
రామతీర్థంలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శనివారం పలువురు చిన్నారులు చేసిన సంప్రదాయబద్ధ నృత్య ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విజయనగరంలోని మయూరి నృత్యాలయ డైరెక్టర్ శ్రీదేవి కృష్ణ ఆధ్వర్యంలో స్వామి సన్నిధిలో విద్యార్థినులు నత్య నీరాజనాన్ని సమర్పించారు. రఘుకుల తిలకా రారా..నిన్నెత్తి ముద్దులాడెదరా..అంటూ జానపద గేయానికి చిన్నారులు చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది.
హడలెత్తిస్తున్న ఏనుగులు
భామిని: మండలంలోని తాలాడలో నాలుగు ఏనుగుల గుంపు శనివారం హడలెత్తించింది. ఎండ తీవ్రత తగ్గిన వెంటనే తోట నుంచి బయటకు వచ్చి రోడ్లు వెంబడి సంచరించిన ఏనుగులు బెంబేలెత్తించాయి. కొద్ది రోజులుగా తాలాడ సమీపంలోని ఐలమ్మ తోటలో తిష్ఠ వేసిన ఏనుగులు ఆహారం కొరతతో సాయంత్రం బయటకు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఏనుగుల గుంపు వెంట స్థానికులు పరుగులు తీశారు. శుక్రవారం రాత్రి మొక్కజొన్న గింజల బస్తాలు ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు ఎటువైపు పయనిస్తుందోనన్న భయాందోళనతో ఏనుగుల వెంట వెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
గోతిలో పడి కార్మికుడికి
తీవ్ర గాయాలు
బొబ్బిలి: మండలంలోని అలజంగి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు అలజంగి ఆచారి శుక్రవారం రాత్రి బాడంగి, రామభద్రపురం మండల కేంద్రాలకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రామభద్రపురం–జగనన్న కాలనీల మధ్య ఉన్న పెద్ద గోతిలో పడిపోయాడు. దీంతో తల, కాలర్బోన్లకు గాయాలయ్యాయి. గాయపడిన ఆచారిని బాడంగి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆచారిని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకర రావు శనివారం వెళ్లి పరామర్శించారు. పేద కార్మికుడికి తీవ్ర గాయాలైతే ఆదుకోవాల్సిన భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, దీంతో పేదలైన కార్మికులు వీధిన పడుతున్నారన్నారు. ఆచారి నిరుపేద అని, ఇద్దరు చిన్న ఆడపిల్లలతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడని, దాతలెవరైనా ఫోన్ 7780623626 నంబర్ను సంప్రదించి తోచినంత సహాయం చేయాలని కోరారు.
నేడు డీసీసీబీ చైర్మన్గా కిమిడి నాగార్జున
బాధ్యతల స్వీకరణ
విజయనగరం అర్బన్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్గా కిమిడి నాగార్జున ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు డీసీసీబీ సీఈఓ సీహెచ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నగరంలోని పూల్భాగ్ రోడ్డులో ఉన్న ‘జె’ కన్వెన్షన్లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన పదవీ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, కింజరావు అచ్చెన్నాయుడు. జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
డీసీఎంఎస్ చైర్మన్గా గొంప కృష్ణ..
అలాగే జిల్లా సహకార మార్కెంటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్గా నియమితులైన గొంప కృష్ణ ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నట్లు డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ సాయికుమార్ తెలిపారు. మధాహ్నం 1 గంటకు నగరంలోని పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు.

రామతీర్థంలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

రామతీర్థంలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన