
అంతా గుట్టుగానే...!
పేదలకు చేరాల్సిన బియ్యం కోళ్ల ఫారాలకు, మామిడి తోటలకు పెద్ద ఎత్తున తరలిపోయాయి. అదీ కూడా ప్రభుత్వ సరఫరా చేసిన నార సంచుల ద్వారానే... అంటే వీటి తరలింపు వెనుక ఎవరో గుర్తు తెలియని పెద్ద హస్తమే ఉందన్నది నిజం. అలాగే అధికారులు, డీలర్ల పాత్ర కూడా ఉండే ఉంటుందన్నది జనాభిప్రాయం. అయితే వీటిని పట్టుకున్న అధికారులు పెద్ద తిమింగలాలను వదిలేసి చిట్టెలుకలపై చర్యలకు తమ వంతు చర్యలు తీసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. అసలు ఈ తరలింపు గుట్టు విప్పాలంటే దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలను బయటకు లాగాలని ప్రజలు సూచిస్తున్నారు.
● ఆ బియ్యం ఎక్కడ నుంచి వచ్చాయి?
● అసలు దొంగలను వదిలేశారనే ఆరోపణలు
● రేషన్ దుకాణాల్లో ఉండాల్సిన బియ్యం వ్యాపారుల దగ్గరికి ఎలా చేరాయి?
● డీలర్లు, అధికారుల పాత్రపై అనుమానాలు
విజయనగరం ఫోర్ట్:
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించే పీడీఎస్ బియ్యం పెద్ద ఎత్తున పక్కదారి పట్టిన విషయం తెలిసిందే. ప్రతీ నెల ప్రజలకు బియ్యం, పంచదార నిత్యావసర వస్తువులు ప్రజలకు అందిస్తారు. సివిల్ సప్లయి పరిధిలో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం, పంచదార వాహనాల ద్వారా సరఫరా చేస్తారు. మే నెల వరకు నిత్యావసర వస్తువులు ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికి అందించేవారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుంది.
బొండపల్లి మండలంలో పట్టుబడిన పీడీఎస్ బియ్యం
పేదలకు అందించే బియ్యాన్ని కొంతమంది వ్యాపారులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టించారు. ఈ సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కొండకిండాంలోని కోళ్ల ఫారంలో 106 క్వింటాళ్లు పీడీఎస్ బియ్యం, కిండాం ఆగ్రహారం మామిడి తోటలో 43 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పీడీఎస్ బియ్యం ఎలా అక్కడకు తరలించారనేది అనుమానాస్పదంగా ఉంది. దీని వెనుక ఎవరెవరున్నారో తేలాల్సి ఉంది. అధికారులు, డీలర్లు పాత్ర లేకుండా జరిగే పని కాదని సర్వత్రా చర్చనీయాంశమైంది.
డీలర్లు, అధికారుల పాత్రపై అనుమానాలు..!
పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలించే వ్యాపారులు నార సంచుల్లో నేరుగా తరలించడం కుదరదు. రేషన్ డీలర్లు లేదా అధికారుల సహకారంతోనే పీడీఎస్ బియాన్ని వ్యాపారులు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి పాత్ర లేకపోతే బియ్యం వ్యాపారులు అంత దర్జాగా వీటిని తరలించలేరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొండకిండాం కోళ్ల ఫారంలో నార సంచుల్లో పట్టుబడ్డ
పీడీఎస్ బియ్యం
బియ్యం ఎవరు తరలించారు?
పక్కదారి పడుతున్న విచారణ?
పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న అధికారులు వాటిని తరలించే వ్యాపారులపై కేసులు నమోదు చేసి అసలు దొంగలను వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బియ్యం వ్యాపారులకు పీడీఎస్ బియ్యాన్ని ఎవరు విక్రయించారు, రేషన్ డీలర్లు విక్రయించారా, లేదంటే ఎంఎల్ఎస్ పాయింట్స్ సరఫరా చేస్తున్న సమయంలో పక్కదారి పట్టించారా.. అనే దానిపై విచారణ చేపట్టాల్సి ఉండగా.. ఆ దిశగా విచారణ జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ షాపుల్లో ఉండాల్సిన బియ్యం అంత ధైర్యంగా ఎలా తరలించారు అనేది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న.
క్రిమినల్ కేసులు పెట్టాం..
పీడీఎస్ బియ్యం తరలించిన వ్యక్తులపై 6ఏ కేసులతో పాటు క్రిమినల్ కేసులు పెట్టాం. పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం పట్టుబడడంతో సీరియస్గా దీన్ని తీసుకున్నాం. బియ్యం ఎక్కడ నుంచి తరలించారన్న దానిపై విచారణ చేయాలని పోలీసులను కోరాం. – కె.మధుసూదనరావు,
జిల్లా పౌర సరఫరాల అధికారి
రేషన్ దుకాణాల్లో ఉండాల్సిన పీడీఎస్ బియ్యం కోళ్ల ఫారంకు, మామిడితోటలోకి ఎవరు తరలించారనే ప్రశ్న సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఎంఎల్ఎస్ పాయింట్స్ ద్వారా నార సంచుల్లో ప్రభుత్వ ముద్ర వేసిన ట్యాగ్తో పీడీఎస్ బియ్యం రేషన్ షాపులకు సరఫరా అవుతుంది. అవే సంచులతో బియ్యం పక్కదారి పట్టడం వెనుక ఎవరి హస్తం ఉందన్నది తేలాల్సి ఉంది. ఎంఎల్ఎస్ పాయింట్స్ ద్వారా రేషన్ షాపులకు సరఫరా అవుతున్న సమయంలో పక్కదారి పట్టించారా... లేదా రేషన్ షాపులకు సరఫరా అయిన తర్వాత డీలర్లు సాయంతో పక్కదారి పట్టించారా... అన్న విషయంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంతా గుట్టుగానే...!