
ఆరుసార్లు.. అవస్థలు!
అప్పుడలా.. ఇప్పుడిలా..
ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులుంటే ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున 24 కిలోలు వస్తాయి. గత మే నెలలో ఒకేసారి లబ్ధిదారుడు వేలిముద్ర పెడితే 24 కిలోల బియ్యం డీలర్లు ఇచ్చేవాళ్లు. అదే మూడు నెలల కోటా ఒకేసారి ఇచ్చేందుకు ఈ–పాస్ యంత్రాన్ని అప్డేట్ చేయడం వల్ల 24 కిలోలకు రావాల్సిన వాళ్లకు 20 కిలోలకు ఒకటి, నాలుగు కిలోలకు ఒకటిగా వేర్వేరుగా కేంద్రం, రాష్ట్రం కోటా కింద రెండుసార్లు వేలిముద్రలు తీసుకుంటున్నారు. అది కూడా ఒక నెలకు రెండుసార్లు, మూడు నెలలకు కలిపి ఆరుసార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి వస్తుండడంతో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ఈపద్ధతిలో బియ్యం ఇవ్వడానికి 20 నుంచి 30 నిమిషాల సమయం తీసుకుంటోంది.
సాక్షి, వరంగల్: జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ పరేషాన్ చేస్తోంది. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం జూన్ నెలలోనే ఇవ్వాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈనేపథ్యంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ డీలర్లతో పాటు ఆ బియ్యం తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులకు సాంకేతిక ఇబ్బందులు తప్పడంలేదు. కేంద్రం, రాష్ట్ర కోటాకు వేర్వేరుగా వేలిముద్రలు వేయాల్సి ఉండగా.. మూడు నెలలకు సంబంధించి ఆరుసార్లు వేలిముద్రలు వేస్తేనే బియ్యం ఇస్తున్నారు. ఈ సమయంలో తరచూ సాఫ్ట్వేర్లో సాంకేతిక సమస్యలు వస్తుండడంతో ఒక్కో లబ్ధిదారుడికి 20 నుంచి 30 నిమిషాల సమయం తీసుకుంటోంది. కొన్ని సందర్భాల్లో వేలిముద్రలు సరిగ్గా తీసుకోక పోవడంతో తిరిగి మళ్లీ రేషన్ దుకాణాలకు సాయంత్రం వచ్చి తీసుకెళ్తున్నవారూ ఉన్నారు. ఇలా సాంకేతిక సమస్యలతో అటు రేషన్డీలర్లు, లబ్ధిదారులకు తిప్పలు తప్పట్లేదు. రోజంతా కూర్చున్నా డీలర్లు పది క్వింటాళ్ల బియ్యం సైతం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వరంగల్ నగరంతో పాటు జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పౌరసరఫరాల అధికారులకు ఫిర్యాదులు వస్తున్నా.. అదంతా రాష్ట్రస్థాయిలోనే ఉందని, రాష్ట్రమంతటా ఒకటే సాఫ్ట్వేర్ ఉందనే సమాచారమిచ్చి మిన్నకుండిపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఇబ్బందులు రాకుండా చూడాలని డీలర్లు కోరుతున్నారు.
దఫాల వారీగా సరఫరా...
జిల్లా వ్యాప్తంగా 509 రేషన్ దుకాణాలుండగా, 2,66,479 మంది రేషన్ కార్డులున్నాయి. 7,94,087 మంది లబ్ధిదారులున్నారు. వీరికి నెలకు 5,01,441 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమవుతోంది. అంటే మూడు నెలలకు కలిపి 15,04,323 మెట్రిక్ టన్నుల బియ్యం ఒకే నెలలో లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఇప్పటికే వరంగల్ ఏనుమాముల, నర్సంపేట వర్ధన్నపేట ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా దఫాలవారీగా రేషన్ దుకాణాలకు బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు సరఫరా చేస్తున్నారు. మూడు నెలలకు కలిపి బియ్యం నిల్వలకు ఆయా రేషన్ దుకాణాల్లో సరిపడినంత స్థలం లేకపోవడంతో రేషన్ డీలర్ల సమాచారం మేరకు ఆయా దుకాణాలకు మళ్లీ సన్నబియ్యం కోటాను అందిస్తున్నారు. అయితే ఒక్కో వ్యక్తి నుంచి ఆరుసార్లు వేలిముద్రలు స్వీకరించడం ఒక ఎత్తయితే ముఖ్యంగా వృద్ధుల వేలిముద్రలు చాలా రేషన్ దుకాణాల్లో సరిగ్గా ఆయా సాఫ్ట్వేర్లు తీసుకోకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓటీపీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంచాలని లబ్ధిదారులు అంటున్నారు. దీనివల్ల రేషన్ దుకాణం వద్ద తొందరగా లైన్లు క్లియర్ అవుతాయంటున్నారు.
లబ్ధిదారులు వేలిముద్రలు వేస్తేనే బియ్యం
ఈపాస్ యంత్రం అప్డేట్తో తిప్పలు
మూడు నెలల కోటా ఒకేసారి..
ఒక్కొక్కరికి 20 నుంచి 30 నిమిషాలు
సాంకేతిక సమస్యలతో
వెనుదిరుగుతున్న ప్రజలు