
డాక్టర్ ఆఫ్ సోషల్ వర్కర్ అవార్డుకు ఎంపిక
చౌటుప్పల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పంతంగి లక్ష్మణ్రావు(పీఎల్ఎన్ రావు)కు డాక్టర్ ఆఫ్ సోషల్ వర్కర్–2025 అవార్డు లభించింది. జర్మనీ దేశానికి చెందిన యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ మంగళవారం ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేసింది. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పలు అంశాలను ఎంపిక చేసి ఆయా అంశాల్లో వ్యక్తులు, సంస్థలు అందిస్తున్న సేవలను గుర్తించి వారికి అవార్డులను అందజేస్తున్నారు. అందులో భాగంగా దక్షిణ భారతదేశ స్థాయిలో తమిళనాడు రాష్ట్రంలోని ఊటీలో గత మూడు రోజులుగా ప్రత్యేక సదస్సు నిర్వహించారు. అందులో భాగంగా గత 20 ఏళ్లుగా పర్యావరణంపై అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యం చేయడంతో పాటు పలు సామాజిక అంశాలపై కూడా పనిచేస్తున్న లక్ష్మణ్రావు సేవలను గుర్తించిన ఆ సంస్థ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు యూనివర్సిటీ ప్రతినిధులు ఆయనకు మంగళవారం ఊటీలో అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్రావు మాట్లాడుతూ.. పర్యావరణ హితం కోరుతూ గత ఇరవై ఏళ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు.