
వరంగల్
ఉద్యాన పంటల సాగు లాభదాయకం
రైతులు తక్కువ పెట్టుబడి, ప్రభుత్వ సబ్సిడీ పొందుతూ ఉద్యాన పంటలు సాగు చేసుకోవచ్చని ఉద్యాన అధికారి సుస్మిత తెలిపారు.
సీఎంఆర్ గడువులోగా పూర్తయ్యేనా?
వాతావరణం
ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటుంది. సాయంత్రం అక్కడక్కడా చిరుజల్లులు
కురిసే అవకాశం ఉంది.
శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2025
ఖిలా వరంగల్: ‘వానాకాలం సాగులో రైతులు సరైన విత్తన ఎంపిక, సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన దిగుబడి సాధించవచ్చు. పంటకు విత్తే మూలం.. సరైన విత్తనాలు ఎంచుకుని సమగ్ర విధానాలను అవలంబిస్తే ఆశాజనకమైన దిగుబడులు వస్తాయి’ అని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలిపారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఫోన్ ఇన్లో జిల్లా నలుమూలల నుంచి రైతులు సాగుకు అనువైన విత్తనాలు, అందుబాటులో ఉన్న రకాల వివరాలే కాకుండా సాగు విధానాలు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. రైతులు అడిగిన ప్రశ్నలకు అనురాధ ఇచ్చిన సమాధానాలు ఇలా..
ప్రశ్న: ప్రస్తుత వర్షాలకు వరి నార్లు పోసుకోవచ్చా? ఏరకం విత్తనాలు మేలు?
– రైతు మెండె రమేశ్, పనికెరగ్రామం, నెక్కొండ
జవాబు: జూన్ మొదటి వారం తర్వాత వరినార్లు పోసుకోవచ్చు. ప్రభుత్వం అనుమతించిన సన్న రకాలను విత్తుకుంటే మద్దతు ధరతోపాటు బోనస్ వస్తుంది.
ప్రశ్న: పచ్చిరొట్ట విత్తన ధరలు గతేడాదిలో పోలిస్తే పెరిగాయి ఎందుకని? – జి.సురేందర్ చంద్రగొండ నెక్కొండ
జవాబు: విత్తనోత్పత్తి తగ్గడంతో కొంత మేర ధర పెరిగింది. ప్రభుత్వ సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలు జిల్లావ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి.
ప్రశ్న: డీఏపీ కాంప్లెక్స్ ఎరువులకు సైతం మరింత సబ్సిడీ ఇచ్చే ఆలోచన ఉందా?
– రావుల భాస్కర్, రాయపర్తి
జవాబు: యూరియా వాడకం తగ్గించేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం. కాంప్లెక్స్ ఎరువుల్లోనూ యూరియా పాళ్లు ఉంటాయి. ఫార్మల్ ఐడీ విధానం అమలైతే భూమి ఆధారంగా కోటా నిర్ధారించే అవకాశం ఉంది.
ప్రశ్న: పెసర ఎప్పుడు, ఏరకాలు విత్తుకోవచ్చు?
– తోటకూరి సాయిలు, పెర్కేడు రాయపర్తి మండలం
జవాబు: వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు దుక్కలు సిద్ధం చేసుకుని 60మి.మీల వర్షపాతం నమోదయ్యాక జూన్ మొదటి వారం నుంచి పెసర విత్తుకోవచ్చు. ఎంజీజీ రకాలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రశ్న: పంటల సాగుపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారా? – ఏసీరెడ్డి ప్రభాకర్, తూర్పు కోట
జవాబు: రైతుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. లైసెన్స్డ్ డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తే నాసిరకం బెడద ఉండదు.
ప్రశ్న: వానాకాలంలో సాగు చేసే సన్న గింజ వరి రకాలు తెలపండి? – కందుల సారంగం బొల్లికుంట
జవాబు: సన్నరకాల్లో డబ్ల్యూజీఎల్ 44(సిద్ది) జూన్ 15 వరకు నార్లు పోసుకుని దీర్ఘకాలిక రకం.. కేఎన్ఎం 1638 రకం, సల్ప కాలిక రకంలో జూలై నెలలో నారు పోసుకునేందుకు అనువైన రకం ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా వంటివి సాగు చేసుకోవచ్చు.
ప్రశ్న: వరిలో చౌడు నేలలను తట్టుకుని మంచి దిగుబడి ఇచ్చే రకాలేంటి?
– పులి అశోక్, లింగగిరి గ్రామం, చెన్నారావుపేట
జవాబు: చౌడు నేలలను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే దొడ్డు రకం కేఎన్ఎం రకం 118 సాగుకు అనుకూలం.
ప్రశ్న: వర్షాధారంగా సాగు చేసే కంది రకాలను వివరించండి?
– చంద్రమౌళి ల్యాబర్తి, వర్ధన్నపేట
జవాబు: పీఆర్జీ 176, టీడీఆర్జీ 4, డబ్ల్యూఆర్ జీఈ97, డబ్ల్యూర్జీఈ 121, వంటి రకాలను సాగు చేసుకోవచ్చు.
ప్రశ్న: పప్పు ధాన్యాల్లో వాడే జీవన ఎరువులు ఏవి?
