రూ.50కోట్లు వాపస్‌ | - | Sakshi
Sakshi News home page

రూ.50కోట్లు వాపస్‌

Apr 30 2025 12:53 AM | Updated on Apr 30 2025 12:53 AM

రూ.50

రూ.50కోట్లు వాపస్‌

సాక్షి, యాదాద్రి: నృసింహసాగర్‌ (బస్వాపురం) రిజర్వాయర్‌ ముంపు గ్రామమైన బీఎన్‌ తిమ్మాపూర్‌ గ్రామస్తులకు పునరావాసం, పరిహారం అందడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు 16 ప్యాకేజీలో భాగంగా 11.39 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన రిజర్వాయర్‌లో భువనగిరి మండలం బీఎన్‌ తిమ్మాపూర్‌తోపాటు మరో రెండు తండాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. బీఎన్‌ తిమ్మాపూర్‌కు పరిహారం కింద రూ.109 కోట్లు ఇవ్వాలి. గత డిసెంబర్‌లో ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. ఇవి నిర్వాసితులకు సరిపోకపోవడంతో పూర్తి నిధులు వచ్చాక పంపిణీ చేద్దామని అధికారులు వేచిచూశారు. ఈలోపు ఆర్థిక సంవత్సరం ముగియడంతో వచ్చిన నిధులు వెనక్కి వెళ్లాయి.

నత్తనడకన లేఅవుట్‌ అభివృద్ధి పనులు

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో భాగంగా భువనగిరి హుస్సేనాబాద్‌లో (బీఎన్‌ తిమ్మాపూర్‌) 28 ఎకరాల లేఅవుట్‌లో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.80 కోట్లు మంజూరు చేసినా పనులు కావడంలేదు. 1047 మందికి ప్లాట్లు పంపిణీ చేశారు. నూతన లేఅవుట్‌లో మౌలిక వసతుల కోసం తొలుత రూ.35 కోట్లు, రెండవ విడతలో రూ.45 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అంగన్‌వాడీ భవనాలు, పాఠశాల భవనాలు, పార్కులు, మంచినీటి సరఫరా, రోడ్లు నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయి. లేఅవుట్‌లో ట్యాంకులు నిర్మించి, అంతర్గత పైప్‌లైన్‌ వేసి, బోర్లు వేసి ఏడాదిన్నర కావస్తున్నా నీరివ్వలేకపోతున్నారు. మురుగు కాల్వల నిర్మాణం, పార్కులు, సీసీరోడ్లు, బీటీ రోడ్లు, ప్రభుత్వం భవనాల నిర్మాణం ప్రారంభం కాలేదు. బీఎన్‌ తిమ్మాపూర్‌ నిర్వాసితులకు ఇక్కడ ఒక్కో కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.7.61 లక్షల నగదును ఇచ్చారు. కొందరు సొంత డబ్బులతో ఇళ్లు నిర్మించుకుంటున్నారు.

కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించినా..

బీఎన్‌ తిమ్మాపూర్‌, జంగంపల్లి, బస్వాపూర్‌, వడపర్తి, లప్పానాయక్‌తండా, రుస్తాపూర్‌ భూనిర్వాసితులకు పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద బీఎన్‌ తిమ్మాపూర్‌, లప్పానాయక్‌ తండా, చోక్లాతండాల్లో ముంపు బాధితులకు మౌలిక సదుపాయాలకుగాను డబ్బులు ఇస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. మూడు విడతల్లో రూ.598.67 కోట్ల పరిహారం అందిస్తామని అప్పట్లో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు హైకోర్టుకు అఫిడవిట్‌ దాఖలు చేశారు. అయితే నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారంపై ఆలస్యం చేస్తుండడంతో హైకోర్టు రెండు సంవత్సరాల క్రితం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

నిర్వాసితులను ఆదుకోవాలి

ముంపు గ్రామమైన తిమ్మపురం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి. సుమారు రూ.400 కోట్లు ఇస్తే భూ నిర్వాసితులు, ముంపు గ్రామ బాధితులకు పరిహారం అందుతుంది. సకాలంలో నిధులు పంపిణీ చేయకపోవడంతో వచ్చిన రూ.50కోట్ల నిధులు వాపస్‌ పోయాయి. మొత్తం పరిహారం ఇవ్వాలి.

– ఎడ్ల సత్తిరెడ్డి, బీఎన్‌ తిమ్మాపూర్‌

పరిహారం అందిస్తాం

బీఎన్‌ తిమ్మాపూర్‌ నిర్వాసితులకు పరిహారం కింద రూ.109 కోట్లు ఇవ్వాలి. గత ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. పరిహారం పంపిణీ కోసం చర్యలు తీసుకుంటున్నాం. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో విద్యుత్‌ సౌకర్యం కల్పించాం. త్వరలో మంచినీటి సమస్య తీరనుంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే పరిహారం పంపిణీ చేస్తాం.

– కృష్ణారెడ్డి, ఆర్డీఓ, భువనగిరి

ఫ బీఎన్‌ తిమ్మాపూర్‌ గ్రామస్తులకు పరిహారం కింద వచ్చిన డబ్బులు వెనక్కి

ఫ పంపిణీలో ఆలస్యం, ఆర్థిక సంవత్సరం ముగియడంతో నిధులు వాపస్‌

ఫ ఆర్‌అండ్‌ఆర్‌ లే అవుట్‌లో చేపట్టిన పనుల్లో జాప్యం

ఫ ప్రారంభం కాని మురుగు కాల్వలు, సీసీ, బీటీ రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు

రూ.50కోట్లు వాపస్‌1
1/1

రూ.50కోట్లు వాపస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement