
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ.. నేడు ‘వెన్నుపోటు దినం’
● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం: ఎన్నికలకు ముందు ప్రకటించిన హమీలు నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న దగాపై ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 11 నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మంగళవారం పిలుపునిచ్చారు. నిరసన ర్యాలీలు చేపట్టి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు కూటమి ప్రభుత్వం చేస్తున్న దగా పాలనపై వినతిపత్రాలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి అదనపు బాధ్యతలు
విజయనగరం టౌన్: ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.వెంకటేశ్వరరావుకు సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకులుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు పనిచేసిన జిల్లా సాంఘిక సంక్షేమాధి కారి బి.రామానందం పదోన్నతిపై అనకాపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఈడీ వెంకటేశ్వరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
5న రాష్ట్ర మాలల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ రాక
రాష్ట్ర మాలల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయకుమార్ ఈ నెల 5న గురువారం జిల్లాలో పర్యటించనున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ ఈడీ డి.వెంకటేశ్వరరావు తెలిపారు. కలెక్టర్, ఇతర జిల్లా అధికారులతో సమావేశమై పథకాల అమలుపై చర్చిస్తారని పేర్కొన్నారు.
జేఎన్టీయూ జీవీలో ఆన్లైన్ శిక్షణ
విజయనగరం అర్బన్: జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ), ఢిల్లీ యూనివర్సిటీ యూజీసీ, మాలవియామిషన్ టీచర్ ట్రైవింగ్ సెంటర్, ఎస్జీటీబీ ఖల్సా కాలేజీ సంయక్త నిర్వహణలో బోధన సిబ్బందికి ఈ నెల 13 తేదీ వరకు నిర్వహించే ఆన్లైన్ శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. జాతీయ విద్యావిధానం–2020పై బోధనా సిబ్బందికి అవగాహన కల్పించడం, సున్నితత్వాన్ని పెంపొందించే అంశాల్లో ఇచ్చే శిక్షణకు జేఎన్టీయూ జీవీ అనుబంధ కాలేజీల నుంచి సుమారు 200 మంది హాజరయ్యారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్, కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ జి.జయసుమ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ సాంకేతిక విద్యా విధానంపై అవగాహన పెంచుకోవడానికి ఇలాంటి శిక్షణలు దోహదపడతాయన్నారు.
సినిమా థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు
చీపురుపల్లి: పట్టణంలోని రాధామాధవ సినీ కాంప్లెక్సు ఆవరణలోని వంశీ, విష్ణు, వైభవ్ సినిమా థియేటర్లను ఆర్డీఓ ఆశియ్య, డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు, తహసీల్దార్ రాజారావు తదితరులు మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్లో తినుబండారాలు, వాటర్ బాటిళ్లు, డ్రింకుల అమ్మకాలు, ధరల పట్టికలను పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సినీ కాంప్లెక్స్ను తనిఖీ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ రామ్కుమార్, వీఆర్వో గోవిందరావు, వీఆర్ఏ శంకర్, తదితరులు పాల్గొన్నారు.
వృద్ధులకు ఇంటివద్దనే రేషన్
విజయనగరం ఫోర్ట్: వృద్ధులు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలతో మంచం పట్టినవారికి ఇంటివద్దకే రేషన్ సరుకులు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు జిల్లా పౌరసరఫరాల అధికారి కె.మధుసూదన్రావు తెలిపారు. అటువంటి వారికి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు డీలర్ స్వయంగా ఇంటికి సరుకులు అందజేయాల్సి ఉంటుందన్నారు. ప్రతినెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశాలిచ్చామన్నారు.

అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ.. నేడు ‘వెన్నుపోటు దినం’