
పేదల ఇళ్ల తొలగింపు అన్యాయం
పాలకోడేరు: ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ల్లను అన్యాయంగా తొలగిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. అభివృద్ధికి వైఎస్సార్సీపీ అడ్డు కాదని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు మానుకోవాలని అన్నారు. మండలంలోని గొల్లలకోడేరులో ఇటీవల తొలగించిన వ్యాపార సముదాయాల ప్రాంతాన్ని వైఎస్సార్ సీపీ నాయకుల బృందం శనివారం పరిశీలించింది. అనంతరం పార్టీ నేత చేకూరి రాజా నరేంద్రరాజు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ముదునూరి మాట్లాడుతూ కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు తొలగించడంపై పేదలు ఆవేదన చెందుతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లక్షలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి ఇళ్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఇళ్లు తొలగించిన బాధితులకు మూడు సెంట్ల చొప్పున స్థలం ఇచ్చి గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అధికార బలం ఉందని పేదలపై జులుం సరికాదన్నారు. పలు నియోజకవర్గాల్లో సమస్యలు చాలా ఉన్నాయని, పలుచోట్ల ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, డెల్టా ఆధునికీకరణకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదని విమర్శించారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని, ఆక్వా ఫీడ్, సీడ్ ధరలు విపరీతంగా పెరగ్గా నియంత్రించాల్సిన ప్ర భుత్వం పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు.
సూపర్ సిక్స్పై ముఖం చాటేసిన సర్కారు
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ముఖం చాటేసిందని విమర్శించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై బురద చల్లి తిరిగి అదే కొనసాగిస్తున్నారంటే కూటమి నాయకులు అబద్ధాలు చెప్పి ఎలా అధికారం చేపట్టారో అర్థమవుతుందన్నారు. డెల్టా ప్రాంతంలో కాలువలు, డ్రె యిన్లు, రోడ్ల వెంబడి ఆక్రమణలు ఉండటం సహజమని, అయితే ఉండి నియోజకవర్గంలో ఇళ్లు ధ్వంసం సరికాదన్నారు. పేదలకు మూడు సెంట్లు స్థలం ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితికి వచ్చారంటే ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి
ప్రత్యామ్నాయం చూపకుండా తొలగింపా?
ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహరాజు మాట్లాడుతూ పేదలకు ఎటువంటి సమయం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు తొలగిస్తున్నారని విమర్శించారు. ఉండి నియోజకవర్గంలో అవసరం లేకపోయినా పేదల ఇళ్లను తొలగిస్తున్నారని అన్నారు. బాధితులకు కూటమి మేనిఫెస్టో ప్రకారం మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. పేదలకు అన్యాయం జరిగితే వారి పక్షాన పోరాడటానికి వైఎస్సార్సీపీ ముందుంటుందన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల గోపి, పేరిచర్ల విజయ్ బాబు యూత్ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, బంధన పూర్ణచంద్రరావు, నాయకులు చేకూరి రాజా నరేంద్ర రాజు, ఆవుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.