
బీసీ సంక్షేమ శాఖ బదిలీల్లో అవకతవకలు
విజయనగరం టౌన్:
బీసీ సంక్షేమ శాఖలో హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్ (వార్డెన్)ల బదిలీల ప్రక్రియకు సంబంధించి అస్మదీయులకు ప్రాధాన్యతనిచ్చినట్టు, నిబంధనలకు విరుద్ధంగా జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీల ప్రక్రియలో భాగంగా సీనియారిటీ ప్రకారం చేపట్టాల్సిన ప్రక్రియను పక్కదోవ పట్టించి సీనియారిటీ తక్కువ ఉన్న వారికి అందలం ఎక్కించడంలో ఆ శాఖ అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియారిటీలో 6, 7 స్థానాల్లో ఉన్న వారికి విజయనగరం హెడ్క్వార్టర్స్లోనూ, మరొకరిని నెల్లిమర్లకు బదిలీ చేశారు. రెండో స్థానంలో ఉన్న హాస్టల్ వార్డెన్ గతంలో సాలూరు, చీపురుపల్లి, ఎస్.కోటలో పని చేశారు. జిల్లా కేంద్రంలో పని చేయలేదు. ఇదిలా ఉంటే గతంలో జిల్లా హెడ్క్వార్టర్లో పని చేసిన వారికి ఇప్పుడు సీనియారిటీలో చివరి స్థానమైన 6, 7 స్థానాలను మరలా జిల్లా కేంద్రానికి, నెల్లిమర్లలకు బదిలీ చేశారు. రెండో స్థానంలో స్పౌజ్ సర్టిఫికెట్ జత చేసి ఉన్న హాస్టల్ వార్డెన్ను జిల్లాలో మారుమాల ప్రాంతమైన చిన్నమేరంగికి బదిలీ చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించి, పూర్తి స్థాయిలో స్వీయ విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై బీసీ సంక్షేమాధికారిణి జ్యోతిశ్రీని వివరణ కోరగా నిబంధనల ప్రకారమే బదిలీల ప్రక్రియ కొనసాగిందన్నారు. కమిటీలోని సభ్యులందరూ ఆమోదంతోనే ప్రక్రియ చేపట్టామని స్పష్టం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా బదిలీల ప్రక్రియ
బదిలీల్లో సీనియారిటీకి ప్రాధాన్యతనివ్వని యంత్రాంగం?
కమిటీ ఆధ్వర్యంలోనే బదిలీలు చేపట్టామన్న అధికారులు