– వెంకటేశ్వర్లు పర్వతగిరి
జవాబు: రైజోబియం 200 గ్రాములు, పాస్పోబ్యాక్టీరియా 200 గ్రాములు కలిపి ఒక ఎకరానికి సరిపడా విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసి 24 గంటల్లోపు విత్తనాన్ని విత్తుకోవాలి.
ప్రశ్న: ఆయిల్ ఫామ్లో మొక్కజొన్నను అంతర పంటగా వేసుకోవచ్చా?
– మల్లికార్జున్, చింతకుంట, పర్వతగిరి
జవాబు: 19 నెలల వయస్సు ఉన్న తోటలో అంతర పంటగా మొక్కజొన్న కంటే కూరగాయలు, పెసర, మినుము సాగు మేలు. దుక్కి ఎక్కువగా దున్నకూడదు. అలా చేస్తే ఆయిల్ ఫామ్ వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. యాసంగి పంటగా మాత్రం మొక్కజొన్నకు అవకాశం ఉంది.
ప్రశ్న: మెట్ట వరి సాగులో అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఏవి?
– నాగుల్ల కుమారస్వామి, పర్వతగిరి
జవాబు: మెట్టలో వరి సాగు చేస్తే అంతగా దిగుబడులు రాకపోగా.. సమస్యలు ఉత్పన్నమవుతాయి. కలుపు, తెగుళ్ల సమస్యలు ఉంటాయి. అలాగే ఆరుతడి వరి సాగులో ఆశించిన ప్రయోజనాలు ఉండవు.
ప్రశ్న: పచ్చిరొట్ట విత్తనాలు పక్కదారి పట్టకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? – ఎం.తిరుపతిరెడ్డి, మామునూరు
జవాబు: రైతుల కోసం అందుబాటులో ఉంచే పచ్చిరొట్ట విత్తనాలు పక్కదారి పడితే సహించేది లేదు. ఎవరైనా సరే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. తీసుకున్న విత్తనాలపై అవసరమైన ప్రాంతాల్లో క్రాస్ బుకింగ్ చేయిస్తాం.
ప్రశ్న: ఈవర్షాలతో పత్తి సాగు చేయొచ్చా? పెసర పంట వేసుకోవచ్చా?
– గుండాల కమలాకర్, నల్లబెల్లి
జవాబు: ఈఏడాది రోహిణి కార్తెలోనే వానలు కురుస్తున్నాయి. నేలలో పదును ఆధారంగా జూన్ 10 తర్వాత పత్తి విత్తనాలు విత్తుకోవచ్చు. పెసర కూడా జూన్ రెండో వారం నుంచి విత్తుకోవచ్చు. పెసరలో ఎంజీజీ రకాలు, వరంగల్ రకాలు అనుకూలం.
ప్రశ్న: విత్తనాలు నాసిరకానివి, మంచివి ఎలా గుర్తించాలి?
– వేముల రమేశ్, నల్లబెల్లి
జవాబు: లైసెన్స్డ్ విత్తన షాపుల్లో మాత్రమే కొనుగోలు చేయాలి. అన్ని వివరాలతో రశీదు తీసుకోవాలి. అపరిచిత వ్యక్తులు మాయమాటలతో అమ్మే విత్తనాలు నకిలీవని భావించాలి.
ప్రశ్న: బెండ సాగు చేస్తున్నా.. ఆకులు, కాయలు తెల్లగా మారుతున్నాయి?
– ధరావత్ నాగు, సూర్యపేట తండా, చెన్నారావుపేట
జవాబు: తెల్లదోమ ద్వారా తెగులు వాప్తి చెందుతుంది. నివారణకు లీటరు నీటికి 1.5 గ్రాములు ఏపీఫెట్ 3 మిల్లీ లీటర్ల వేపనూనె (3000 పీపీఎం) కలిపి పిచికారీ చేసుకోవాలి.
ప్రశ్న: ఆయిల్ ఫాం సాగుకు రాయితీ ఉందా? సాగు చేసుకోవచ్చా?
– సింగారపు యాకూబ్ జల్లి, చెన్నారావు
జవాబు: ఆయిల్ ఫాం సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. తక్కువ పెట్టుబడితో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం వచ్చే ఈపంటను సాగు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ రైతులకు డ్రిప్ పరికరాలతోపాటు రాయితీ ఇస్తోంది.
ప్రశ్న: ముందస్తు వర్షాలు కురుస్తున్నాయి. పత్తి గింజలు విత్తుకోవచ్చా? – బత్తుల ప్రవీణ్, బాపునగర్, చెన్నారావుపేట
జవాబు: వర్షాలు కురిసినప్పటికీ నేల నుంచి వేడి తగ్గలేదు. సమృద్ధిగా వర్షాలు కురిసిన తర్వాతే (జూన్ 10 తర్వాతే) విత్తనాన్ని విత్తుకుంటే వందశాతం మెలక వస్తుంది.
న్యూస్రీల్
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కలెక్టర్ సత్యశారద
ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
సమగ్ర యాజమాన్య పద్ధతితోనే అధిక దిగుబడి
అనుమతి ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు కొనాలి
సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై
వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి
అనురాధ సూచనలు, సలహాలు
‘సాక్షి’ ఫోన్ ఇన్కు విశేష స్పందన

వరంగల్

వరంగల్