
వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేయకపోతే ఉద్యమమే
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో ఎస్జీటీలకు మాన్యువల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలుపుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. తొలిత షెడ్యూల్లో ప్రకటించిన వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని ప్రకటించింది. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లోని డీఈవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీల నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పిందని ఈ రోజు లీప్ యాప్లో వెబ్ కౌన్సెలింగ్ మోడల్ వీడియోను విడుదల చేశారని అన్నారు. వెబ్ కౌన్సెలింగ్ విధానంలో రెండు వేలకు పైగా ఆప్షన్స్ నమోదు చేయడం తప్పనిసరి బదిలీ ఉపాధ్యాయులకు కష్టతరమని అన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడిలో ఉన్నారని, ఇచ్చిన మాట ప్రకారం ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని డీఈవో మాణిక్యంనాయుడుకు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు డి.శ్రీనివాస్, వి.రవీంధ్రనాయుడు, జోగారావు, కేఎస్ శ్రీనివాసరావు, సూరిబాబు, బంకపల్లి శివప్రసాద్, డి.రాము, డి.ఈశ్వరరావు, జేవీఆర్కే ఈశ్వరరావు, పైడిరాజు, పి.శ్రీనివాసరావు, ఎన్.రమణ, కంది రామారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మాటిచ్చారు... నిలుపుకోండి
ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక
డీఈవో కార్యాలయం ఎదుట నిరసనలు