
ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలి
పార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ను చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో మలేరియా ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయని ఆయా ప్రాంతాల్లో మరింత సమర్థవంతంగా డ్రైవ్ను నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో మంచి పారిశుద్ధ్య పరిస్థితులు ఏర్పడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అందుకు గ్రామ పంచాయతీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త సేకరణ జరగాలని వాటిని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పంపించాలని సూచించారు. వ్యక్తిగతంగా, గృహపరంగా పరిశుభ్రమైన వాతావరణం కలిగి ఉండాలని తద్వారా రోగాలకు దూరంగా ఉండవచ్చన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలని కోరారు. నీటి నిలవకు అవకాశం లేకుండా ఖాళీ కొబ్బరి బొండాలు, సీసాలు, టైర్లు, పాత్రలు తదితర పరికరాలపై దృష్టిసారించి అవి ఎక్కడ లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
జూన్లోనే పారిశుద్ధ్య డ్రైవ్
జూన్ నెలలోనే జిల్లాలో పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టడం వల్ల రానున్న నెలల్లో సులభతరమవుతుందన్నారు. మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయడం, దోమల నివారణ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. గ్రామాల దగ్గరలో ఉండే నీటి వనరులలో గంబూషియా చేపలను వదలడం వల్ల లార్వా నిరోధక వ్యవస్థగా పనిచేస్తుందని చెప్పారు. ప్రతి ఇంట్లోనూ, బయట దోమల నివారణగా స్ప్రేయింగ్ జరగాలని ఆదేశించారు. దోమ తెరల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. పురపాలక సంఘాల్లో కూడా పెద్ద ఎత్తున శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని, కాలువల్లో పూడికలు తీయాలని, మురుగునీరు ఎక్కడా నిలవ లేకుండా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్