
మరింత చేరువగా ‘రైతు నేస్తం’
రామన్నపేట : రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నాహలు చేస్తోంది. ఇప్పటి వరకు మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో రైతునేస్తం కార్యక్రమం నిర్వహిస్తూ రైతులకు సాగులో అవసరమైన సలహాలు, సూచనలతో పాటు శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు గాను ప్రతి మండలంలో కొత్తగా రెండు వ్యవసాయ క్టస్లర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా అధికారులు సిద్ధం చేశారు.
రైతునేస్తం ఉద్దేశం ఇదీ..
వ్యవసాయంలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రైతునేస్తం కార్యక్రమం ప్రారంభించింది. రైతువేదికలకు వీడియో కాన్పరెన్స్ను అనుసంధానం చేశారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, అభ్యుదయ రైతుల ద్వారా తరగతులు నిర్వహించి పంటల సాగు, మెళకువలు, యాజమాన్య పద్ధతులను, చీడపీడల నివారణ చర్యలను రైతులకు వివరిస్తున్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. నూతన వ్యవసాయ సమాచారం చేరవేయడం జరుగుతుంది. డిజిటల్ ప్లాట్పామ్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఎంతగానో దోహదపడుతుండడంతో రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులకు మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి దశలో మండలానికి ఒక రైతు వేదికను ఎంపిక చేయగా.. అదనంగా రెండు క్లస్టర్లకు విస్తరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి ఐదువేల ఎకరాలకు ఒకటి చొప్పున 92 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి.
ఫ ప్రస్తుతం రైతువేదికల్లోనే ప్రసారం
ఫ అదనంగా మండలానికి
మరో రెండు క్లస్టర్లలో ఏర్పాటు
ఫ ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
ఫ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అమలు
రైతునేస్తం ప్రసారం జరుగుతున్న రైతువేదికలు ఇవీ..
రాజాపేట, గుండాల, వలిగొండ, అడ్డగూడూరు, కొలనుపాక, ఆత్మకూర్(ఎం), అనాజిపురం, రాయరావుపేట, బొమ్మలరామారం, జైకేసారం, చాడ, పాటిమట్ల, మాదాపురం, సంస్థాన్నారాయణపురం, బీమనపల్లి, రామన్నపేట, మాసాయిపేటలోని రైతువేదికల్లో రైతునేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.