
అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
చౌటుప్పల్ రూరల్: అక్రమంగా కబేళాకు తరలిస్తున్న పశువులను చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద బుధవారం పోలీసులు పట్టుకున్నారు. జనగాంలోని నవాబ్ మార్కెట్లో 5 ఎద్దులను కొనుగోలు చేసి హైదరాబాద్లోని తుక్కుగూడకు తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాయి. ఈమేరకు పశువులను రవాణా చేస్తున్న పహడిషరీఫ్కు చెందిన ఎండీ ఉమర్, సూర్యాపేటలోని జేజేనగర్కు చెందిన ఎండీ మజాయిద్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నర్సిరెడ్డి తెలిపారు.
గడ్డిమోపుల కింద ఆవులను తరలిస్తుండగా..
భువనగిరిటౌన్ : ఎండు గడ్డిమోపుల కింద ఆవులను దాచి రవాణా చేస్తుండగా బుధవారం భువనగిరిలో భజరంగ్ దళ్ నాయకులు పట్టుకున్నారు. రవాణా ట్రక్కు వాహనంలో అడుగున 17 ఆవులను కట్టివేసి పైన ఎండుగడ్డి మోపులను పేర్చి ఆంధ్రప్రదేశ్ రంపచోడవరం నుంచి హైదరాబాద్కు అక్రమ రవాణా చేస్తున్నట్లు గోరక్షకులకు సమాచారం వచ్చింది. భజరంగ్ దళ్ జిల్లా, పట్టణ కన్వీనర్లు బింగి భరత్, నవీన్ తదితరులు బైకులపై ఆవులను అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని వెంటాడి స్థానిక సింగన్నగూడెం చౌరస్తాలో పట్టుకున్నారు. అనంతరం పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పట్టణ ఎస్సై లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి ఆవులను రాజాపేట మండలం చల్లూరు గోశాలకు తరలించారు. వాహనాన్ని సీజ్ చేసి యజమాని రాజు పత్లావత్, డ్రైవర్ మధు, క్లీనర్ కుమార్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.