో బతుకు బండిని లాగుతున్నాడు. ఈక్రమంలో భార్య సునీత రెండేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడింది. హైదరాబాద్లో చికిత్స పొందుతోంది. రెండురోజుల క్రితం సునీత తన తల్లితో కలిసి హైదరాబాద్ వెళ్లి వైద్యం నిమిత్తం ఓ ఆస్పత్రిలో చేరింది. రోజు మాదిరిగానే కూలీపనులకు వెళ్లి వచ్చిన నర్సింహ మంగళవారం రాత్రి ఇంట్లో పడుకున్నాడు. బుధవారం తెల్లవారుఝామున చాతిలో నొప్పి రావడంతో తలువుతీసి పక్కింటి వాళ్లను లేపే ప్రయత్నం చేశాడు. వీలుకాక పోవడంతో తన స్నేహితుడికి ఫోన్చేసి తన పరిస్థితిని తెలిపాడు. అతను తన పొరుగువారితో వచ్చి గోడదూకి ఇంట్లోకి ప్రవేశించాడు. చికిత్స నిమిత్తం కారులో భువనగిరి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నర్సింహ మృతి చెందినట్లు తెలిపారు. నర్సింహ మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చిన కొద్దిసేపటికే ఆస్పత్రి నుంచి సునీత చనిపోయినట్లు సమాచారం వచ్చింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. భార్య సునీత అనారోగ్యం పాలైనప్పటి నుంచి నర్సింహ మానసికంగా కుంగిపోయాడని గ్రామస్తులు తెలిపారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు అమ్ములు, శివ అనాథలయ్యారు.
గంటల వ్యవధిలోనే దంపతుల మృతి
ఫ చాతి నొప్పితో బాధపడుతూ
మృతిచెందిన భర్త, క్యాన్సర్ బారిన
పడి చికిత్స పొందుతూ భార్య మృతి