
కీలక పోస్టులు ఖాళీ
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను అధికారుల కొరత వేధిస్తోంది. కీలక విభాగాల్లో అధిపతులు లేకపోవడం.. పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నగరాభివృద్ధికి అత్యంత కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడం, మరికొందరు అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగించడంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యమవుతోంది. అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు చాలా విషయాల్లో చొరవ తీసుకోకుండా దాటవేస్తున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో పరిపాలన గాడి తప్పుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా గ్రేటర్ వరంగల్కు గుర్తింపు ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 8,19,469 మంది జనాభా ఉండగా, ప్రస్తుతం 12లక్షల పైచిలుకు పెరిగినట్లు అంచనా. కొత్త కాలనీలు వెలుస్తుండడంతో జనాభా రెట్టింపవుతోంది. నగరం రోజురోజుకూ వ్యాపార, వాణిజ్య రంగాల్లో దూసుకెళ్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడే వరుసగా వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. సమగ్ర కుటుంబ సర్వే, మన వార్డు–మన ప్రణాళిక, ఆసరా పింఛన్లు, ఆహార భద్రత కార్డులు తదితర పథకాల దరఖాస్తుల స్వీకరణ, సర్వే, సంక్షేమ పథకాల పంపిణీ పనుల్లో అధికారులు, సిబ్బంది బిజీబిజీగా ఉంటున్నారు. దీంతో బల్దియా ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో నగర ప్రజలకు సకాలంలో సేవలు లభించడం లేదు. ఈనేపథ్యంలో నగర అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించే నగర పాలక సంస్థ వింగ్ అధికారుల కొరతతోపాటు సరిపడా క్షేత్రస్థాయి సిబ్బంది లేమితో నగర పరిపాలన నత్తనడకన కొనసాగుతోంది.
సిటీ ప్లానర్ పోస్టు ఖాళీ..
నగర అభివృద్ధిలో కీలక విభాగమైన పట్టణ ప్రణాళిక సిటీ ప్లానర్ పోస్టు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉంది. డిప్యూటీ సిటీ ప్లానర్ ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. రెండు డీసీపీ పోస్టులు, మరో రెండు ఏసీపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాక 25 మంది బిల్డింగ్ ఇన్స్పెక్టర్లకుగాను కేవలం 15 మందితో నడుస్తోంది. ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత వీరిది. క్షేత్రస్థాయి బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు తక్కువ మంది ఉండడంతో ఉన్న వాళ్లకే ఎనిమిది డివిజన్లు, విలీనగ్రామాల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. అంతేకాక ఉన్న వారిలో సగం మందికి పైగా జిల్లాలోని మున్సిపాలిటీలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు లేకపోవడంతో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఇళ్లనిర్మాణాలకు అనుమతులు సకాలంలో ఇవ్వలేకపోతున్నారు.
రెండు ఎస్ఈ పోస్టులు ఖాళీ
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి కావాలన్నా, తాగునీటి సరఫరా సవ్యంగా సాగాలన్నా ఎస్ఈ అవసరం. ఒక ఎస్ఈ 8 నెలల కిందట బదిలీపై వెళ్లారు. మరో ఎస్ఈ గత నెల 31న ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఈఈ శ్రీనివాస్కు ఇన్చార్జ్ ఎస్ఈగా బాధ్యతలు ఇచ్చారు. ఆయన కూడా రెండు నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు. దీంతో ఎస్ఈ పోస్టులకు దిక్కుమొక్కు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏఈల కొరత బల్దియాను వెంటాడుతోంది. ఒక్కొకరికి రెట్టింపు డివిజన్లను కట్టబెట్టారు. పెరిగిన నగర విస్తీర్ణం దృష్ట్యా 25 మంది ఏఈలు ఉండాలి. కానీ అరకొర మందితో నెట్టుకొస్తున్నారు. వెరసి అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు కరువై మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. దీంతో ప్రజాధనం పక్కదారి పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డిప్యూటీ కమిషనర్ పోస్టులు ఖాళీ
కీలకమైన మూడు విభాగాల్లో డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. అందులో కాశిబుగ్గ డిప్యూటీ కమిషనర్ ప్రసునారాణికి కొత్తగా ఏర్పాటైన కేసముద్రం మున్సిపాలిటీకి, కాజీపేట డిప్యూటీ కమిషనర్కు స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీకి ఇన్చార్జ్ కమిషనర్లుగా నియమించారు. ఇలా అదనపు బాధ్యతలతో అధికారులు తమ కొలువులకు న్యాయం చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలని నగరవాసులు కోరుతున్నారు.
అస్తవ్యస్తంగా గ్రేటర్ వరంగల్ పరిపాలన
ఉన్నవారిపై పెరుగుతున్న పనిభారం
కొరవడిన పర్యవేక్షణ.. అభివృద్ధి పనుల్లో
లోపిస్తున్న నాణ్యత
కట్టుతప్పుతున్న కట్టడాలు